Monday, February 6, 2017

సోషల్ మీడియా ప్రాణాలు తీస్తుందా ?

సోషల్ మీడియా ప్రాణాలు తీస్తుందా ?

ఫ్రెండ్స్, ఈ మధ్యనే బెంగళూరులో ఓ 18 ఏళ్ళ కుర్రాడు తాను పనిచేసే టైల్స్ షాప్ లో పనికి సైకిల్ పై వెళ్తూ, KSRTC బస్సు గుద్దెయ్యడంతో ప్రమాదానికి గురయ్యాడు. ఆ కుటుంబానికి ఆ కుర్రాడే ఆధారం. అతను మరణ వేదనలో ఉండగా, చుట్టూ ఉన్న జనం ఓ 40 నిముషాల పాటు అతని ఫోటోలు, వీడియోలు తీస్తూ నిలబడి ఉన్నారట ! ఎంతటి శోచనీయమైన విషయం? అవతలి మనిషి చావు బ్రతుకుల్లో కొట్టు మిట్టాడుతుంటే, రక్షించాల్సింది పోయి, తీసుకున్న ఫోటోలు, వీడియోలు ఏమి చేసుకుంటాము ? రానురాను ఇటువంటి ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఇక్కడ మనం మరచిపోతున్న విషయం ఏమిటంటే – ప్రమాదాలు అనేవి ఎప్పుడైనా ఎవరికైనా జరుగవచ్చు. అందుకే బాధ్యతగల పౌరులుగా చదవండి, షేర్ చెయ్యండి.
అసలు ప్రమాదం జరిగిన వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్లకపోవడానికి మొదటి కారణం ఏమిటి ? తమనే అనుమానంగా చూసి, కేసులు బనాయిస్తారన్న భయమే కదా ! అందుకే కొత్తగా సుప్రీం కోర్టు ఆమోదించిన చట్టాన్ని గురించి, గోల్డెన్ అవర్ యొక్క ప్రాధాన్యతను వివరించడానికి, ఈ వ్యాసం రాస్తున్నాను.

గోల్డెన్ అవర్ అంటే ఏమిటి ?
ఎవరికైనా, ఎటువంటి ఆరోగ్య సమస్య వల్లనైనా అత్యవసర పరిస్థితి సంభవించినప్పుడు మొదటి కొన్ని నిమిషాలు తీసుకోవాల్సిన వైద్య సంబంధమైన చర్యలు అత్యంత ముఖ్యమైనవి. వీటికి సకాలంలో, సవ్యంగా చేపడితే చాలావరకు ప్రాణహానిని లేదా సమస్య వల్ల కలిగే నష్టాన్ని నివారించవచ్చు. ఇలా అత్యవసర పరిస్థితిలో వైద్య సహాయం అందాల్సిన మొదటి సమయాన్నే గోల్డెన్ అవర్‌గా పరిగణిస్తారు. రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు(ట్రామా), గుండెపోటు, పక్షవాతం, సెప్సిస్ లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఇలాంటి అత్యవసర పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో మనం తప్పక ముందడుగు వేసి, బాధితులను సమీప ఆసుపత్రికి చేర్చాలి.
రోడ్డు ప్రమాదాల వల్ల ట్రామాకు గురైనప్పుడు వీలైనంత తొందరగా వైద్య సహాయం అందించగలిగితే ప్రాణహాని నుంచే కాకుండా, ఇతరత్రా శాశ్వత సమస్యలు సంభవించకుండా నివారించవచ్చు. ఉదాహరణకు వెంటనే ఆక్సిజన్ అందించడం, ఏదో ఒకవిధంగా రోగి ఊపిరి తీసుకునేటట్లుగా చేయడం, అవసరమైతే శ్వాసనాళంలోకి గొట్టం వేయడం, రక్తస్రావాన్ని ఆపడం, స్లైన్ ఎక్కించడం.. ఇవన్నీ అడ్వాన్స్‌డ్ ట్రామా లైఫ్ సపోర్టు (ఏటీఎల్‌ఎస్) చర్యలుగా చెబుతారు. వీటిని ఎంత తొందరగా అందిస్తే రోగిని బతికించుకునే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. మొదటి గంటలోనే అందించగలిగితే బతికే అవకాశం ఎక్కువగా ఉన్నట్టుగా రుజువులున్నాయి. దీన్నే ట్రామా గోల్డెన్ అవర్ అంటారు. అవసరాన్ని బట్టి తొందరగా సర్జరీ చేయడం దీనిలో ముఖ్యాంశం.
ఇండియాలోని ట్రౌమా కేర్‌ సెంటర్‌లు:
వీటి లక్ష్యం ఏంటంటే ప్రమాదాల బారిన పడిన వ్యక్తులకు సాధ్యమైనంత త్వరగా వైద్య సహాయం అందించడం, ఆ వ్యక్తి లేదా వ్యక్తులు మృత్యువాత పడకుండా కాపాడడం. రహదారి ప్రమాద బాధితులు సులభంగా దగ్గరలోని అన్ని సదుపాయలున్న వైద్య కేంద్రానికి చేర్చడమే కీలకం. మన దేశంలో ట్రౌమా కేర్‌ సెంటర్‌లు మూడుస్థాయిల్లో పని చేస్తున్నాయి.
ఒకటవ స్థాయి: జిల్లా ఆసుపత్రులు
రెండవ స్థాయి: మెడికల్‌ కాలేజి ఆసుపత్రులు
మూడవస్థాయి: అత్యాధునిక ఆసుపత్రులు (AIIMS), నిమ్స్ వంటివి
ఈ ట్రౌమా కేంద్రాలలో పనిచేసేందుకు సిబ్బందిని కూడా నియమించింది.
ఆ వ్యక్తి, వ్యక్తుల గురించి మీకు ఏ విధమైన సమాచారం దొరక్కపోతే 100, 108 లకి సమాచారం ఇవ్వండి. ఆసుపత్రిలో చేర్చండి. 108 అంబులెన్సె ఎంత చక్కటి సేవలు అందించిందో మనకి తెలుసు. ఒకవేళ అంబులెన్సె లేనట్టయితే, ప్రమాదం బారిన పడిన వారికి వెంటనే ప్రధమ చికిత్చ అందించి, దగ్గరలోని జిల్లా ఆసుపత్రికి చేర్చండి. అక్కడ చికిత్స అందుతుంది. లేదా రహదారికి దగ్గరలోని వైద్యకళాశాల ఆసుపత్రి ఉంటే అక్కడ చేర్చండి లేదా ఈ విషయాలపైన ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించండి.

