Wednesday, January 28, 2015

వాఘా ఇండో- పాక్ సరిహద్దు దళాల వేడుకలు

వాఘా ఇండో- పాక్ సరిహద్దు దళాల వేడుకలు 
-----------------------------------------------------
భావరాజు పద్మిని - 28/1/15  

ఒక ప్రక్క 'హిందుస్థాన్ జిందాబాద్... వందే మాతరం ...' అన్న నినాదాలు.
మరో ప్రక్క ' పాకిస్థాన్ జిందాబాద్..' అన్న నినాదాలు... ఇదేదో క్రికెట్ మ్యాచ్ అనుకుంటే మీరు పొరబడినట్టే. ఇది అమృత్సర్ వద్దనున్న భారత్  సరిహద్దులోని చివరి గ్రామమైన 'అటారి' వద్ద గోచరించే హృద్యమైన దృశ్యం.

ఇటువైపు మహాత్మాగాంధీ బొమ్మ ఉన్న  స్టేడియం లో మీకు గోచరిస్తున్న వారంతా భారతీయులు. అటువైపు మొహమ్మద్ జిన్నా  చిత్రం ఉన్న గేటుకు ఆవల మీకు కనిపించే వారంతా పాకిస్థానీయులు.

భారత్, పాక్ సరిహద్దు దళాలు కలిసి, సాయంత్రం వేళ 'వాఘా' వద్ద, జండా దింపే ప్రక్రియను ఒక వేడుకకా చెయ్యాలని అనుకున్నారు. సాయంత్రం వేళ, కాసేపు, ఇటు భారత్ గేటు, అటు పాకిస్థాన్ గేటు  తీస్తారు. ఆ సమయంలో మన స్త్రీ, పురుష దళాలు అటువైపు వెళ్తాయి. అలాగే, పాకిస్థాన్ కు చెందిన దళాలు ఇటువైపు వస్తాయి. ఒకరిని ఒకరు చూసి, మీసాలు మెలేసి, తొడ కొట్టి, బూట్లు ఎత్తుతారు. ఇది కేవలం ఒక చిన్న వినోదం కోసం మాత్రమేనండోయ్...



మేము వెళ్లేసరికి స్టేడియం మొత్తం నిండిపోయింది. అటు పాకిస్థాన్ వైపు జనం చాలా పల్చగా ఉన్నారు.  మధ్యలో గుంపుగా మూగిన కొందరు భారతీయులు, 'ఏ మేరా ఇండియా...' పాటకు, ఆ తర్వాత మరికొన్ని పాటలకు కేరింతలు కొడుతూ, నృత్యం చేసారు. కొందరు బుగ్గలపై భారత జండా టాటూ లు వేయించుకుని వచ్చారు. కొందరు జండాలు తెచ్చి, ఊపుతూ ఆనందించారు.

గేటు తెరిచే సమయానికి, ఈలలు, గోలలు, జై భారత్ అన్న నినాదాలతో... స్టేడియం మొత్తం మార్మ్రోగిపోయింది.  ఇల్లు, కుటుంబానికి దూరంగా ఎక్కడో ఉంటూ, మన కోసం అహర్నిశలూ పనిచేస్తున్న  సరిహద్దు దళాలకు ఇది ఆటవిడుపు. వారు అప్రమత్తంగా ఉంటూనే, అడిగిన వారితో, పిల్లలతో ఫోటోలు తీయించుకుంటూ ఆనందించారు. దేశభక్తి నరనరానా ప్రవహిస్తూ ఉండగా, అది ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన వేడుక. వీలుంటే, మీరు కూడా నయనానందకరమైన ఈ వేడుకలో ఒక్కమారైనా, తప్పక పాల్గొనండి.

No comments:

Post a Comment