Saturday, March 23, 2013

సాలభంజిక కధలు


విక్రమార్కుడు 

పట్టువదలని విక్రమార్కుడు శవాన్ని భుజాన వేసుకుని నడచి పోతూ ఉంటాడు తెలుసు కదా? ఐతే ఆ విక్రమార్కుడుకి ఒక సింహాసనం ఉంది. ముందుగా ఆ సింహాసనం ఎలా వచ్చిందో తెలుసుకుందామా మరి? 

భూలోకంలో ఉజ్జయనీ అనే మహానగరం ఉంది (దీనికి చాలా పేర్లు ఉన్నాయి అవన్ని మరోసారి). ఐతే ఈ పట్టణం మాళవ దేశంలో శిప్రానదీతీరంలో ఉంది. ఇక్కడే సాందీప మహాముని ఆశ్రమం ఖూడా ఉంది. కృష్ణ బలరాములు విద్యనభ్యసించిన చోటిదే. ఇంతకీ ఈ మహాపట్టణంలో మేడలు మేరుపర్వతాన్ని మించి ఉంటాయట. ఆ మేడల్లో ఉండే ప్రజలు పాపరహితులు, భాగ్యవంతులు, అజాతశత్రువులు. అంతటి అందమైన మహత్తరమైన ఉజ్జయనీ నగరాన్ని పరిపాలించే చంద్రగుప్తుని కుమారుడు భర్తృహరికి, సవతితల్లి కుమారుడు మన విక్రమార్కుడు. వీరికి మంత్రి భట్టి. 

కొన్నాళ్ళ తర్వాత రాజ్య భారాన్ని తన తమ్ముడైన విక్రమార్కుడికి అప్పగించి భర్తృహరి రాజ్య త్యాగంచేసి దేశాంతరం వెళ్ళి పోయాడు. తర్వాత మన విక్రమార్కుడు ధనకనకవస్తువాహనాలతో పేరుప్రఖ్యాతులతో రాజ్యమేలుతూ ఉంటాడు. 

అలా ఉండగా భూలోకంలో విశ్వామిత్రుడు దేనినో ఆశించి కఠోరమైన తపస్సు చేయసాగాడు. ఈ సంగతి ఇంద్రుడికి తెలిసింది. ఎలాగైనా తపోభంగం చేయాలని రంభా ఊర్వశులను ఆజ్ఞా పించాడు. ఐతే ఇద్దరిలో ఎవరు వెళ్ళాలన్న సందేహం కలిగింది. అప్పుడు ఎవరి నాట్యం బాగుంటే వారిని పంపాలని నిర్ణయించటం జరిగింది. ఇంతకీ ఆరోజు నాట్య ప్రదర్శనలో ఎవరిని సరిగ నిర్ణయించలేకపోయారు. అప్పుడు ఇంద్రుడు "ఇంతటి మహామణులున్న సభలో నిర్ణయించే గొప్ప వారేలేరా?" అని ప్రశ్నించాడు. అందుకు మన నారదుడు లేచి "ఈ సభలో కాదు భూలోకంలో విక్రమార్కుడనే మహారాజు ఉన్నాడు అతడు సకల కళాకోవిదుడు. ఆ రాజే ఈ సమస్యను పరిష్కరించగలడు కావున అతగాడిని పిలిపించవలసిందని" కోరాడు. 

అందుకు ఇంద్రుడు సంతసించి వెంటనే మాతలి అనే రథసారథిని పిలిచి విక్రమార్కుని సగౌరవముగా తీసుకుని రమ్మని ఆదేశించాడు. వెంటనే మాతలి రథాన్ని తీసుకుని ఉజ్జయనీనగరాన్ని చేరుకుని "రాజా నేను ఇంద్రుని రథసారథిని, నిన్ను సగౌరవముగా అమరావతికి తీసుకురమ్మని దేవేంద్రుని ఆజ్ఞ కావున తమరు బయలుదేరవలసింది" అని విన్నవించాడు. అందుకు విక్రమార్కుడు మిక్కిలి సంతసించి "కామధేనువు, కల్పతరువు, చింతామణి వంటి దివ్య వస్తువులకు పుట్టినిల్లైన అమరావతిని చేరుకున్నాడు. 

విక్రమార్కుని సవినయముగా ఆహ్వానించిన అమరేశ్వరుడు తన పక్కనే ఉన్న మణిమయరత్నఖచితమైన సింహాసనమ్మీద కూర్చోబెట్టుకుని కుశల ప్రశ్నల అనంతరం అసలు సమస్యను వివరించాడు. "ఓ నరనాథా! ఈ రంభా ఊర్వశులు ఒకరిని మించి మరొకరు గొప్పనాట్యగత్తెలు. వారి తారతమ్యం తెలుసుకోవటమం మాతరంకాలేదు. నీవు సకలవిద్యా పారంగతుడవు కావున వీరిద్దరిలో ఎవరు నాట్య ప్రావీణ్యులో నీవే నిర్ణయించగలవు" అని విన్నవించాడు. 

అంతలో రంభ తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించగోరి రాగతాళయుక్తముగా గంధర్వ గానంతో శరీరము మెరుపుతీగవలె శృంగారము వర్షించునట్లు గా నాట్యం చేసింది. మరునాడు ఊర్వశి తాను జయము పొందాలన్న పట్టుదలతో భావరాగతాళ లాస్యం ఉట్టిపడేలా మనోహరముగా నృత్యము చేసింది. ఇద్దరినీ పరిశీలించినమీదట "ఊర్వశి"నే నేర్పరిగా నిర్ణయించాడు 

"అంత నిక్కచ్చిగా ఎలా చెప్పగలవు?" అని ప్రశ్నించాడు ఇంద్రుడు. 

అందుకు "ఓ దివిజేశా! కంటికింపుగా నాట్యం చేయటంలో ఇద్దరు సిద్ధహస్తులే. కాకపోతే ఊర్వశినాట్యం అత్యంత మనోహరమే గాకుండా శాస్త్ర పరిధులని దాటకుండా ఉంది. అందువల్ల ఊర్వశినే నిర్ణయించటం జరింది" అని చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు అతని మేధాశక్తికి సంతసించి దివ్యాభరణాలతోపాటు నవరత్నఖచితమైన సింహాసనాన్ని కానుకగా ఇచ్చాడు. ఆ సింహాసనానికి అటు 16 ఇటు 16 మొత్తం 32 బంగారు అందమైన బొమ్మలున్నాయి. వాటిని సాలభంజికలు అంటారు. 

ఆ విధంగా మన విక్రమార్కుడికి సింహాసనం లభించింది. 

విక్రమార్కుడికి శివుడి వరం 

భర్తృహరికి విక్రమార్కుడు సవతి తమ్ముడని కదా చెప్పుకున్నాము, ఐతే ఒక రోజు ఆ భర్తృహరి విక్రమార్కుని పిలిచి "తమ్ముడూ ! ఒకప్పుడు మన తండ్రి సూర్యుని గురించి తపస్సు చేసాడు. అప్పుడు సూర్యుడు మన తండ్రికి కొడుకుగా పుడతానని వరమిచ్చాడు. ఆ వరపుత్రుడుగా పుట్టిన సూర్యుడవే నీవు. కావున సర్వలక్షణ సంపన్నుడవై బుద్ధి మంతుడైన భట్టిని మంత్రిగా చేసుకుని రాజ్య భారాన్ని వహించి ప్రజారంజకమైన పరిపాలన గావించు. నేను రాజ్యత్యాగం చేసి దేశంతరం వెళ్ళిపోతున్నాను. నాకు ఈ రాజ్యకాంక్ష ఈ భోగభాగ్యాలు విరక్తి కలిగాయి. కావున నీవు ఈ భోగభాగ్యాలను అనుభవిస్తూ సన్మార్గమున పాలన గావించు" అని రాజ్యభారం అప్పగించి దేశాంతరం వెళ్ళిపోయాడు. 

