Saturday, September 14, 2013

పానుగంటి లక్ష్మీ నరసింహం

పిఠాపురం రాజాస్థానంలో పానుగంటి లక్ష్మీనరసింహం, చిలకమర్తి లక్ష్మీనరసింహం, కూచి నరసింహం అనేవారు ' సింహత్రయం' అనే పేరుతొ ప్రసిద్ధికెక్కారు. 

పానుగంటి లక్ష్మీనరసింహం గారు వ్యంగ్య రచనలో అందే వేసిన చెయ్యి. తెలుగు సాహిత్యంలో పానుగంటి రాసిన సాక్షి వ్యాసాలు  చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఆయన తూర్పుగోదావరి జిల్లా, సీతానగరంలో 1865 నవంబర్ 2న జన్మించారు.   పిఠాపురంరాజా సూర్యారావు కోరిక మేరకు పానుగంటి అనేక నాటకాలు రాశారు. 

ఆయనను ‘ఆంధ్రా షేక్‌స్పియర్’, ‘ఆంధ్రా ఎడిసన్’ అని పిలిచేవారు. ఆయనకు ‘అభినవ కాళిదాసు’ అనే బిరుదు ఉంది.  ‘విప్రనారాయణ చరిత్ర’, ‘పాదుకా పట్టాభిషేకం’, ‘రాధాకృష’్ణ, ‘కాంతాభిరామం’, ‘రాతిస్తంభం’, ‘కళ్యాణ రాఘవం’ లాంటి ఎన్నో రచనలను తెలుగు పాఠకులకు అందించారు.  


ఆయన రాసిన చాటువులు చూడండి  ...

వేపారి కంటె సరసుడు 
నేపాళపు మాత్రకంటే మేలౌ మందున్ 
వేపాకు కంటె చేదును 
సాపాటున కంటే సుఖము నహి నహి మహిలోన్ !

 బచ్చుండవు నెర దాతల
 మ్రుచ్చుండవు శత్రువులకు మహిత జ్వాలా
 చిచ్చుండవు కవి వర్యుల
మెచ్చుండవు మేటి సుగుణ పుట్టీ ! సెట్టీ !



 ఆ రోజుల్లో అవి కలిగించిన సంచలనం అంతా యింతా కాదు. "జంఘాలశాస్త్రి" అనే పాత్ర ముఖతః పానుగంటివారు సమకాలిక సాంఘిక దురాచారాలమీద, మూఢ విశ్వాసాలమీద పదునైన విమర్శలు చేసేవారుసాక్షి వ్యాసాల నుండీ కొన్ని మచ్చుతునకలు (వీకీపీడియా నుండీ)

(తోలు బొమ్మలు) -- తోలుబొమ్మలాటను చూడడంలోకంటె ప్రేక్షకులను పరిశీలించడంలో వాణీదాసునికి ఆసక్తి ఎక్కువ -- ఎన్నియోబొమ్మలను ముగ్గురో నల్వురో తెరలోపల నాడించుచుండ నొక్కబొమ్మను వీరందఱు తెరవెలుపల నాడించుచున్నారు. ఇంత శ్రమపడి బొమ్మలాట నేల చూడవలయు నని మీరు నన్నడుగుదురేమో! జనులు విశేషముగ జేరియుండినచోటికి బోవుటకు నాకు మొదటినుండియు నుత్సాహము. జనుల ముఖభేదముల బరిశీలించుట, కంఠరవములను శోధించుట, మాటలతీరులను గనిపెట్టుట, వానికిగారణములగు హృదయరసములను విమర్శించుట, స్వభావభేదములను గుర్తెఱుగుట-యిట్లు ప్రకృతిజ్ఞానమును సంపాదించుటయే నాముఖ్యోద్దేశము. పందిటిక్రింద నాడింపబడుచున్న నిర్జీవపు దోలుబొమ్మలను జూచుటకై పోయిన వాడ గాను. బయటనాడుచున్న ప్రాణమున్న తోలుబొమ్మలయాట జూడ బోయితిని.

(స్వభాష) - ఒక తెలుగువాడు తెలుగు శ్రోతలతో ఆంగ్లంలో ప్రసంగించేసరికి జంఘాలశాస్త్రి ఉద్వేగభరితుడై ఇలా అంటాడు. -- మ్యావుమని కూయలేని పిల్లి యెచ్చటైననుండునా? కిచకిచలాడలేని కోతిని మీరెక్కడైన చూచితిరా? ... అయ్యయ్యో. మనుజుడే. అంత మనుజుడే. ఆంధ్ర మాతాపితలకు బుట్టినవాడే. .. అట్టివాడాంగ్లేయభాషనభ్యసించినంత మాత్రమున ఇప్పుడాంధ్రమున మాట్లాడలేకుండునా? ఆశ్చర్యము, అవిశ్వసనీయము. అసత్యము. ఆంధ్రమున మాటాడకుండ చేసినది అశక్తికాదు. అనిష్టత. అసహ్యత. అది శిలాక్షరమైన మాట. .. తెలుగుబాస యంత దిక్కుమాలిన బాస లేదనియే యా యాంగ్లేయ తేజస్సు నమ్మకము.

No comments:

Post a Comment