Friday, March 6, 2015

హోలీ రంగులు సహజ" సిద్ధం" గా

హోలీ రంగులు సహజ" సిద్ధం" గా... హెల్దీ హోలీ - హేపీ హోలీ
                                                                               తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి
పసుపు
ఇది చాలామందికి తెలిసిన చిట్కా. పసుపుపొడిని నీళ్లలో కలిపితే చాలు. అవి చిక్కగా, పెద్దమొత్తంలో కావాలంటే ఆ నీళ్లలో శనగపిండి కలుపుకోవాలి. ఆ ద్రావణంతో స్నానం ఎంతో ఆరోగ్యకరం. పసుపు యాంటిబయాటిక్గా పనిచేస్తుంది. శనగపిండి మనశరీరంపై పట్టి మట్టిని శుభ్రం చేస్తుంది. సాధారణంగా నలుగుపెట్టుకోవడానికి ఈ పిండినే వాడతారన్నది అందరికీ తెలిసిందే. దీనికి కాస్త రోజ్వాటర్, కస్తూరి దట్టిస్తే ఇక ఆ సువాసన మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. ఒకవేళ శనగపిండి ఇష్టం లేదనుకోండి...మైదా, గోధుమ, వేరుశనగ పొడినీ వాడుకోవచ్చు. లేదంటే పసుపుచామంతి, పసుపు బంతిపూలు, తంగేడు పూల పొడిని నీళ్లలో కలుపుకోవచ్చు. ఈ పూలపొడిని లేదా పూలను నీళ్లలోవేసి మరగబెడితే రంగు స్పష్టంగా కన్పిస్తుంది.
ఎరుపు
ఎర్రచందనం పొడిని, ఎర్ర మందార పువ్వుల పొడిని ఎర రంగుకోసం వాడుకోవచ్చు. ఈ పొడికి మన ఇళ్లలో ఉండే ఏ పండిని కలిపినా పెద్దమొత్తంలో రంగును సిద్ధం చేసుకోవచ్చు. సింధూరపళ్లతోనూ ఎరుపురంగు ద్రావణం తయారుచేసుకోవచ్చు. ఎర్ర దానిమ్మ గింజలు, లేదా తొక్కలను నీళ్లలో మరగనిస్తే ఎర్రటిరంగునీళ్లు సిద్ధం అవుతాయి. రాత్రంతా ఎర్రమందార పూలను నీళ్లలో నానబెట్టి ఆ తరువాత వేడిచేస్తే చక్కటి ఆరోగ్యకరమైన ఎర్రటినీళ్లు సిద్ధమవుతాయి.
కాషాయరంగు
మోదుగ పూలతోకూడా కాషాయ రంగు నీళ్లు సిద్ధం చేసుకోవచ్చు. శ్రీకృష్ణుడు మోదుగపూలతో తయారుచేసిన రంగునీళ్లతోనే హోలీ ఆడాడని పురాణాలు చెబుతున్నాయి.. ఎండబెట్టిన మోదుగ పూలను, వాటి బెరడునుకూడా రంగుల తయారీకి వాడుకోవచ్చు.
నీలిరంగు
నీలి మందార పూలు, నీలిరంగులో మెరిసిపోయే జకరందా పూలతో పొడిని తయారు చేసుకోవచ్చు.