అప్పటినుండి విక్రమార్కుడు తన అన్న భర్తృహరి ద్వారా పొందిన రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉండేవాడు. రాజుల్ని, సామంత రాజుల్ని గెలిచి వారిని పాదాక్రాంతుల్ని చేసుకుని వారితో సేవలు పొందుతూ ధనకనక వస్తు వాహనాలతో తుల తూగుతూ పుణ్యరాశిగా పేరు పొందాడు.

ఇలా ఉండగా కొంత కాలానికి విక్రమార్కుడు శివుని గురించి తపస్సు చేసాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అందుకు మన విక్రమార్కుడు "మరణ మనేది లేకుండా ఉండే వరమీయమని" అడిగాడు.

అందుకు శివుడు "ఓ ! రాజా ! మానవ జన్మ ఎత్తాక చావు రాకుండా ఉండడం అసాధ్యం. పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తప్పదు. కావున మరొక వరమేదైనా కోరుకో" అన్నాడు.

అందుకు విక్రమార్కుడు "సరిగ్గా ఒక్క సంవత్సరం దాటి ఒక్క రోజు మాత్రమే వయసు గల అమ్మాయికి పుట్టిన కొడుకువలన నాకు మరణం సంభవించేలా వరమీయమని" కోరాడు.

శివుడు దానికి "సరే తధాస్తు" అని వరమిచ్చి "నువ్వు ఇంకా వెయ్యేళ్ళు రాజ్య సుఖం అనుభవించగలవు" అని దీవించి మాయమయ్యాడు.

తన తపస్సు ఫలించినందుకు సంతోషంతో రాజ్యానికి తిరిగి తన మంత్రి ఐన భట్టికి ఈ సంగతంతా చెప్పాడు. అది విన్న భట్టి చాలా తెలివిగలవాడు కావడంతో మరొక ఉపాయం చెప్పాడు. అదెలా అంటే "రాజా నీకు భగవంతుడు వెయ్యేళ్ళు బ్రతకమని వరమిచ్చాడు కదా, పైగా నీకు కూడా చాలా కాలం బ్రతకాలన్న కోరిక ఉంది కదా, కనుక నేను చెప్పే ఉపాయం ఎలా అంటే ఒక సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే నీవు రాజ్య పాలన చేసి మిగిలిన ఆరు నెలలు బయట దేశాటనం చేస్తూ కాలం గడిపితే శివుడు నీకిచ్చిన ఆయుర్దాయం రెట్టింపౌతుంది. అందువలన రెండు వేల సంవత్సరాలు బ్రతుకుతావు. ఒక్క ఆరు నెలలు రాజ్యకాంక్ష వీడితే బయట ప్రజల మంచి చెడ్డలు తెలుస్తాయి. నీ జీవిత కాలం పెరుగుతుంది" అని సలహా ఇచ్చాడు.

అది మన విక్రమార్కుడికి బాగా నచ్చింది. వెంటనే అమలు పరచాలనుకున్నాడు. అలా ఉండగా ఒక నాడు ఒక యోగి వచ్చి తనతో స్మశానానికి రమ్మని కూడా తీసుకుని వెళ్ళాడు. అక్కడ హోమాలు మంత్ర తంత్రాలు చేసి బేతాళుణ్ణి రప్పించి మన విక్రమార్కుని బలి ఇవ్వబోయాడు. అందుకు విక్రమార్కుడు తెలివిగా తప్పించుకుని ఆ యోగిని బేతాళుడికి బలిగా అర్పించాడు. అప్పుడు ఆ బేతాళుడు విక్రమార్కుని మెచ్చి "ఓ రాజా !నీకు అవసర మైనప్పుడు ఆపద సమయములోను నన్నెప్పుడు తలుచుకుంటే అప్పుడు వచ్చి నిన్ను కాపాడగలను. నీకు అస్టసిద్ధులూ లభ్యమగు గాక" అని దీవించి మాయమయ్యాడు. బేతాళుడి పరిచయం ఈ విధంగా జరిగిందన్న మాట.

అదే సమయాన బ్రహ్మాది దేవతలు "నీకు విద్యాధర చక్రవర్తుల ఆధిపత్యం లభించగలదని" దీవించారు. పిమ్మట రాజ్యానికి తిరిగి వచ్చి సప్త సంతతులు, సత్రములు, సంతత యాగములతో అనేక పుణ్యకార్యములతొతో నిత్యమూ దానధర్మాలతో తేలి యాడుతూ ధర్మరాజుని మించి ఉజ్జయనీ పురాన్ని పరిపాలించి విక్రమార్క శకకర్తగా పేరు పొందాడు.

విక్రమార్కుడి మరణం 

రాజులు రాజ్యాలు అంతరించినా, శకాలు మారినా, యుగాలు గడచినా, శక కర్తలుగా యుగ పురుషులుగా మనకి వింత వింత చరిత్రలు, మంచి మంచి పురాణ కధలూ తెలుసుకోవలసినవి కోకొల్లలుగా ఉన్నాయి. అందుకే వాటిలో అణు మాత్రమైనా తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాము. అలాంటిదే ఈ విక్రమార్కీయము.
ఇంతవరకు విక్రమార్కుడు శివుని వలన వరం పొందాడని చెప్పు కున్నాం కదా! ఐతే ఆ వరము ఎలా నిజమయ్యిందో , ఇప్పుడు తెలుసుకుందాం. జీవితం ఎల్లప్పుడూ ఒక్కలా ఉండదు, దారి పొడవునా పూలూ ముళ్ళూ ఉంటూనే ఉంటాయి. విధి విధానాన్ని తప్పించుకోవటం ఎవరికి సాధ్యం కాదు. వేలకు వేల సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసిన విక్రమార్కుని రాజ్యంలో కూడా కాలచక్రంలో క్రమక్రమంగా అపశకునాలు కనబడసాగాయి. వాటిని చూసి రాజు చింతాక్రాంతుడై మంత్రిని పిలిచి కారణం ఏమిటని అడిగాడు.

అందుకు మంత్రి ఐన భట్టి "రాజా! మేడ మీద కాకులు గుడ్ల గూబలూ చేరి అరవటం, పట్టపుటేనుగు మరణించటం, గుర్రములు సైతము కన్నీరు గార్చటం ఇవన్నీ నాకెందుకో అపశకునాలుగా కనిపిస్తున్నాయి. ఏదో కీడును సూచిస్తున్నాయి. ఎందుకో భయంగా ఉంది" అన్నాడు.

అందుకు విక్రమార్కుడు నవ్వి "పూర్వము నాకు పరమ శివుడు ఇచ్చిన వరం గుర్తులేదా? ఒక్క సంవత్సరము మీద ఒక్క రోజు మాత్రమే వయస్సు గల కన్యకు కొడుకు పుట్టడం ఎలా సాధ్యమవుతుంది? అట్టి కొడుకు వల్ల నాకు మరణమెలా సంభవిస్తుంది? వింతగా లేదా? ఇదంతా కల్ల, ఇది జరిగే అవకాశమే లేదు. నీవేమీ విచారించకు" అని ధైర్యం చెప్పాడు.

అందుకు భట్టి "మహరాజా! మీరు పొరబడుతున్నారు. అది శివుడిచ్చిన వరం. అంత తేలిగ్గా కొట్టి పారెయ్యకండి. భగవంతుని సెలవైతే అసంభవములు సంభవములు కావచ్చు, సంభవములు అసంభవములు కావచ్చు. ఇది ఈశ్వరేచ్ఛ. ఒకప్పుడు ఉగ్ర నరసింహుడు ఉక్కు స్థంభములో ప్రత్యక్షమవలేదా? ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, ఐదు ముఖములు గల వారెవ్వరితోను చావు రాని తారకాసురుని షణ్ముఖుడు చంపలేదా? రావణాసురుడంతటి వాడు నర వానరుల చేతిలో మరణించలేదా? కావున రాజా, అట్టి బాలుడు పుట్ట వచ్చును అని నా నమ్మకం. అందువలన మన వేగుల వారిని నలు దిశలా పంపి ఎప్పడి కప్పుడు వార్తలను సేకరించుకుని రమ్మనటం శ్రేయస్కరం" అని సలహా ఇచ్చాడు.

