Wednesday, December 10, 2014

మహాత్ములను తెలుసుకోవడం ఎలా ?

మహాత్ములను తెలుసుకోవడం ఎలా ?  

ప్రస్తుతం గారడీలతో పలువురు అనేక విధాలుగా మోసగిస్తున్న తరుణంలో, మాహాత్ములకు, గారడీ వాళ్లకు ఉన్న అంతరాన్ని గుర్తించేందుకు పెద్దలు చెప్పిన కొన్ని శ్లోకాలు, వాటి అర్ధాలు, మీకు ఇక్కడ ఇస్తున్నాను.

మహత్వ కార్యం క్రియతే మహద్భిః
హరేర్మహత్వ ప్రతిపాదనార్ధం |
ద్రష్టుశ్చ బుద్దేః పరివర్తనార్ధం
తద్భో మహాత్వస్య పరా పరీక్షా !

మహాత్ములు భగవంతుడి శక్తిని చూపించేందుకూ, చూసేవారిలో మంచి పరివర్తన కలిగించేందుకూ , మహిమలు చేస్తూ ఉంటారు. ఒక పని మాయా, మహత్తా అని నిరూపించేందుకు ఇదే చివరి పరీక్ష !

కో వేంద్ర జాలస్య మహాత్మనశ్చ
యధేష్ట సృష్టి ప్రణవస్య భేదః
ఏకశ్చమత్కార గతార్ధశక్తిః
మనఃపరీవర్తన చుంచురస్య |

గారడీ వాడు, మహాత్ముడు, ఇద్దరూ తలచుకున్నవి సృష్టి చేసేవారే. ఇద్దరిలో తేడా ఏమిటి ? ఒకరి శక్తి చూపరుల్లో ఉల్లాసం కలిగిస్తే, రెండవవారి శక్తి చూపరుల హృదయాలలో పరివర్తన కలిగిస్తుంది.



అంటే, వారు చేసే కార్యం వల్ల భగవంతుడి మహత్తు వెల్లడి కావాలి, ఆ కార్యం చూస్తున్న నీలో ఒక మంచి మానసిక పరివర్తన రావాలి. ఒక్కొక్కసారి అటువంటి కార్యం వల్ల నీలో తాత్కాలిక ప్రశాంతత రావచ్చు. లోకసామాన్యమైన వస్తువుల వల్ల తాత్కాలిక శాంతి కలిగితే, లోకాతీతమైన వస్తువు, అంటే భగవంతుడి వల్ల శాశ్వత శాంతి కలుగుతుంది. అందుకే మీ హృదయాన్ని మీరే చదవాలి ? ఎలా ?

హృదయంలో వ్యక్తమయ్యే అవ్యాజమైన ప్రశాంతతే అసలైన పరివర్తన. హృదయమంటే ఏమిటి ? గురువును ఎలా తెలుసుకోవడం ?

హృదయం నామ కిమితి
స్వతో వేత్స్యసి చింతనాత్ |
ప్రత్యభిజ్ఞాయతే శాంత్యా
హృదయే సద్గురుస్సఖే ||

మిత్రుడా ! హృదయమంటే ఏమిటో ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. ఆ హృదయంలో శాంతి కలగడం ద్వారా నీవు నీ గురువును గుర్తు పట్టవచ్చు. ఎవరి సన్నిధిలో నీ హృదయం ప్రశాంతంగా ఉంటుందో వారే నీ గురువు.

చూసేవారిలో, అటువంటి శాంతిని తీసుకు రాలేనిది మహత్తు కాదు, గారడీ మాత్రమే !

(శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి - 'సూక్తి మాల- నీతి మంజరి' అనే పుస్తకం నుంచి, సేకరణ.)

No comments:

Post a Comment