మెజంటా
బీట్రూట్ ముక్కలను రాత్రంతా నీళ్లలో నాననివ్వండి, పొద్దునే్న వాటిని మరిగించండి. చక్కటి మెజంటా రంగులో నీళ్లు సిద్ధం. ఇక ఎర్ర ఉల్లిపాయ ముక్కల్ని నీళ్లలో రాత్రంతా నాననివ్వండి. పొద్దునే్న ఆ ముక్కల్ని తీసిపారేయండి. నీళ్లుమాత్రం ఎర్రగా మెరుస్తూంటాయి.
నలుపు
రాసి ఉసిరికాయలు, మామూలు ఉసిరికాయలని ఇనుపగినె్నలో మరిగిస్తే నల్లని నీళ్లు సిద్ధమవుతాయి. చల్లారాక వాటిని రాత్రంతా నిల్వ ఉంచితే పొద్దున్నకల్లా మరింత నల్లగా తయారవుతాయి. వాటివల్ల ఆరోగ్యంకూడా బాగుంటుంది. ఇక నల్లని ద్రాక్షపళ్ల గుజ్జును నీళ్లలో కలిపితే నల్లనిరంగు నీళ్లు తయారవుతాయి. ఇవి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందిస్తాయి. ఇక మందార ఆకుల పొడి, రంగురంగుల క్యాబేజీలు, క్యారెట్లు, బీర ఆకుల పొడి, గుమ్మడి గుజ్జుతోకూడా రంగరంగుల నీళ్లు సిద్ధం చేసుకోవచ్చు. గోధుమరంగు
కిళ్లీలో ఎర్రటి రంగుకోసం వాడే కాసు - ఆ బెరడును నీళ్లలో మరగనివ్వాలి. దానికి కాస్త కాఫీ ఆకులు కలిపితే మంచివాసన, మంచి రంగు పడతాయి.
ఆకుపచ్చ
పొడిరంగు కావాలనుకుంటే గోరింటాకుల పొడిని, కాస్త మైదా, లేదా వరి పిండిలో కలుపుకుంటే చాలు. దీనికి ఎట్టిపరిస్థితిలోనూ నిమ్మరసం కలపొద్దు సుమా. అది కలిస్తే వచ్చే ఎరుపురంగు వచ్చేసి ఓ పట్టాన వదలదు. గుల్మొహర్ పూలనుకూడా ఎండబెట్టి పొడిచేసి ఆకుపచ్చ రంగు తయారు చేసుకోవచ్చు. గోధుమగడ్డిని ముద్దచేసి నీళ్లలో కలిపితే అదికూడా ఆకుపచ్చరంగులోనే ఉంటుంది. పుదీనా ఆకులనూ ముద్దగా నూరి నీళ్లలో కలిపితే ఆకుపచ్చరంగునీళ్లు సిద్ధం. పైగా ఇవి మంచి వాసననూ కలిగి ఉంటాయి. టమాటా, కొత్తిమీర ఆకులనూ ఇలా ముద్దగా చేసి నీళ్లలో కలపొచ్చు. గోరింటాకు పొడిని నీళ్లలో కలిపితే అవీ ఆకుపచ్చగా కన్పిస్తాయి.
ఓపిక లేని వాళ్లు ఈ ప్రకృతి ప్రసాదించిన పళ్లు, పూలు, కూరగాయలు, ఆకులతో తయారైన పొడిని అమ్మే ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలను సంప్రదించి సరసమైన ధరలకు కొనుగోలు చేసుకోవచ్చు.