అప్పుడు విక్రమార్కుడు తనకీ పని సక్రమంగా చేయగల సమర్ధుడెవరా? అని ఆలోచించగా చివరకు బేతాళుడు జ్ఞాపకం వచ్చాడు. తననీ ఆపదనుంచి కాపాడగల సమర్ధుడు బేతాళుడు ఒక్కడే అని గ్రహించి వెంటనే అతనిని మనస్సులో తలచుకున్నాడు. అంతే, తలచినదే తడవుగా బేతాళుడు ప్రత్యక్షమయ్యాడు. రాజు కోరిక తెలుసుకుని వెంటనే మాయమై స్వర్గ మత్స పాతాళ లోకాలని గాలించటనికి వెళ్ళిపోయాడు.

అన్ని లోకాలు చుట్టి వచ్చి "మహరాజా! మీ ఆజ్ఞ ప్రకారం ముల్లోకాలు చుట్టి వచ్చాను. ఐతే నాకు మార్గ మధ్యాన ఒక వింత కనిపించింది. అదేమిటంటే ఓ కుమ్మరి వాని ఇంటిముందు ఒక చిన్న దాని పక్కన ఒక చిన్నపిల్ల వాడు కూర్చుని ఉన్నాడు. వాడు మట్టి తో చేసిన సైన్యము తో ఆడుకుంటున్నాడు. అక్కడే కూర్చుని ఉన్న విప్రునితో మాట గలిపి ఈ ' బాలుడెవడు? ' అని అడిగాను. అందుకు ఆ విప్రుడు ' వీడు నా మనుమడు. ఇదిగో ఈమె వాడి తల్లి. ఈమెకు సరిగ్గా ఒక సంవత్సరమ్మీద ఒక రోజు వయస్సు అని చెప్పి ఈమెకు నాగేంద్రుని కృపవలన వీడు జన్మించాడు. ఇలాంటి అపూర్వమైన సంఘటనలు ఆ భగవంతునికే తెలుసు ' అని చెప్పాడు. కావున నీ రాజ భోగాలు నీవిగా ఉండాలంటే నీవు మృత్యువును జయించాలంటే ఆ బాలుని ఎలాగైనా చంపగల ప్రయత్నం చేయి" అని చెప్పి మాయ మయ్యాడు.

అదంతా విన్న విక్రమార్కుడికి గుండెల్లో రాయి పడింది. "ఇదంతా వింటుంటే నాకు చావు తప్పదు ఇందులో సందేహం ఏమీలేదు" అనుకుని ధైర్యం తెచ్చుకుని "ఇది తన ప్రాణానికి సంబంధించినది కావున ఇదేదో తనే స్వయంగా పరిష్కరించుకోవాలి" అని నిశ్చయించుకొని వెంటనే భట్టిని పిలిచి రాజ్య భారం అప్పగించి చతురంగ బలాన్ని వెంటనిడుకొని ప్రతిస్టానపురానికి ప్రయాణం సాగించాడు.

ఇంతలో అతని సైన్యం వెళ్ళి ఆ బాలుని యుద్ధానికి ప్రేరేపించారు. ఇంతకీ ఆ బాలుని పేరు "శాలివాహనుడు". అతనికి నాగేంద్రుని మంత్ర శక్తి వలన నాగులు, గుర్రములు, రథములు, భటులు అందరు యుద్ధానికి తరలివచ్చారు.

ఆదిశేషుని ఆశీర్వచనము వలన నాగులు వచ్చి విక్రమార్కుని సైన్యాన్ని చుట్టు ముట్టి చంపసాగాయి. శాలివాహనునికీ విక్రమార్కునికీ ముఖా ముఖీని భయంకర యుద్ధం జరిగింది. ఆ పోరాటంలో విక్రమార్కుని సైన్యం వీరావేశంతో యుద్ధం చేసింది. కానీ దైవ సహాయం లేనందువలన ఓడిపోయి చెల్లాచెదరైపోయాయి. ఐనా సరే "ఆ సర్వేశ్వరుడే కాలఖర్మాన్ని తప్పించుకోలేనప్పుడు, మానవ మాత్రులం మనమనగా ఎంత?" అనే దృఢ నిశ్చయంతో ధైర్యాన్ని కూడగట్టుకుని మన విక్రమార్కుడు శాయశక్తులా ఫోరాడాడు. ఐనా చివరికి శాలివాహనుని చేతిలో ఓడిపోయి అతని అస్త్రానికి గురియై మరణించాడు.

అప్పుడు అతని శరీరంనుంచి అఖండ ప్రకాశవంతమైన తేజస్సు వెలువడి మహా జ్యోతిలా వెలుగొందుతూ పైకెగసి సూర్యునిలో లీనమైపోయింది. అంటే అసాధ్యమనుకొన్న విక్రమార్కుడి మరణం ఈ విధంగా జరిగిందన్న మాట. అటు పిమ్మట శాలివాహనుడు విజయుడై ప్రతిస్టాన పురానికి రాజయ్యాడు. అప్పడికి విక్రమార్కుడి భార్య గర్భవతిగా ఉంది. ఆమె ఈ వార్త విని, మంత్రులు పౌరులు ఎందరు ఎంత చెప్పినా వినకుండా పొట్ట కోసి పాపడిని తీసి మంత్రుల కప్పగించి తాను అగ్నిప్రవేశం చేసి అమరలోకాన్ని చేరింది.

ఒక వైపు భట్టి రాజ్య భారం వహిస్తూ, మరొక వైపు ఆ పసివాణ్ణి పెంచుతూ, ఇతడు తేజో బల సంపన్నుడూ తండ్రిని మించిన తనయుడూ కాగలడని ఎంచి యుక్త వయస్సు రాగానే ప్రశాంతుడనే పేరుతో రాజ్యాభిషేకం చేసి విక్రమార్కుడి రత్న ఖచితమైన సింహాసనం మీద కూర్చో బెట్టబోయారు. అంతలో అశరీరవాణి "ఓ మంత్రి వర్యులారా! ఇంతటి మహిమాన్వితమైన సింహాసనాన్ని అధిష్టించగల అర్హత ఈ బాలునికి లేదు, మరెవ్వరికీ కూడా లేదు. కనుక మీ ప్రయత్నం మాని ఈ సింహాసనాన్ని భూమిలో పాతి పెట్టించండి" అని పలికింది. అలా చేయక పోతే మరే ప్రమాదమొస్తుందో అని భయపడి ఆ సింహాసనాన్ని వెంటనే భూస్తాపితం చేసారు. ఆ పైన ఎత్తుగా గట్టులా కట్టించారు.

కొంత కాలానికి ఆ రాజు, ఆ రాజ్యం అంతరించి ఒక దిబ్బగా మిగిలి పోయింది. అది కాలక్రమేణ ఒక విప్రుని వశమైంది. ఆ విప్రుడే అక్కడ జొన్నలు, సజ్జలు, అగిశెలు, గోధుమలు, దోస పాదులు పండించు కుంటూ ఒక మంచె మీద కూర్చుని అందరినీ అభిమానంగా పలకరిస్తూ, మంచె దిగాక వారిని తిడుతూ వింతగా ప్రవర్తిస్తూ ఉండేవాడు.
 ఇక ఆ సింహాసనం భోజ రాజును ఎలా చేరిందో చూద్దాం.




భోజ రాజు 
ధారాపురం అనే మహా నగరానికి  రాజు  భోజరాజు.  అతను గొప్ప పరాక్రమమం కలవాడు.  అంతటి సద్గునవంతుడైన రాజు మరొకరు లేరు అని పేరుపొందాడు.  అతన్ని భూలోక దేవేంద్రుడు అనేవారు. భోజరాజు మంత్రి పేరు  నీతిమంతుడు.

