Sunday, October 27, 2013

పోతనామాత్యుడు

పోతన భాగవతం దశమ స్కందం నుంచీ...

శ్రీకృష్ణుని చూసిన మధురలోని గోపికలు ఇలా అనుకుంటున్నారట... 

వేణునాదములమై వెలసిన మాధవుం డధరామృతము నిల్చి యాదరించు 
బింఛదామములమై పెరిగిన వెన్నుండు మస్తకంబున దాల్చి మైత్రినెరపు 
బీతాంబరములమై బెరసిన గోవిందు డంసభాగముల బాయక ధరించు 
వైజయంతికలమై వ్రాలిన గమలాక్షు డతి కుతూహలమున ఇరుత దాల్చు 
డనరు బృందావనంబున దరులమైన - గృష్ణు దానందమున చే క్రీడ సల్పు 
నెట్టి నోములనైన మున్నెట్టి విధము - లేల కామైతి మాయమ్మ ఇంక నెట్లు ?

భక్తుని హృదయంలో భగవంతుని ఎలాగైనా చేరాలన్న తృష్ణ ఈ పద్యంలో కనిపిస్తుంది. కృష్ణా వేణువునయినా, నెమలి పించామయినా, పీతాంబరము లయినా (పసుపు పచ్చని వస్త్రాలు), వైజయంతికలం అయినా, చివరికి బృందావనంలో ఒక చెట్టు అయినా బాగుండేది. ఏదో ఒక విధంగా నిన్ను చేరేవాళ్ళం. ఏదో ఒక నోములు చేసి, కనీసం వీటిలో ఏదయినా కాకపోయాము. ఇంకేమి చేయ్యగలమమ్మా, చెప్పండి?

క్షీరసాగరమధనం లో హాలాహలం పుట్టింది. దేవతలంతా ఆ హాలాహలం నుంచీ తమను రక్షించమని అనేక విధాల పరమేశ్వరుడిని వేడుకుంటారు. తన ప్రాణ నాధుడు తన బిడ్డలను కాపాడేందుకు హాలాహలం మింగేందుకు సిద్ధం అయ్యాడు. భర్త విషం మ్రింగబోతున్నాడని తెలిసి, అందరికీ మేలు జరగాలన్న కోరికతో సర్వమంగళ పార్వతి మ్రింగమని చెప్పిందట. ఆ సందర్భంలో, మనస్సులో తన మంగళ సూత్రాన్ని ఎంతగా నమ్మిందో... అంటూ పోతన వ్రాసిన ఈ పద్యం చూడండి...

మ్రింగెడువాడు విభుండని 
మ్రింగెడిదియు గరళ మనియు మేలని ప్రజకున్ 
మ్రింగుమనె సర్వమంగళ 
మంగళసూత్రంబు నెంత మదినమ్మినదో 

బలి చక్రవర్తి వామనుడికి దానం ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. వద్దని వారిస్తాడు శుక్రాచార్యుడు. ఏ ఏ సందర్భాలలో ఆడిన మాట తప్పవచ్చో, అబద్ధం చెప్పవచ్చో, ఇలా చెబుతున్నాడు...

వారిజాక్షులందు వైవాహికములందు 
బ్రాణ విత్త మాన భంగమందు 
జకిత గోకులాగ్ర జన్మరక్షణ మందు 
బొంకవచ్చు నఘము వొండ డధిప 

"రాజా! ఆడవారి విషయంలోనూ, పెండ్లిండ్ల లోనూ, ప్రాణానికి, ధనానికి, గౌరవానికి భంగం కలిగేటప్పుడు, భయపడిన గోవులనూ బ్రాహ్మణులనూ ఆదుకునేటప్పుడూ అబద్ధం చెప్పవచ్చు.


