Sunday, October 27, 2013

'సహజకవి' పోతన 1

శ్రీ రావినూతల శ్రీనివాస్ గారు అందించిన పద్యాలు 

మహాకవి బమ్మెరపోతనామాత్యులవారు (1410-1470)మధ్య శ్రీమహాభాగవతమును తెనుగు భాషలో రచించి,ఆంద్రభాషాభిమానులకు శాస్వతమైన వరప్రసాదము గావించారు. వారు భగవన్నామ స్మరణలో పరవసించిపోయే పరమభక్తులు. లౌకికప్రలోభాలకు అతీతమైన నిర్వికల్పులు. సహజపాండితీ విశారదులు. వీరు రచించిన శ్రీఆంధ్రమహాభాగవతము సులలిత సుమనోహర శైలిలో,మృదుమధుర పదములతో రచింపబడిన పద్యములతో,మధుబిందువులను వర్షింపచేస్తుంది. చేసిన రచన తమ ఆరాధ్యదైవమైన శ్రీరామచంద్రప్రభువు యొక్క దివ్యస్ఫురణచే రచించినట్లు "పలికించు వాడు రామభద్రుడు"అని,పోతానగారే స్పష్టపరిచారు. 
పోతనగారు గ్రంథ రచనను ఈ కింది శ్లోకంతో ప్రారంభం చేశారు. 

శ్రీకైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్ లోకర 
క్షైకారంభకు భక్తపాలనకళాసంరంభకున్ దానవో 
ద్రేకస్తంభకు గేళిలోలవిలసద్దృగ్జాలాసంభూతనా 
నాకంజాతభవాండకుంభకు మహానందాంగ నాడింభకున్. 

ఈ పద్యముద్వారా ప్రప్రధమంగా శ్రీకృష్ణభగవానుని స్మరించదమైనది. మానవజన్మ యొక్క పురుషార్థము మోక్షప్రాప్తియే. దానినే "శ్రీకైవల్యపదంబు చేరుట"అని పేర్కొన్నారు. అదియే ఈ గ్రంథము యొక్క ప్రయోజనము. లోకరక్షాపరాయణుడు,భక్తపాలనమే ఒక కళగా ఆచరించేవాడు,దానవుల ఉద్దృతాన్ని అరికట్టేవాడు,లీలావలోకనమాత్రముననే అనేక బ్రహ్మాండములను ఉద్భవింపజేయువాడు,అయిన నందరాజు యొక్క ఇల్లాలి ముద్దులబిడ్డడు అయిన బాలకృష్ణుని శ్రీకైవల్యపదమును పొందుటకొరకు నేను ధ్యానిస్తున్నాను. 

ఆదరమొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతాహృదయానురాగసం 
పాదికి దోషభేదికి బ్రపన్నవినోదికి విఘ్నవల్లికా 
చ్చేదికి మంజువాదికి నశేషజగజ్జననందవేదికిన్ 
మోదకఖాదికిన్ సమదమూషకసాదికి సుప్రాసాదికిన్. 

హిమగిరినందిని యొక్క హృదయానురాగాన్ని పొందినవాడు,కలిదోషాలను తొలగించువాడు,ప్రపన్నులను ఆనందింపచేయువాడు,ఆశ్రితుల విఘ్నములను చేదించువాడు,మధురభాషణములచే అశేషజనులను ఆనందింపచేయువాడు,మోదకాలను ఆరగించి ముషికమును అధిరోహించువాడు,అయిన వినాయకదేవునకు నేను మ్రోక్కుచున్నాను. 

క్షోణితలంబు నెన్నుదురు సోకగమ్రొక్కి నుతింతు సైకత 
శ్రోణికి జంచరీకచయసుందరవేణికి రక్షితామర 
శ్రేణికి దోయజాతభవచిత్తవశీకరణైకవాణికిన్ 
వాణికి నక్షదామశుకవారిజపుస్తకరమ్యపాణికిన్. 