క్రూర  మృగాల వల్ల  ప్రజలకు   కష్టనష్టాల గురించి విన్న భోజరాజు  తన మంత్రి నీతిమంతుని పిలిచి  క్రూర మృగాల వేటకు వెళ్ళటానికి  అంతా సిద్దం చేయమని చెప్పాడు. వేటకు కావలసిన అన్ని పరికరరాలతో తగిన సైన్యంతో  బయల్దేరారు  భోజరాజు  నీతిమంతుడు. అడవిలో డప్పులూ, తప్పెట్ట్లూ వాయించారు సేవకులు పులులు,  సింహాలు, ఎలుగుభంట్లూ, పందులు లాంటి ఎన్నో జంతువులను సంహరించాడు రాజు.  చుట్టుపక్కల ప్రజలంతా సంతోషంతో కానుకలు ఇచ్చి సాగనంపారు. రాజు  తన పరివారంతో  రాజధానికి  తిరిగి వెళ్ళసాగాడు.  వాళ్ళు ఓ చోట  జొన్న చేను పక్కగా వెళుతున్నారు.  అక్కడ మంచెపై కూర్చుని  ఉన్న ఆచేను యజమాని ఐన  ఓ బ్రాహ్మణుడు  వీళ్ళను చూసి  “రాజా మీరు మీ సైన్యం ఎండనపడి వెళుతున్నారు  అలసిపోయి  ఉన్నారు,  జొన్నచేను కంకులు తినడానికి సిద్దంగా ఉన్నాయి   సందేహం లేకుండా  అందరూ ఆ కంకులు తిని మీ ఆకలి తీర్చుకుని   విశ్రాంతి తీసుకుని వెళ్ళండి.   మీకు ఆతిథ్యం ఇవ్వడం నా కర్తవ్యం”   అంటూ ప్రార్థించాడు.

రాజు ఆ బ్రాహ్మడి  ఔదర్యానికి ఎంతో సంతోషించి    ఆ కంకులు తిని ఆకలి తీర్చుకోమని   తన పరివారంతో చెప్పాడు.
రైతు కాసేపటి తరువాత ఏదో పనిపై  మంచెపైనుండి  దిగి వచ్చాడు. తన జొన్న చేనునంతా తినివేస్తున్న వారిని చూడగానే అతడికి దుఖం ముంచుకు వచ్చింది.  సరాసరి రాజు వద్దకు వెళ్ళి “రాజ ఇదేమిటి, ధర్మవంతుడివి అని నీకు పేరు,  నీ పరివారం అన్యాయంగా నా చేనునంతా నాశనం చేస్తున్నారు.  ఇది నీకెలా న్యాయంగా తోచింది?  నేను పేదవాడిని   కష్టపడి  జొన్న చేను పెంచుకున్నాను.  ఇదే నా ఆధారం.   కంచే చేను మేసినట్టుగా  ఇతరులకు  చెప్పవలసిన వారు మీరే ఇలా చేస్తే నాకు దిక్కేది?  ఇప్పుడు నేనూ నాకుటుంబం జీవించేదెలా?”   అంటూ విలపించసాగాడు.


అతడి మాటలు వింటూ  ‘అందరినీ పిలిచి తినమన్నది ఇతడే, ఇంతలోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడేమిటి!  తన పరివారంపై తప్పు నెడుతూ ఇతనిలా ప్రవర్తించటమేమిటీ’  అనుకుంటూ తన వాళ్ళనందరినీ   కంకులు తినటం ఆపి బయటకు వచ్చేయమని చెప్పాడు. ఆ  రైతు  దుఖం చూడలేక  అతడి పంటకి తగిన ఖరీదు చెల్లించాలని నిర్ణయించుకున్నాడు.
ఆ రైతు పిట్టలను తోలటానికై తిరిగి మంచె మీదకు చేరాడు.  వెళ్ళిపోతున్న  రాజు గారి పరివారాన్ని చూసి  “ఎందుకు వెళ్ళిపోతున్నారు?  విరగకాసిన కంకులను తిని మీ ఆకలి తీర్చుకోమని ముందే చెప్పానుకదా,  కడుపార తిని కావలసినన్ని పట్టుకుపొండి. రాజా  మీ పరివారానికి మీరు చెప్పండి. పరులకు ఉపకారం చేయని నా జన్మ వృదా”   అన్నాడు.


ఈ బ్రాహ్మణ రైతు వెర్రివాడేమోనన్న సందేహం రాజుకి కలిగింది.  చూపులకు ఆ రైతు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు.  సరే కానిమ్మని  తన పరివారాన్ని తిరిగి జొన్న చేనులోకి పంపించాడు.  రైతు సంతోషించాడు. తిరిగి కాసేపటితరువాత మంచె దిగివచ్చిన  రైతు  “ధర్మవంతుడైన  రాజు లక్షణం ఇదేనా? నా చేనును మీ పరివారం పూర్తిగా కొల్లగొడుతూ ఉంటే వారించవలసిన మీరే ఇలా వారిని ప్రోత్సాహించటమేమిటి? నా  పంట నాశనం చేస్తున్నారు   నేనేం నేరం చేసానని నాకీ శిక్ష.”   అంటూ భోరాజు ను నిలదీసి అడిగాడు.


భోజ రాజు ఆశ్చర్యంతో  తన మంత్రియైన  నీతిమంతుని తో   “ఈ రైతు ప్రవర్తన  విపరీతముగా ఉన్నది. మంచెపై ఉన్నప్పుడు ఒకమాదిరిగా,  మంచె దిగిన తరువాత మరొక విధముగా  ప్రవర్తిస్తున్నాడు. మంచెపై ఉన్నప్పుడు ఉదారముగా ప్రవర్తించినవాడు   మంచె దిగగానే అంతా మచి ఎంతో అమర్యాదగా మాట్లాడుతున్నాడు. ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో  అతనిలో ఈ మార్పు ఎందుకు కలుగుతున్నది?”   అంటూ అడిగాడు. దానికి సమాధానంగా మంత్రి రాజా   “ఇతడి ఈ ప్రవర్తనకి కారణం  తప్పకుండా ఆ మంచెయే ననిపిస్తున్నది.  మంచె దిగగానే అతడిలోని ఉదారత్వము పోయి సామాన్య  రైతులా ప్రవర్తిస్తున్నాడు. ఆ మంచె ఉన్న స్థలాన్ని పరీక్షించి గానీ ఆ  మహిమ ఏమిటో చెప్పడం సాధ్యపడదు.”   అన్నాడు.


రాజు వెంటనే బ్రాహ్మణుతో    “ఈ భూమిని నాకు ఇవ్వు ప్రతిఫలంగా నీకు ఇలాంటి పొలాలు ఎన్నైన్నా కొనుక్కొనేంత ధనం ఇస్తాను”  అని చెప్పాడు. ఆ బ్రాహ్మణ రైతుకి  రాజు మాటలు ఎంతో సంతోషాన్ని కలిగించాయి, “ రాజా మీ ఇష్టం నా చేను మీరు తీసుకుంటానంటే నాకు సంతోషమే, మీ దయ వలన ఆ ధనంతో  నేనూ నా కుటుంబం సుఖంగా ఉంటాము”    అని చెప్పాడు.


రాజు ధారాపురానికి చేరుకుని రైతుకి చాలా ధనం ఇచ్చి  సేవకులను పంపి ఆ మంచెఉన్న చోటును తవ్వించాడు. అక్కడ వారికి ఒక అద్భుత మైన రత్నాలు పొదగబడిన  బంగారు సింహాసమ్నం ఒకటి  కనిపించింది. దానికి ముఫైరెండు బంగారు మెట్లు ఉన్నాయి.  ఆ మెట్లకు  రత్నాలతో కూడిన బొమ్మలు ఉన్నాయి. ఆ సింహాసన్నాని చూడగానే భోజరాజుకి ఆశ్చర్యానందాలు కలిగాయి. 
ఆ సింహాసనం పుర్తిగా బంగారంతో చేయబడి ధగధగా మెరిసిపోతోంది. సింహాసనం మొత్తం వజ్రాలు, పగడాలు మొదలైన అమూల్య రత్నాలతో పొదగబడి ఉంది. ఆ సింహాసనానికి 32 మెట్లు ఉన్నాయి. ఒక్కొక్క మెట్టు మీద ఒక సాలభంజిక (ప్రతిమ) ఉన్నది. ఆ సింహాసనాన్ని వర్ణించటానికి మాటలు చాలవు. ఇంత అద్భ్త సింహాసనాన్ని అధిష్టించిన రాజు  ఈ భూమినంతటినీ  ఏకచ్చత్రాధిపత్యంగా  ఏలిన వాడై ఉండాలి. అంతటి గొప్ప మహారాజు సింహాసనం భూమిలో ఉన్నచోట మంచె పై కూర్చున్న ఆ రైతుకి తెలియకుండానే ఎంతో ఉదారత్వముతో ప్రవర్తించేవాడు  అని  గ్రహించారు.