శ్రీ వడ్డాది సత్యనారాయణ మూర్తి గారు అందించిన పద్యాలు 

భీష్ముడు శ్రీకృష్ణుని స్తుతించుట...పోతన భాగవతం 
-------------------------------------------------

కుప్పించి యెగసినఁ గుండలంబుల కాంతి, 
గగనభాగం బెల్లఁ గప్పికొనఁగ
నుఱికిన నోర్వక యుదరంలో నున్న, 
జగముల వ్రేఁగున జగతి గదలఁ
జక్రంబుఁ జేపట్టి చనుదెంచు రయమునఁ, 
బైనున్న పచ్చని పటము జాఱ
నమ్మితి నాలావు నగుఁబాటు సేయక, 
మన్నింపు మని క్రీడి మఱలఁ దిగువఁ

గరికి లంఘించు సింహంబుకరణి మెఱసి, 
నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁగాతు
విడువు మర్జున! యనుచు మద్విశిఖవృష్టిఁ, 
దెరలి చనుదెంచుదేవుండు దిక్కునాకు

అటమటమయ్యె నా భజన మంతయు భూవర! నేఁడు సూడుమా
యిటువలె గారవించు జగదీశుఁడు గృష్ణుఁడు లేని పిమ్మటం
బటుతర దేహలోభమునఁ బ్రాణము లున్నవి వెంటఁబోక నేఁ
గటకట! పూర్వజన్మమునఁ గర్మము లెట్టివి చేసినాఁడనో?

పోతనామాత్యుని భాగవతం నుండి....
-------------------------------------

శ్రీ కృష్ణుని మరణ వార్త .. అతి దుఃఖ భరిథమైనది..అర్జునుడు ధర్మరాజు తో చెప్తున్నాడు..
అయ్యో నే చేసిన అంత సేవ నిరర్ధకం. ప్రభూ ..నన్ను ప్రేమగా పిలిచే సర్వేశ్వరుడు, శ్రీ కృష్ణుడు. నిర్యాణము తరువాత కూడా, చూడు .. నా ప్రాణములు ఇంకా ఆయనతో పాటు పోవటల్లేదు. పూర్వ జన్మలో ఎన్ని పాపాలు చేసానో కదా..ఇంతటి లోభం నాకు దేహం మీద ఉంది ....

గొడుగో, జన్నిదమో, కమండలువొ, నాకున్ ముంజియో, దండమో,
వడుఁ గే నెక్కడ? భూము లెక్కడ? కరుల్, వామాక్షు, లశ్వంబు లె
క్కడ? నిత్యోచిత కర్మ మెక్కడ? మ దాకాంక్షామితం బైన మూఁ
డడుగుల్ మేరయ త్రోవ కిచ్చు టది బ్రహ్మాండంబు నా పాలికిన్.

బలి చక్రవర్తిని వామనుడు మూడు అడుగుల భూమిని దానంగా అడుగుతున్నాడు.
బ్రహ్మచారిని ఐన నాకు .. గొడుగు , యజ్ఞోపవితం కమండలం లేక మొలతాడు ..ఉపయోగిస్తాయి 
అంతేగాని ..భూములు , ఏనుగులు , గుర్రాలు స్త్రీ లు .. వీటితో నాకు ఏమి పని..
అందువలన కాదనకుండా నేనడిగిన మూడడుగుల చోటూ ఇస్తే అదే నాకు బ్రహ్మాండం. 
.......వామనావతారం ....భాగవతం ......శ్రీ బమ్మెర పోతరాజు


                                                                                                       

దేవరకొండ సుబ్రహ్మణ్యం గారు అందించిన పద్యాలు 

పోతన భాగవతము "దశమ స్కందము" నుండి.

గజ్జెలు ఘల్లని మ్రోయఁగ
నజ్జలు ద్రొక్కుటలు మాని యతిజవమున యో
షీజ్జనములు నగఁ దల్లియుఁ
బజ్జం జనుదేర నతఁడు పరువిడె నధిపా

గూడఁబారి పట్టుకొని వెఱపించుచుఁ
జిన్ని వెన్నదొంగ చిక్కె ననుచు
నలిగి కొట్టఁ జేతులాడక పూఁబోణి
కరుణతోడ బాలుఁ గట్టఁ దలఁచి

వీరెవ్వరు శ్రీకృష్ణులు
గారా! యెన్నఁడును వెన్న గానరఁట కదా
చోరత్వం బించుకయును
నేరరఁట, ధరిత్రి నిట్టి నియతులుఁ గలరే

పట్టినఁ బట్టుపడని నినుఁ
బట్టెద మని చలము కొనినఁ బట్టుట బెట్టే
పట్టువడ వండ్రు పట్టీ
పట్టుకొనన్ నాకుఁగాక పరులకు వశమే