నల్లని అందమైన శిరోజములు గల తల్లికి,దేవతలను రక్షించునామెకు,బ్రహ్మదేవుని మనస్సు వశపరచుకున్న దేవికి,రుద్రాక్షమాల,చిలుక,పద్మము,పుస్తకము చేతిలో ధరించిన వాణికి,నా నుదురు నేలను తాకునట్లు వంగి,భక్తితో నమస్కరిస్తున్నాను. 

అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలాపె 
ద్దమ్మ సురారులమ్మ కడుపారడిపుచ్చినయమ్మ తన్నులో 
నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడియమ్మ దుర్గ మా 
యమ్మ కృపాబ్ది యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. 

అమ్మలందరికీ అమ్మ,ముగ్గురమ్మలలకూ మూలమైన అమ్మ,అందరికన్నా అధికురాలైన అమ్మ,అసురుల అమ్మల కడుపులకు చిచ్చుపెట్టు అమ్మ,తనను మనస్సులో నమ్ముకున్న దేవతల తల్లులకు చిత్తములో నిల్చియుండే అమ్మ,దయసాగరి ఐన మా అమ్మ దుర్గాభవాని,నాకు ధనము,పాండిత్యము,శక్తి మొదలగు సంపదలనిచ్చుగాక. 

చేతులారంగ శివుని బూజింపడేని 
నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని 
దయయు సత్యంబులోనుగాదలపడేని 
గలుగనేటికి దల్లులకడుపుచేటు. 

నిండు చేతులతో,మనస్పూర్తిగా శివుని పూజింపనివాడు,కంఠమెత్తి అలసిపోయేవరకు శ్రీహరి గుణవైభవములను కీర్తిస్తూ గానము చేయనివాడు,భూతదయ,సత్యవర్తనము ఆచరింపనివాడు మానవునిగా జన్మించడం వ్యర్థమే కదా!

పలికెడిది భాగవతమట పలికించువిభుండు రామభద్రుండట నే 
బలికిన భవహరమగునట పలికెద వేరొండుగాధ బలుకగ నేలా 

నేను చెప్పబోవునది పరమ పవిత్రమైన భాగవతమట, నాచే చెప్పించే విభుడు సాక్షాత్తూ ఆ శ్రీరామచంద్ర ప్రభువేనట నేనీ భాగవతగాధను చెప్తే సంసారబంధము నశిస్తుందట. అందుచేత నెనీ భాగవతమునే చెప్పెదను. మరి వేరొక గాధను చెప్పడమెందుకు?

అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్న రా 
వన్న!శరీరధారులకు నాపదవచ్చిన వారియాపదల్ 
గ్రన్ననదాల్చి వారికి సుఖంబులు సేయుటకంటె నొండుమే 
లున్నదెనాకు దిక్కు పురుషోత్తముడొక్కడ సుమ్ము పుల్కసా. 

శకుంతల తనయుడైన భరతుని వంశములో రంతిదేవుడను రాజున్నాడు. అతడు తన సర్వసంపదలను దానధర్మములలో వెచ్చించి,దరిద్రుడై యొక 48 దినములు భార్యతో సహా పస్తులుండవలసి వచ్చెను. ఒకనాడు అతనికి కొద్దిగా పాయసము దొరికింది. ముందర కొద్దిగా భార్యాబిడ్డలకిచ్చి తరువాత మిగిలిన కొద్దిభాగము ఇద్దరు అతిధులకు పెట్టి,కొద్దిగా మంచినీటిని సేవించుటకు సిద్ధపడగా ఒక చండాలుడు వచ్చి "దాహము,నా ప్రాణములు నిలపండి",అని ప్రార్ధించాడు. దానికి రంతిదేవుని సమాధానమును పై పద్యములో పోతనగారు వివరించారు. 