ఆ సింహాసనాన్ని తమతో జాగ్రత్తగా  నగరానికి  తీసుకుపోయి  తాను దాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు భోజరాజు. పండితులచే ఒక  శుభముహుర్తం  నిర్ణయించి  ఆ సింహాసనాన్ని అధిరోహించటానికై శుభలగ్నాన మంగళవాద్యాలతో  సింహాసనానికి పూజలు జరిపించి   మంచి ముహుర్తం లో  ఆ సింహాసనం మెట్టుపై కాలు పెట్టబోయాడు.  వెంటనే అక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరగింది.  మొదటిమెట్టు మీద కాలు పెట్టేలోగానే ఆ సింహాసనానికి గల 32 ప్రతిమలు చప్పట్లు కొట్టి పకపకా నవ్వాయి. ఆ మెట్టుపైనున్న  రత్నఖచితమైన బొమ్మ రాజుతో మాట్లాడసాగింది.  రాజు అత్యంత ఆశ్చర్యంతో బొమ్మ మాటలు వినసాగాడు. 

“రాజా సామాన్యులకు ఈ సింహాసనాన్ని అదిరోహించటం  అంత సులువైన విషయంకాదు.  శౌర్య ప్రతాపాలు, సకల గుణవంతుడు ఐన విక్రమార్క మహారాజు సింహాసనం ఇది. ఇది మాన నిర్మితంకాదు,  స్వయంగా దేవేంద్రుడే  విక్రమార్కుడికి ఇచ్చిన సింహాసనం ఇది. దీనిపై కూర్చోవాలనుకునే వారు  అతడితో సమానులై ఉండాలి. దీనిపై ఉన్న ముఫై రెండు బొమ్మలూ మాట్లాడతాయి దానికి కారణం  ముందు ముందు  నీకే తెలుస్తుంది.

సకల ప్రావీణ్యుడూ, దిక్‍దిగాంతాలవరకూ ఖ్యాతి గాంచినవాడు.సుగుణ వంతుడూ ఐన విక్రమార్కుడి లక్షణాలు నీకున్నవని అనుకుంటే ఈ సింహాసన్నాని అధిరోహించు, లేదా నీకు ప్రమాదం తప్పదని గుర్తుంచుకో.”   అంది.
భోజరాజు ఆ బొమ్మమాటలకు ఆశ్చర్యపోతూ ఇలా అన్నాడు  “విక్రమార్కుడు ఎవరో అతడి చరిత్రఏమిటో నాకు తెలియదు. నేను అతడి వలె సుగుణవంతుడినో లేదో నువ్వే నిర్ణయించాలి. నాకు అతడి చరిత్ర చెప్పు”   అన్నాడు.
దానికి ఆ బొమ్మ బదులిస్తూ  “అతడి గుణగణాలు వర్ణించడం అంతసులభంకాదు, నా శక్తి మెరకు చెపుతాను”   అంటూ ఇలా చెప్పసాగింది…
           

         అందుకు మొదటి మెట్టులోని ప్రతిమ " మహారాజా! నా పేరు వినోదరంజిత ప్రతిమ. నేను ఈ మొదటిమెట్టుకు అధికారిని. తమరు ఈ సింహాసనాన్ని అధిరోహించటానికి అర్హుడని కానా అని ప్రశ్నించారు. అందుకు నేను చెప్పబోయేది తమరు వినవలెను. పూర్వము ఈ సింహాసనాన్ని విక్రమాదిత్యుడు అనే సార్వభౌముడి అలంకరించి తన మంత్రి అయిన భట్టి తో సుమారు 2000 సంవత్సరాలు రాజ్యం చేసాడు. అతని గుణగణాలు వర్ణించనలవి కాదు. అతను పరమ సాహసోపేతుడు. అసమాన ధైర్య పరాక్రమాలు కలవాడు. ఆ మహారాజు కాలము తరువాత దీనిని అధిరోహించే అర్హులు ఎవరు లేకపోటం చేతనే ఇది భూమిలోకి క్రుంగింది. విక్రమాదిత్యుని గుణాలలో వెయ్యోవంతు గుణాలు మీకు ఉన్నా మీరు ఈ సింహాసనాన్ని అధిరోహించటానికి అర్హులు. అందుచేత దీనిని, దీనిని అధిరోహించిన విక్రమాదిత్యుని గురించి వివరించటం ఎంతో అవసరం" అన్నది.

       అందుకు భోజరాజు "ఓ వినోదరంజితా, నాకు ఆ మహానుభావుని గురించి తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది. దయచేసి నాకు తెలియచేయండి" అని వేడుకున్నాడు.

         అలా ఒక్కొక్క ప్రతిమా చెప్పిన 32 కథలే ఈనాడు "భట్టి విక్రమార్క" కథలు గా "భేతాళ" కథలుగా ప్రాచుర్యం సంపాదించుకున్నాయి.

         ఇంకో విషయం ఏమిటి అంటే 32 సాలభంజికలకు 32 పేర్లు ఉన్నాయి. అవి ఏమిటి అంటే :

1. వినోదరంజిత 2. మదనాభిషేక 3. కోమలవల్లి 4. మంగళ కళ్యాణి
5. మంత్ర మనోరమ 6. శృంగార మోహనవల్లి 7. జయ  8. విజయ 
9. మలయవతి  10. ప్రభావతి  11. విద్వత్శిరోమణి 12. శాంతగుణవల్లి
13. సూర్యప్రకాశవల్లి 14. పూర్ణచంద్రవల్లి 15. అమృతసంజీవివల్లి 16. కృపాపరిపూర్ణవల్లి
17. కరుణాకరవల్లి 18. పరిమళమోహనవల్లి 19. సద్గుణవల్లి 20. సుందరవినోదవల్లి
21. కనకరంజితవల్లి 22. పంకజవల్లి 23. అపరాజితవల్లి 24. మనోరంజితవల్లి
25. స్వర్ణకాంతవల్లి 26. సకలకళావల్లి 27. మాణిక్యవల్లి 28. మనునీతివల్లి
29. సంప్రదాయవల్లి 30. రుక్మిణీవల్లి 31. నీతివాక్యవల్లి 32. ఙ్ఞానప్రకాశవల్లి


సాలభంజిక కధలు - 1

--------------------

"32 సాలభంజికలు 32 కథలు" చెప్పి భోజరాజుని సింహాసనాన్ని అధిష్టించకుండా అడ్డుకున్నాయని చెప్పుకన్నాం కదా? ఐతే వాటిలో ఒక కథ ఇప్పుడు చెప్పుకుందాం.

విక్రమార్కుడు ఒకనాడు నిండు కొలువులో సభ తీరి ఉన్న సమయంలో అక్కడికి ఒక కవీంద్రుడు వచ్చాడు. అతడు మహా పండితుడు, సకల భాషా కోవిదుడు, సంస్కృత ప్రాకృత చతుర్విధ భాషా విశారదుడు. అందువల్ల మన విక్రమార్కుడిని నాలుగు భాషల్లో దీవించి ఆసనం మీద కూర్చుని, తనని తాను పరిచయం చేసుకున్నాడు. అదెలా అంటే?