ఎక్కడ నైనను దిరిగెద
వొక్కయెడన్ గుణము గలిగియుండవు నియమం
బెక్కడిది నీకు మఱచినఁ
జక్కనఁ బోయెదవు పెక్కుజాడలఁ బుత్రా

వింజమూరి వెంకట అప్పారావు గారు అందించిన పద్యాలు 

పోతనామాత్యుడు గారి పద్యాలు...
"వారిజాక్షులందు వైవాహికములందుఁ 
బ్రాణ విత్త మాన భంగమందుఁ 
జకిత గోకులాగ్రజన్మ రక్షణమందు 
వొంకవచ్చునఘమువొందడధిప!"

అనే నీతిని వెలయించాడు. ఇదంతా శుక్రునికి బలిపై ఉన్న వాత్సల్యం. రాక్షస గురువుగా ఆయన ధర్మం. కులాచార్యుడు శుక్రుడు చెప్తున్న హితవాక్యాలను విన్న బలి – "క్షణమాత్ర నిమీలిత లోచనుడై" ఆయనతో - "మహాత్మా! మీరు చెప్పేది యధార్థమే . ఏదడిగినా ఇస్తానని చెప్పిన నేను – ఇపుడు కాదనలేను. భూదేవి బ్రహ్మతో – ఎట్టి పాపాత్ముడినైనా భరిస్తానుగానీ, సత్యహీనునిమాత్రం భరించలేను అని చెప్పిందికదా. కర్షకునకు సారవంతమైన నేల, బలమైన విత్తనాలు ఒకేచోట దొరికినట్లు దాతకు తగిన ప్రతిగ్రహీత లభించటం కూడా మహద్భాగ్యమేకదా - ఎన్నో యజ్ఞాలు, పుణ్యకార్యాలు చేసినా దర్శనభాగ్యం ప్రసాదించని గొప్పవాడైన విష్ణువు నేడు వామనుడై నన్ను దానం చేయమని చేయిచాచి అర్థిస్తున్నాడు.

ఎటువంటి చేయి అది – 

ఆదిన్ శ్రీసతి కొప్పుపై ,తనువుపై,నంసోత్తరీయంబుపైఁ 
బాదాబ్జంబులపైఁ గపోలతటిపైఁబాలిండ్లపై నూత్నమ 
ర్యాదంజెందు కరంబు గ్రిందగుట మీదై నా కరంబుంట మే 
ల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమేకాయంబు నాపాయమే

అంతటి ప్రశస్త హస్తం క్రిందిది కావటం, నాది పైచేయి కావటంకంటె అదృష్టమా ! 

"కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతింబొందరే 
వారేరీ? సిరిమూట గట్టుకొని పోవంజాలిరే ? భూమిపైఁ 
బేరైనంగలదే ?శిబిప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై 
యీరే కోర్కులు?వారలన్ మరచిరే యిక్కాలమున్ భార్గవా !"

అన్న బలిచక్రవర్తి యొక్క ఆనందపారవశ్యం, ధీరోదాత్తత ఎంతటిదని చెప్పగలం? "తిరుగన్ నేరదు
నాదుజిహ్వ, మేరువు తలక్రిందలైనా, సముద్రాలు ఇంకిపోయినా, భూమి పిండియైపోయినా ఈ దానాన్ని చేసితీరుతాను" అన్న బలిపై ఆగ్రహించిన శుక్రుడు "నాశాసనం ధిక్కరించావు కనుక త్వరలోనే పద భ్రష్టుడవౌతావు" అని శపించాడు.

భారత వర్ష జంతువుల భగ్యమదేమని చెప్ప వచ్చు నీ
భారత వర్షమందు హరి పల్మరు బుట్టుచు జీవ కోటికిన్
ధీరత తోడ తత్వ ముపదేశము జేయుచు చెల్మి సేయుచున్ 
ఆరయ బాంధవాకృతి కృతార్ధుల జేయుచు నుండు నెంతయున్ !!

నమ్మితి నా మనంబున సనాతనులైన యుమామహేశులన్
మిమ్ము బురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ, మేటిపె
ద్దమ్మ, దయాంబురాశివి గదమ్మ, హరిం బతి జేయుమమ్మ, నిన్
నమ్మిన వారి కెన్నడును నాశము లేదు గదమ్మ, యీశ్వరీ!
                                                                              ---పోతనామాత్యుడు.