Sunday, March 1, 2015

తిరుమల దర్శనం

పవిత్రమైన తిరుమల కొండల దాకా వెళ్లి వద్దాం రండి...

పచ్చటి తివాసీలా ఉన్న ఒక కొండ గుండె గొంతుకలో కొట్లాడుతోంది...
అంతా నిశ్శబ్దం... ఆకు కూడా కదలట్లేదు. అప్పటి దాకా వగరు చిగురులు తిని, మధురంగా పాడిన కోకిల... ఎందుకో స్థబ్దుగా ఉండిపోయింది. సమస్త ప్రకృతి మౌనం వహించి, గుండె చేతబట్టుకుని ఎదురుచూస్తోంది... అవును మౌనం కూడా ఒక భాషేగా ! ముగ్ధమైన హృదయభాష !

పగలూ రేయి, భక్తుల విన్నపాలతో అలసిన స్వామి, కాస్తంత సేద తీరేందుకు ఆ కొండకు  విహారానికి వస్తున్నారట ! ఎంతటి శుభవార్త ! అనంతమైన తన రూపాన్ని, జీవకారుణ్యంతో ఆరడుగులకు కుదించుకుని, అరవింద లోచనాలతో ఆజానుబాహుడై, విచ్చేసిన కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడు, అచటికి విచ్చెయ్యనున్నాడు. ఎంతో తపస్సు చేసిన యోగుల హృదయాల్లో గోచరించే ఆ దివ్యమంగళ రూపం, దుర్లభమైన ఆ మనోవాచామగోచరమైన దివ్యతేజస్సు దర్శనం, తమకు లభించబోతోంది. మానులైనా, మొక్కలైనా, మూగాజీవాలైనా, స్వామి మనసుతో పంపిన ఆ చల్లటి కబురు విని, ఒళ్ళంతా కళ్ళు చేసుకుని, ఇంద్రియాలు కైంకర్యం చేసి, వేచి ఉన్నాయి.

ఎక్కడో దూరంగా అడుగుల సవ్వడి. స్వామి వస్తున్నారన్న వార్తను మలయసమీరం అల్లనల్లన మోసుకు వచ్చి, అందించింది. స్వామి వచ్చే బాట వెంట ప్రకృతి పూల తివాసీ పరచింది. ఆయన మృదువైన పాద పల్లవం మోపిన చోటున,  పుడమి పులకించిపోతోంది. శిలలు స్వామికి స్వాగత తోరణాలు కట్టాయి. కృష్ణ జింకలు, లేళ్ళు, దుప్పులు చెంగుచెంగున గెంతుతూ తమ ఆనందాన్ని తెలియచేసాయి. పక్షులు రెక్కలు అల్లారుస్తూ, ఆయన నడిచే బాట వెంట సందడి చేస్తూ, ఎగురసాగాయి. నీలమేఘశ్యాముని చూసిన వన మయూరం, నీలిమబ్బును చూసినట్లు పరవశించి , పురివిప్పి ఆడసాగింది. గానం మరచిన కోకిల, గొంతు సవరించుకుని, తిరిగి మధురంగా పాడసాగింది.

చెట్లు తలలు లయబద్ధంగా ఊపుతూ, స్వామికి వీవెనలు వీచాయి. ఆకాశగంగ ఉరకలు వేస్తూ వచ్చి, ఆయన పాదాలు కడగాలని ఉవ్విళ్ళూరుతోంది. చిట్టిపొట్టి ఉడుతలు రామావతారం తర్వాత తిరిగి స్వామి స్పర్శకు నోచుకోవాలని, ఆయన చుట్టూ తిరగసాగాయి. కొండ అంచును తాకే మేఘాలు, చిరుజల్లులతో స్వామిని అభిషేకించ సాగాయి. అవి, రాలే పూల పరిమలాలతో కలిసి, పూలవానగా మారి, స్వామి తనువు తాకాలని తపిస్తున్నాయి.

పాములు, కొండ చిలువలు, చిరుతలు, ఏనుగులు వంటి క్రూర మృగాలు సైతం, తమ స్వభావాన్ని మరచి, జీవశక్తిని అంతా కళ్ళల్లో నింపి స్వామినే చూడసాగాయి. పగలూ రేయి కలిసే ఆ కెంజాయ రంగు తొలి సంధ్యలో, సూర్యచంద్రులు చెరో వైపూ చేరి, గగనాన విప్పారిన స్వామి నయనాల్లా వెలుగొందుతున్నారు. స్వామి తనను అధిరోహించాకుండానే వేం చేసారని, ఆయన ఆజ్ఞానువర్తి అయిన గరుడుడు విశాలమైన రెక్కలు చాచి, విహంగ వీక్షణం చేస్తూ,  ఆయన పిలుపుకై వేచిఉన్నారు.