ఓ రాజేంద్రా! నా పేరులో ఆరు అక్షరాలుంటాయి. అందులో మొదటి అక్షరం తీసివేస్తే నేను "అశ్వవేదినౌతాను" 

రెండక్షరాలు వదిలిపెడితే "నాట్యకర్తనౌతాను" 

మూడక్షరాలు తీసేస్తే "గతవిదుడనౌతాను" 

నాలుగక్షరాలు విడిచి పెడితె "నేర్పరినౌతాను" 

ఐదు అక్షరాలు వదిలిపెడితే "బుధుడనౌతాను" 

అన్ని అక్షరాలు కలిపి చదివితే "బుద్ధిబలమున్న వాడినౌతాను" 

ఇది కేవలం నేతిబీరకాయ చందాన చెప్పటం కాదు, నువ్వు అన్ని విద్యలలోను ఆరితేరినవాడివి గనుక నాపేరు తెలుసుకోగలవు అని విక్రమార్కుడిని ప్రశ్నించి అడిగాడు. 

అందుకు సకల విద్యా పారంగతుడైన విక్రమార్కుడు నవ్వి "ఓ కవీంద్రా !మీ పేరు "చతురంగతజ్ఞుడు" అని చెప్పాడు. 

అందుకు ఆ కవీశ్వరుడు విక్రమార్కుని మేధా శక్తికి అబ్బురపడి "ఓ రాజా! తారతమ్యాలు తెలియకుండా నీ ముందు ఎవరైన పండితులమని భ్రమించటం హనుమంతుని ముందు కుప్పి గంతులు వేసినట్టే అవుతుంది. అందుచేత నన్ను మన్నించు. నీ కీర్తి ప్రతిస్టలు భూనభోంతరాలల్లో ప్రతిధ్వనిస్తున్నాయి" అని వేనోళ్ళ పొగడగా అందుకు విక్రమార్కుడు సేవకులను పిలిచి ఆ పండితుని పలుకులకు, కవిత్వానికి, మాటలకు, నవ్వులకు వేలు లక్షలు కోట్ల కొలది దానధర్మాలిచ్చి పంపించాడు. ఈ విధంగా తన ఔదార్యాన్ని నిరూపించుకుని రాజ్యమేలాడు. 

ఐతే మనం అతని పేరులోని ఒక్కొక్క అక్షరమే తీసేసి చూద్దాము. 

మొదట "చ" తీసేస్తే "తురంగతజ్ఞ" (అశ్వవేది). 

ఇప్పుడు "తు" తీసేస్తే "రంగతజ్ఞ"(నాట్య కర్త). 

ఇప్పుడు "రం" తీసివేస్తే "గతజ్ఞ" (గతవిదుడు). 

మళ్ళీ "గ" తీసేస్తే "తజ్ఞ" (నేర్పరి). 

ఇక "జ్ఞ" అంటే బుధుడు. 

అన్ని కలిపి చదివితే "చతురంగతజ్ఞ" అన్న మాట.

'ఓ భోజరాజా! నీవు విక్రమార్కుడి మేధాశక్తికి సరి సమానమయినవాడివని అనుకుంటే, ఈ సింహాసనాన్ని అధిరోహించు! "అంది. భోజ రాజు మౌనంగా వెనుదిరిగాడు.






సాలభంజిక కధలు - 2



భోజరాజు మళ్ళీ ఒక మంచి రోజున ఆ సింహాసనాన్ని అధిష్టించాలని ప్రయత్నం చేయగా ఒక సాలభంజిక ఇలా అంది. "ఓ! భోజరాజా! మా విక్రమార్కుడికి ఉన్నంత ధైర్యసాహసాలు నీకు లేవు. కావున ఈ గద్దె నెక్కబోవటం నీకు సాధ్యం కాదు ఎందుకంటే, ఉజ్జయనిలో మా విక్రమార్కుని రాజ్యం విష్ణు మూర్తి రాజ్యం కంటే గొప్పది. కావున విను, మా విక్రమార్కుని రాజ్యంలో క్రూరుడు, కుత్సిత బుద్ధి కలవాడు, నీరసాత్ముడు, దూషకుడు, దుర్మార్గుడు, అనాచారుడు, అబద్ధాలు చెప్పేవరు, అవినీతి పరులు, బద్ధ కస్తులు, దుర్భలులు, మదాంధులు, మదన వికారం చెందిన వారు, స్తిరత్వం లేని వారు, ఇలాంటివారు మచ్చుకైన ఉండరు. ఐతే అటువంటి రాజ్యంలో ఒకనాడు ఒక విదీశీయుడు ప్రవేశించాడు" అని ఆ సాలభంజిక చెప్పసాగింది.

         రాజ దర్శనం కాగానే, రాజుకు నమస్కరించి తాను దేశ దేశాలు తిరిగి వచ్చానని చెప్పాడా విదేశీయుడు.

         అందుకు రాజు "దేశం నలుమూలలా చుట్టి వచ్చావు గనుక, నీవు చూసిన వింతలేమైనా చెప్పు" అని అడిగాడు.

         అందులకా సిద్ధుడు "నేను ఇలా తిరుగుతూ తిరుగుతూ ఒకసారి తూర్పు కొండల ప్రాంతంలో ఒక భాగ్య వంతమైన నగరం చేరుకున్నాను. అక్కడ సూర్యప్రభ అనే నది ప్రవహిస్తూ ఉంటుంది. అది చాలా లోతైనది. ఒక మడుగులా ఉంటుంది. ఐతే ఆ నది ఒడ్డున సూర్యమండలాన్ని పోలి ప్రకాశించే బంగారు గుడి ఒకటి ఉంది. ఆ ప్రాంతంలోనే పాపనాశనం అనే పుణ్య తీర్ధం కూడా ఉంది. ఇంతకీ ఇవన్నీ అంత విశేషం కాదు కానీ రాజా, నేనిప్పుడు చెప్పేది మాత్రం శ్రద్ధగా విను. అదేమిటంటే , సూర్యోదయం వేళ ఆ తీర్ధం మధ్యలో చక్కని పీఠం ఉన్న స్థంభం ఒకటి పుడుతుంది. సూర్యుడు నడి నెత్తి మీదకి వచ్చేసరికి ఆ పీఠం కూడా ఎత్తుగా పెరిగి పెరిగి సూర్యబింబాన్ని తాకుతుంది. తిరిగి ప్రొద్దు కృంకే సమయానికి మెల్ల మెల్లగా దిగజారి మాయమైపోతుంది. ఇది చిత్ర విచిత్ర మైన విశేషం ఇంతకు ముందు నేనెన్నడూ కనీ వినీ ఎరుగనిది. బ్రహ్మ సృష్టి రహస్యం మానవుల మైన మనకెలా తెలుస్తుంది?" అని చెప్పాడు.

 అంతా విని ఆశ్చర్యపడిన రాజు ఆ సిద్ధుని ఘనంగా సత్కరించి పంపి వేసాడు. పిమ్మట ఆ వింత స్థం భాన్ని ఎలాగైనా చూడాలన్న పట్టుదలతో, రాత్రికి రాత్రి కత్తి చేత పట్టి ఒంటరిగా అరణ్య మార్గంలో బయలు దేరాడు. చివరికి సిద్ధుడు చెప్పిన బంగారు నగరం చేరుకుని సూర్యోదయాన ఆ స్థంభం మొలిచే అద్భుతాన్ని చూసాడు. ఏముంది? అలా అలా చూస్తుండగానే పై పైకి సూర్యబింబంతో పోటీ పడుతూ ఎదిగి పోతున్న స్థంభాన్ని చూసి ఆశ్చర్య పోయాడు. ఆ రోజుకి మాత్రం అక్కడే ప్రవహిస్తున్న సూర్యప్రభా నదిలో స్నానం చేసి రోజంతా ఉపవాసం చేసి రాత్రంతా సూర్య భగవానుని దైవ ధ్యానంలో గడిపాడు.