                                           

"ఓయన్నా!అన్నము లేదు గాని కొద్దిపాటి మంచినీరు మాత్రము ఉన్నది. రావన్నా రా!ఈ నీటిని త్రావుము. ప్రాణులకు ఆపద వచ్చినప్పుడు వెంటనే వారి ఆపదలను తొలగించి,సుఖము కలిగించుట కంటే మనుషులకు వేరే పరమార్థమున్నదా?ఇక,నా విషయమా?నాకా పురుషోత్తముడొక్కడే దిక్కు సుమా!మానవా!అని ఆ జలమును ఇచ్చెను. అప్పుడు జరిగింది అద్భుతం :

వారల నేమియు నడుగక 
నారాయణభక్తి తనమనంబున వెలుగన్ 
ధీరుండాతడు మాయా 
పారుజ్ఞుం డగుచుబరమపదమున్ బొందెన్ 

బ్రహ్మాది దేవతలు ఆ యొక్క రంతిదేవుని దానశీలతకు ప్రసన్నులై,ప్రత్యక్షమై అన్నార్తుల రూపములో తామే వచ్చామని,అతని దానశీలతకు సంతోషించామని,వరము కోరుకోమని అడుగగా,పుణ్యాత్ముడైన రంతిదేవుడు ఏమీ కోరక,నారాయణుని యందు సంపుర్ణమైన భక్తి కోరి మాయను దాటినవాడై పరమపదమును పొందెను. 

జగదవనవిహారీ!శత్రులోక ప్రహారీ!
సుగుణఘనవిహారీ!సుందరీమానహరీ!
విగతకలుషపోషీ!వీరవిద్యాభిలాషీ!
స్వగురుహృదయతోషీ!సర్వదాసత్యభాషీ!

జగత్తు అను మహాసాగరములొ విహరించువాడా!శత్రులోకమును దండించువాడా!గొప్ప సుగుణములతో ప్రవర్తించువాడా!సీతాసుందరి మనోహరుడా!నిర్మల చరితులను పోషించువాడా!రణకౌశల శ్రేష్టుడా!విశ్వామిత్రుని సంతోషింపచేసినవాడా!ఎల్లప్పుడూ సత్యభాషణమే వ్రతముగా కలవాడా!ఓ రామచంద్రా నీకు ప్రణతులు!

వేదకల్పవృక్షవిగళితమై శుక 
ముఖసుధాద్రవమున మొనసియున్న 
భాగవతపురాణఫలరసాస్వాదన 
పదవి గనుడు రసికభావవిదులు. 

శ్రీమద్భాగవతము వేదమనే కల్పవృక్షము నుండి ఉద్భవించినది. శుకయోగీంద్రుని ముఖము నుండి వెలువడిన అమృతఫలరసము. దివ్యమైన ఆ ఫలరసాన్ని రసికభావుకులు ఆస్వాదించి తరింతురుగాక!


శ్రీ వడ్డాది సత్యనారాయణ మూర్తి 

పోతనా మాత్యుని శారదా స్తుతి 
--------------------------

శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా 
హార తుషార ఫేన రజతాచల కాస ఫణీశ కుంద మం - 
దార సుధా పయోధి సిత తామర సామర వాహినీ శుభా - 
కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ


బాణాసురుని శివ స్తుతి ..... పోతనామాత్యులు ... భాగవతం 
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

దేవ! జగన్నాథ! దేవేంద్రవందిత!; వితతచారిత్ర! సంతత పవిత్ర!
హాలాహాలాహార! యహిరాజకేయూర!; బాలేందుభూష! సద్భక్తపోష!
సర్వలోకాతీత! సద్గుణసంఘాత!; పార్వతీహృదయేశ! భవవినాశ!
రజతాచలస్థాన! గజచర్మపరిధాన!; సురవైరివిధ్వస్త! శూలహస్త!

లోకనాయక! సద్భక్తలోకవరద!
సురుచిరాకార! మునిజనస్తుతవిహార!
భక్తజనమందిరాంగణపారిజాత!
నిన్ను నెవ్వఁడు నుతిసేయ నేర్చు నభవ!

శ్రీ వి. సత్యనారాయణ గారు 

అమ్మల గన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె
ద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో 
నమ్మిన వేల్పుటమ్మల మనంబులనుండెడి యమ్మ దుర్గ మా 
యమ్మ కృపాబ్ధి యిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ 

మహా కవి బమ్మెర పోతన గారికి నమస్సుమాంజలులు



No comments:

Post a Comment