                                                            


డి.వి లీలా ప్రసాద్ గారు అందించిన పద్యాలు 

పోతన --- భక్తి రసమయ రూపం, భక్తి వేదాంత సాహిత్య శిఖరం, తత్వక్రమ పరిణామవికాసం, ముక్తికి భక్తికి సరళసుందర లభసోపానమార్గప్రదాత, మందార మకరంద మాధురీధురీణమైన కవితాఝరి, భగవత్భక్తికి పర్యాయపదం, అక్షరాస్యులకు అర్ధసౌరభంతో, 
నిరక్షరకుక్షులకు నాదగాంభీర్యంతో తెలుగువారి ఇంటింటా నిత్యనూతననత్వమును సంతరించుకున్న పద్యం.

పోతన వారి కొన్ని పద్యములను మననం చేసుకొని తరించుదాం:

***పలికెడిది భాగవతమట !
పలికించెడి వాcడు రామభద్రుoడట ! నే
పలికిన భవహరమగు నట !
పలికెద వేఱొoడు గాథ పలుకcగ నేల ? .....

***భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు
శూలికైన - దమ్మిచూలికైన !!
విబుధ జనులవలన విన్నంత కన్నంత
దెలియ వచ్చినంత దేటపఱతు !! .....

***నీ పాద కమల సేవయు
నీ పాదార్చకుల తోడి నెయ్యమును, ని తాం
తాపార భూత దయయును
తాపసమందార నాకు దయసేయcగదే ! ......

***ఉ: శారద నీరదేందు ఘనసార పటీరమరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధాపయోధి సిత తామరసామర వాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మదిcగానcగ నెన్నcడు గల్గు భారతీ! .....

--- తల్లీ! భారతీ! తెల్లని కాంతులు, వెల్లివిరిసే శరన్మేఘకదంబమూ, శారదచంద్రబింబమూ, పచ్చ కర్పూరమూ, పటీరమూ, రాజ హంసలూ, 
జాజి చెండ్లూ, నీహారమూ, డిండీరమూ, వెండికొండా,రెల్లుపూలు, ఆది శేషుడూ, మల్లెలూ మందారాలూ పాలసంద్రమూ, పూచిన పుండరీకాలూ, ఆకాశగంగా -- ఇవన్నీ నీ శుభాకారానికి ఉజ్జ్వలమైన ఉపమానాలు, అటువంటి స్వచ్చధవళ సుందరమూర్తివైన 
నిన్ను కన్నులార మనసుదీరా ఎన్నడు దర్శింప గలుగుతానో గదా !!

***తే: చేతులార శివునిc బూజింపcడేని,
నోరు నొవ్వంగ హరికీర్తి నుడువcడేని,
దయయు సత్యంబు లోనుగాc దలcప డేనిc,
గలుగ నేటికిc దల్లుల కడుపుc జేటు.....

--- ఈ జగత్తులో జన్మించిన వాడు - చేతులారా శివుని పూజించని , నోరార కేశవుని కీర్తించని , సత్యమూ కరుణనూ మనసున అలవరచుకోని మనుజుడు పుట్టుట- తల్లుల కడుపు చెడగొట్టుటయే కదా? ........


భగవత్ భక్తికి పరాకాష్ట శ్రీ పోతనా మాత్యులు ----

**** శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగారరత్నాకరా!
లోకద్రోహినరేంద్రవంశదహనా! లోకేశ్వరా! దేవతా
నీకబ్రాహ్మణగోగణార్తిహరణా! నిర్వాణసంధాయకా!
నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!........

--- శ్రీ కృష్ణా ! యదుకులభూషణా ! అర్జునకు ప్రియమైన వాడా !శృంగార రస రత్నాకరా! జగత్కంటకులైన రాజుల వంశములను
దహించినవాడా! జగదీశ్వరా! ఆపన్నులైన దేవతల, విప్రుల,గోమందల ఆర్తిబాపికాపాడే స్వామీ! మోక్షాన్ని ప్రసాదించే ప్రభూ!నీకు నమస్కరిస్తున్నాను. పరిపూర్ణ కరుణా పయోధివై నా భవబంధాలు ఖండించు!
(కుంతి శ్రీకృష్ణుని స్తుతించు సందర్భం లోనిది) -----

****త్రిజగన్మోహన నీలకాంతిఁ దను వుద్దీపింపఁ బ్రాభాత నీ
రజబంధుప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక
వ్రజ సంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప మా
విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్.....