         మర్నాడు సూర్యోదయానికి ముందుగానే లేచి పాపనాశ తీర్ధంలో స్నానం చేసి సంధ్యా వందనం చేసుకుని సూర్యో పాసన మొదలు పెట్టాడు. అంతలో తూర్పు కొండ మీద సూర్యబింబం పొడ చూపింది. అదే సమయాన, తీర్ధం మధ్యలో స్థంభం దివ్య పీఠంతో బంగారు తీగ మీద మొలచిన కలువ పువ్వులా పుట్టి, పైపైకి పెరగసాగింది. అ వింత చూసిన విక్రమార్కుడు ఈ గంభీరమైన తీర్ధాన్ని ఈదుకుంటూ వెళ్ళాలంటే సమయం సరిపోదు" అనుకుని, ఒక్క సారిగా పైకి చేరాలని ఒడ్డునుంచే ఆ స్థంభం పై నున్న పీఠం మీదకి దూకాడు. అందువలన ఆ పీఠం ఎంత మాత్రం చలించలేదు సరికదా అలా పెరుగుతూనే ఉంది. ఎండ ఎక్కువైన కొలదీ ఆ స్థంభం ఆకాశంలోకి దూసుకు పోతోంది.

         ఐతే ఆ వేడిమికి ఏ మాత్రమూ చలించని విక్రమార్కుని ధైర్యానికి సూర్యుడు వెరగు పడి "ఓ! రాజా! లక్ష యోజనాల దూరంలో ఉన్న సామాన్య మానవులు నా ఎండ వేడిమికి తట్టుకోలేక గిలగిల మాడి పోతారు, నన్ను సమీపించిన వారెవరైనా బూడిద కాక తప్పదు. అటువంటిది నీవు ఎంత మాత్రము చలించలేదు సరికదా, భగవంతుని దయవలన బ్రతికి పోయావు. నీ ధైర్య సాహసాలకి అబ్బుర పడుతున్నాను, అందుకు గాను నిన్ను మెచ్చి ఈ కుండలాలు నీకు బహుమతి గా ఇస్తున్నాను. ఇవి నాకు అను నిత్యము బంగారాన్ని ప్రసాదిస్తాయి. నాలుగు మాడలెత్తు = ఒక కర్షం, నాలుగు కర్షములు = ఒక పలము, నూరు పలములు = ఒక తులము, అలాంటివి ఇరవై తులాలు ఒక మితి భారము" అని చెప్పి ఆ కుండలాలు విక్రమార్కునికి ఇచ్చాడు.

         విక్రమార్కుడు వాటిని భక్తితో స్వీకరించి సూర్య భగవానునికి ప్రణామం చేసాడు. ఇంతలో అపరాహ్నం దాటింది. స్థంభం మెల్లగా కృంగ సాగింది. సాయంత్రానికి మడుగు ఒడ్డుకు చేరింది. అప్పుడు మన విక్రమార్కుడు స్థంభంపై నుంచి దిగి ఒడ్డుకు చేరి నిలబడగానే ఆ స్థంభం మాయమైపోయింది. ఇక విక్రమార్కుడు ఆ రాత్రి అక్కడే గుడి లో గడిపి ఉదయాన్నే స్నాన పానాదులు శివ పూజ ముగించుకుని తిరిగి తన రాజ్యం వైపు బయలుదేరాడు.
 దారిలో అతనికొక ముదుసలి కనిపించి రాజును దీవించి "ఓ వీరాగ్రణీ! నేనెంతో ఆకలితో ఉన్నాను. ఆహారం కోసం నీ వద్దకు వచ్చాను. నన్ను కాపాడి పుణ్యం కట్టుకో" అని వేడు కున్నాడు.

         అప్పుడు విక్రమార్కుడు తన వద్ద ఏమీ ఆహారం లేనందువలన మిక్కిలి బాధపడి ఆ ముదుసలికి సాయపడాలన్న ఉద్దేశ్యంతో తన వద్దనున్న సూర్య భగవానుడిచ్చిన కుండలాలను ఇచ్చి వేసాడు.

         ఈ విధము గా మా విక్రమార్కుడు మహోన్నత మైన దాన ధర్మాలు చేసి తీర్ధ యాత్రలు చేసి అనేక రకములైన చోద్యములు చూసి జగన్నాధుడైన సూర్య భగవానుని దర్శన భాగ్యం ఫోందిన పుణ్యాత్ముడు.బీద సాదలకు ఆప్త బంధువు" అని సాల భంజిక చెప్పి "ఓ! భోజరాజా! నీ కంతటి గొప్పతనం దయా హృదయం లేవు కావున, సింహాసనానికి తగవు" అని వారించింది.

         ఇంకేముంది మన భోజరాజు మళ్ళీ వెనుదిరిగి వెళ్ళిపోయాడు.





సాలభంజిక కధలు -3 


 ఇప్పుడు మరొక సాలభంజిక చెప్పిన కథ చెప్పు కుందామా? 

         మా విక్రమార్కుడు గర్వం లేకుండా వినయ విధేయతలు కలిగిన రాజు. క్షణంలో కరిగి పోయే కలిమిని సైతం తన మంచితనంతో కట్టి పడేయగల సమర్ధుడు.

         ఐతే, అంత ధనం ఉన్నప్పుడు తగినంత దాన గుణం ఉండాలి కదా!? అందుకని అశ్వమేధ యాగం చేయాలని తల పెట్టాడు. అందుకు తగినట్టుగా బంధు మిత్ర సపరివారాన్నందరిని ఆహ్వానించాడు.

         చేసేది పుణ్య కార్యం గనుక "గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుషాదులు, యక్షులు" తమంత తాముగా వచ్చి యాగంలో పాల్గొన్నారు. సరే! వచ్చిన వారందరిని సాదరంగా ఆహ్వానించి అతిథి సత్కారములు చేసాడు. ఐతే, వారిలో సముద్రుడు లేక పోవటంతో చింతించి, ఒక పురోహితున్ని కారణం తెలుసుకుని రమ్మని పంపించాడు.

         ఆ పురోహితుడు వెంటనే బయలుదేరి భయంకరమైన మొసళ్ళు, తిమింగలములు, అనేక సుడిగుండములు ఉండే సముద్రాన్ని చేరాడు. దానికి సమీపంలో నిలబడి సముద్రుడిని పిలిచి పిలిచి అలసి పోయాడు. అప్పుడు తనలో తను "సరసత్వము సన్మానము లేని చోట స్నేహం పనికి రాదను కున్నాడు. దారి దోపిడి వారికి దాన ధర్మాలు చూపించటం లాంటిది." అని ఎంచి మరలి పోవాలనుకుని ఆఖరి సారిగా ఎలుగెత్తి ఇలా పిలిచాడు. "ఓ సముద్రుడా! నేను రాజునాజ్ఞను నిర్వర్తించటం కోసం నిన్ను పిలుస్తున్నాను. యాగానికి రమ్మని ఆహ్వానిస్తున్నాను. కాని, నీవు కనబడ లేదు, గనుక తిరిగి వెళ్ళి పోతున్నాను." అని మరొక సారి గట్టిగా అరిచాడు. అది విన్న సముద్రుడు ఆ రాజ పురోహితుని ముందు ప్రత్యక్షమై అతనికి నాలుగు దివ్యమైన రత్నాలు ఇచ్చి ఇలా చెప్పాడు.

         "నేను యాగానికి రాలేదని మీరు మీ రాజు చింతించవద్దు. అసలైన స్నేహం మనసులో ఉండాలి. నాకు మీ రాజు ఎంతో ప్రీతి పాత్రుడు. మా స్నేహం అజరామరం. అది మీ అందరికి జయమగుగాక! మీ రాజు చేసే ఈ గొప్ప యాగానికి బహుమతి గా ఈ నాలుగు రత్నాలు ఇస్తున్నాను. వీటిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మహత్తు ఉంది." అని ఇలా చెప్పాడు. 


 "ఒకటి సైన్యము.... ఒకటి ధనము... మరొకటి మంచి వస్త్రాభరణములు... ఇంకోటి ప్రీతి కరమైన భోజన పదార్ధములు కోరిన వెంటనే ఇస్తాయి." అని చెప్పి ఆ నాలుగు రత్నాలు ఇచ్చి అంతర్ధాన మయ్యాడు.