కొండ దారి వెంట సాగుతున్న ఆ లీలామానుష వేషధారిని, ఆ సింహేంద్ర మధ్యముడిని చూసిన ఒక గోవు గోముగా ఆయన్ను ఇలా అడిగింది " స్వామి ! కృష్ణావతారంలో నీవు సమ్మోహనంగా వేణువు ఊదావు కదా ! ఏదీ ! మరొక్కమారు మాకోసం ఆ మురళీరవం వినిపించవూ !"
కరుణా సముద్రుడైన స్వామి , దాపునున్న ఒక వెదురు కర్రను  అందుకున్నారు. క్షణాల్లో అది తనను తాను శూన్యం చేసుకుని, వేణువు గా రూపాంతరం చెందింది... స్వామి మోవి స్పర్శకై సన్నద్ధమవుతూ, నిలువెల్లా ఆయన ఊపిరిని నింపుకొవాలన్న ఆత్రంతో , ఆర్తిగా పరితపిస్తూ !


చిగురుమోవిని  వెదురుకు ఆన్చి, జీవనాదాన్ని శ్వాసగా పంపారు స్వామి. ఓహో, ఎంతటి మధుర రవళి. చంచల హృదయాల్ని సైతం క్షణాల్లో నిలువరించే వీనుల విందైన అమృతపాతమది. నెమ్మదిగా, మంద్రంగా మొదలై... ఒక్కొక్క ప్రాణిని అల్లేస్తోంది. కొండలూ, లోయల్లో ప్రతిధ్వనిస్తోంది. జీవాత్మల్నిఆవరించేస్తోంది... వేణుగానం తారాస్థాయికి చేరుకుంది...

ఏవీ , ఇప్పుడా మొక్కలు, పక్షులు, జీవాలు అన్న వివక్ష ఏది ? అన్నీ స్వామే ! అంతా స్వామే ! తమనుతాము మరచిన జీవులు ఒక అద్భుతమైన ప్రశాంతతలో లయమయ్యాయి. జీవాత్మ పరమాత్మతో మమేకమయ్యే అలౌకిక స్థితి అది.

ఇంతలో ఎక్కడో అందెల సవ్వడి. స్వామి వేణుగానానికి అలమేలుమంగమ్మ కూడా కదిలి, కొండెక్కి వచ్చింది. తన దేవేరిని అక్కున జేర్చుకుని, నెమ్మదిగా నడవసాగారు స్వామి. మెరుపుకు మేఘం తోడైనట్లు ఆ చక్కని జంటను, కన్నుల పంటగా చూడసాగాయి జీవులన్నీ.
అందరినీ మైమరపింప చేసిన స్వామి, తన దేవేరితో కలిసి, నెమ్మదిగా అదృశ్యమయ్యారు. చిత్రంగా, ఆయన పాదముద్రలు మాత్రం అలాగే ఉన్నాయి... వేల గుండెల్లో.

తిరుమలకు వెళితేనే స్వామి దర్శనం కలుగుతుందా ? ఆర్తితో కన్నులు మూసుకుని, 'స్వామీ !' అని ప్రేమగా పిలిస్తే, ప్రతి మనసులోనూ, సాక్షాత్కరిస్తుంది, ఆ సహస్ర చంద్రసమభాసుని దివ్య దర్శనం. రండి, మనోవేగంతో తిరుమల కొండల్లో విహరిద్దాం ! ఆకులో ఆకుగా, చినుకులో చినుకుగా మారి... ఆ కొండగాలులతో కలిసి పాడదాం. 'గోవిందా ! గోవిందా !' అని నిత్యం మార్మ్రోగే ఆ ఆనందనిలయంలో, గోవింద నామంతో మమేకమవుదాం. కళ్ళముందు కానవచ్చే వైకుఠం తనివితీరా చూసి, జన్మలు ధన్యం చేసుకుందాం !

(దూరమో, భారమో తిరుమలకు వెళ్లి, 3-4 ఏళ్ళ పైనే అయ్యింది. మా కోసం చండీగర్ లో వెలసిన శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు, స్వామి ఎదుట ఉండగా, నాలో కలిగిన భావనలు - భావరాజు పద్మిని.)