--- ముల్లోకాలను మోహింపచేసే నీలవర్ణ కాంతులతో నిగనిగలాడే దేహంతో వెలుగులు వెదజల్లుతూ బాలభాను ప్రభలతో ప్రకాశించు 
బంగారు చేలంతో, ఒయ్యారం ఒలకబోస్తూ, నల్లని ముంగురలతో ముద్దులు మూటగట్టే ముఖారవిందంతో అనురాగాలు చిందిస్తూ 
మా అర్జునుణ్ణి సమీపించే అందగాడు నా అంతరంగంలో నిరంతరం నిలిచి పోవాలని ---- 
(భీష్ముడు శ్రీకృష్ణుని స్తుతించు సందర్భం లోనిది)

శ్రీ మహా భాగవత పురాణాo తెనిగించటానికి పూనుకున్న సందర్భంలో పోతనామాత్యుడు చేసిన భగవత్ ప్రార్ధనా పద్యాలలో ఒక పద్యం:

***ఉ: శీలికి, నీతి శాలికి, వశీకృత శూలికి, బాణహస్త ని
ర్మూలికి, ఘోర నీరద విముక్త శిలాహత గోపగోపికా
పాలికి, వర్ణధర్మ పరిపాలికి, నర్జునభూజయుగ్మ సం
చాలికి, మాలికిన్, విపుల చక్ర నిరుద్ద మరీచి మాలికిన్....

--- శీలవంతుడూ, నీతిమంతుడూ, త్రిశూలధారియైన శివుని వశం చేసుకున్నవాడూ, బాణాసురునిబాహుదండాలు ఖండించినవాడూ, ఇంద్రుని పంపున మేఘాలు కురిసిన రాళ్ళ జల్లుకు చెల్లాచెదరైనగో గోప గోపికలను కాపాడినవాడు, వర్ణాశ్రమ ధర్మాలను ఉద్దరంచిన వాడూ, జంట మద్ది చెట్లు పెళ్లగించిన వాడూ, వనమాలలు ధరంచిన వాడూ, సైంధవ సంహార సమయాన తన చేతి చక్రంతో సూర్య మండలాన్ని కప్పి వేసినవాడూ -----

***క: భూషణములు వాణికి నఘ
శోషణములు మృత్యుచిత్త భీషణములు హృ
త్తోషణములు కల్యాణ వి
శేషణములు హరి గుణోపచిత భాషణముల్.....

---- శ్రీ హరి గుణ సంకీర్తనలతో నిండిన సంభాషణలు వాగ్దేవికి అలంకారాలు! సకల పాప పరిహారాలు !మృత్యు దేవతకు భయంకరాలు! భక్త హృదయాలకు సంతోషకరాలు! నిత్య కల్యాణ కరాలు ! -----

--- నారదుడు వ్యాసుని కలసిన సందర్భం:

***ఉ: ధాతవు భారత శ్రుతివిధాతవు ! వేద పదార్ధజాత వి
జ్ఞాతవు కామ ముఖ్యరిపుషట్క విజేతవు ! బ్రహ్మతత్వ ని
ర్ణేతవు ! యోగినేతవు ! వినీతుc డ నీవు చలించి చెల్లరే !
కాతరు కైవడిన్ వగవc గారణ మేమి? పరాశరాత్మజా .....

---- పరాశ నందనా! నీవు దాతవు పంచమ వేదమైన భారతాన్ని అందించినవాడవు, వేదార్ధాన్ని చక్కగా వరించినవాడవు,  అరిషడ్వర్గాలను జయించినవాడవు, పరబ్రహ్మతత్వాన్ని నిర్ణయించినవాడవు. యోగులలో అగ్రేసరుడవు. వినయసంపన్నుడవు. అటువంటి నీవు చలించిపోయి విచారించటానికి కారణమేమయ్యా? ఆశ్చర్యంగా వున్నదే !? ......

No comments:

Post a Comment