ఇందులో మనకు ఏమైనా రిస్క్ ఉంటుందా ?
సాధారణంగా రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి సాయం చేయడానికి, వారిని ఆస్పత్రిలో చేర్చడానికి అనేకమంది వెనుకడుగు వేస్తూ వుంటారు. దీనికి కారణం ఆలా సాయం చేయాలని ముందుకు వచ్చే వారిని అటు పోలీసులు కానీ ఇటు డాక్టర్లు కానీ అనంత ప్రశ్నలతో వేధించి చంపడమే. పైగా వారిని అనుమానంగా చూస్తూ, వారి తీరును తప్పుపడుతూ వ్యవహరించడమే ప్రధాన కారణం.


ఈ చట్టం కింద రూపొందించిన మార్గదర్శక సూత్రాలకు అటు పోలీసులు, ఇటు ఆస్పత్రి అధికారులు తప్పనిసరిగా కట్టుబడి వుండాల్సిందే. ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీని ముసాయిదాను రూపొందించింది. ఒకవేళ ఎవరైనా ఈ మార్గదర్శక సూత్రాలకు కట్టుబడకుండా ఉల్లంఘిస్తే వారికి శిక్ష కూడా వుంటుంది. ప్రమాదం జరిగిన వెంటనే 48గంటల వరకు చికిత్స అంతా ఉచితంగా జరుగుతుంది.
· రోడ్డు ప్రమాద బాధితులను ఎవరైనా ఆసుపత్రిలో చేర్చవచ్చు.
· పోలీసులు మిమ్మల్ని ఏవిధమైన ప్రశ్నలు అడగరు.
· రోడ్డు ప్రమాద బాధితులకు వైద్యులు వెంటనే వైద్యం అందించాలి.
ఈ చట్టం గురించిన మరిన్ని వివరాలను క్రింది లింక్ లో చూడండి.


గుర్తుపెట్టుకోండి ... రోడ్డు ప్రమాద బాధితుల్ని అలా వదిలేసి వెళ్ళకండి. ప్రమాదం జరిగిన మొదటి గంటలో వారికి వైద్యసహాయం అందివ్వగలిగితే మరణాన్ని నివారించవచ్చు.

No comments:

Post a Comment