         ఆ పురోహితుడు ఎంతగానో సంతోషించి ఆ కానుకలు తీసుకుని వెనుదిరి గాడు. ఉజ్జయని చేరే సరికి యాగము, దానధర్మాలు ముగిసి పోయాయి. అందుకు కొంత విచారించాడు. అదే సమయంలో తాను కూడా ఇక్కడ ఉండి ఉంటే తన బీదరికం పోయేది కదా! అన్నవస్త్రాదులు దొరికేవి కదా! అని తన దురదృష్టాన్ని నిందించుకుని రాజదర్శనం చేసుకుని ఆ నాలుగు రత్నాలు రాజుకి సమర్పించి వాటి యొక్క గొప్ప తనాన్ని వివరించాడు. అప్పుడు రాజు "ఈ అమూల్యమైన నాలుగు రత్నాలలో ఏదో ఒకటి ఏరుకుని నీవు తీసుకో" అని బ్రాహ్మణుడికి చెప్పాడు. అందుకు ఆ బాపడు సంతసించి ఏది మంచిదో తనంత తానుగా ఎన్నుకోలేక, ఇంటికి వెళ్ళి ఇంట్లో వారినడిగి వస్తానని చెప్పి, వెళ్ళి పోయాడు.

         ఇదంతా ఇంట్లో చెప్పే సరికి కొడుకు "నాన్నా! సైన్యం ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చు. జగమంత మన చెప్పు చేతల్లో ఉంటుంది కనుక, మొదటి రత్నాన్ని అడుగు!" అన్నాడు. ఇక తండ్రి "ధనకనక వస్తు వాహనాలిచ్చే రెండో రత్నాన్ని కోరుకోమన్నాడు. ఎందుకంటే ధన మూలం ఇదం జగత్తు అన్నారు కదా!" అన్నాడు. ఇక పోతే భార్య "ప్రతి నిత్యం ప్రీతి కరమైన భోజనం చేయవచ్చు. కనుక, మూడో రత్నం అడుగు" అంది. "ఇవేవి వద్దు మంచి వస్త్రాభరణాలిచ్చే నాలుగో రత్నం కావాలి" అని కోడలు కోరుకుంది.

         అన్నీ విన్న విప్రుడు - ఈ నలుగురి వివాదం ఇంతటితో తీరదనుకుని విసుగు చెంది, రాజదర్శనం చేసుకుని "ఓ రాజా! వీటిలో ఏదో ఒకటి తమరే ఇచ్చి పుణ్యం కట్టుకోండి" అని ప్రార్థించాడు. అందుకు రాజు నవ్వి, అంతా గ్రహించటంతో "మీ తగవు నేను తీరుస్తాను. మీ కుటుంబంలోని నలుగురు సభ్యుల కోర్కెలు తీర్చు!" అని చెప్పి ఆ నాలుగు రత్నాలు ఆ పురోహితునికి ఇచ్చి వేసాడు.

         అంటే, "మా విక్రమార్కుడు అంతటి దానగుణం కలిగిన దయా శీలుడు" అని సాలభంజిక కథ చెప్పేసరికి ఇంకేముంది? మన భోజరాజు సింహాసనం ఎక్కకుండా వెనుదిరిగి వెళ్ళాడు .




సాలభంజిక కధలు -4

ఇప్పుడు మరొక సాలభంజిక చెప్పిన కథ చెప్పుకుందాం  ...

         పూర్వము సూర్యవంశంలో పుట్టిన సుదర్శనుడనే రాజు అయోధ్యాపురం రాజధానిగా చేసుకుని పరి పాలిస్తూ ఉండేవాడు. అతడు నిత్యం అన్నదానాలు క్రమం తప్పకుండా చేస్తూ దేవతల మెప్పు కోసం యజ్ఞ యాగాలు చేస్తూ మిక్కిలి పేరు పొందాడు.

         ఐతే ఒకనాడు సరయూ నదీతీరంలో యజ్ఞం చేస్తూండగా, త్రిలోక సంచారి ఐన మన నారదుడు అక్కడికి వచ్చాడు. అప్పుడు సుదర్శనుడు నారదుని భక్తితో పూజించి అర్ఘ్య పాద్యాదులనర్పించి సవినయంగా "ఓ మహాను భావా! మీ రాకవల్ల కృతార్ధుడనయ్యాను, మారాజ్యము పావనమైంది, తమరింకా ఏఏ ప్రదేశాలు చూచి వచ్చారో సెలవీండి" అని ఎంతో వినయ విధేయతలతో అడిగాడు.

         అందుకు మన నారదుడు అతని సేవలకు మెచ్చి "పరమ ధర్మ శీలుడవైన ఓ రాజా! నీ కీర్తి బ్రహ్మ లోకంలో నలుదిశల పొగడబడు తున్నది. నీ దాన ధర్మాల గురించి నీ ప్రాశస్త్యం గురించి విని నిన్ను చూడాలని వచ్చాను" అని అన్నాడు.

         అందుకు సుదర్శనుడు "స్వామీ నాపై దయతో మీరిలా వచ్చారుగానీ నేనెంతటి వాడను?" అని ఎంతో వినయంగా నమస్కరించాడు. అందుకు ముని "ఓ ధరణీశా! నీ చరిత్ర బ్రహ్మ లోకంలో చర్చించ బడుతోంది. అంత కంటే ఏం కావాలి? నీవంటి వారికి సాధ్యంకానిదేది లేదు. స్వధర్మాన్ని త్యాగం చేయకుండా నిర్మల జీవితాన్ని గడిపే వారికి దుస్సాధ్యమైన దేదీ ఉండడు" అని చెప్పి "ఋషి పత్నులు ఇసుకతో చేసిన కలశాల్లో నీళ్ళు నింపుకోవడం నీకు తెలుసుకదా? కావాలంటే దీనికి నిదర్శనంగా, ఇదుగో నీవు కూడా ఈ ఇసుకతో కుండను చేసి నీళ్ళు నింపి చూడు. నీరు నిలబడుతుంది" అని ఇంత ఇసుక తీసి రాజుకిచ్చాడు.

         సరే అని రాజు ఆ ఇసుకతో కుండను చేసి నీరు నింపాడు. అందులో ఆ నీరు నిలబడేసరికి పరమానంద భరితుడయ్యాడు. అప్పుడు నారదుడు "ఈ విధముగా పుణ్య చరితుడవై కీర్తి ప్రతిష్టలతో చిరకాలం వర్థిల్లు" అని దీవించి తన దారిన తాను వెళ్ళి ఫొయాడు.


 ఆ రోజు మొదలు సుదర్శనుడు మట్టి కుండల్లో కాక ఇసుక కుండల్లో అన్ని పదార్ధాలు వండించి చక్కగా రకరకములైన పదార్ధములతో అన్న దానం చేస్తున్నాడు. ఇలా ఉండగా ఒకనాడు తన వంటశాలలోకి వెళ్ళాడు. అక్కడ అన్ని ఇసుక కుండలలో వండబడే సామాగ్రిని చూసి ఉబ్బి తబ్బై "ఆహా నేనెంతటి ఘనుడను?" అని గర్వముతో పొంగిపోయాడు. అంతె తక్షణం ఆ కుండలన్ని కరిగి పోయి ఇసుక పోగులుగా మారిపోయాయి. కారణం తెలియక రాజు చింతా క్రాంతుడ్య్యాడు. "అయ్యో నావల్ల ఏ పొరపాటు జరిగిందో? లేదా భోక్తలు అనర్హులా? ఏ చెడు జరిగిందో" అని వాపోయాడు. అదే సమయంలో మన నారదుడు ఆకాశ మార్గాన వెడుతూ సంగతి తెలుసుకుని "ఓ రాజా! గర్వత్కార్యం వినశ్యతి అన్న పెద్దల వాక్యం వినలేదా? పర్వత సానువుల్లో రథము, గర్వము వల్ల ధర్మ కార్యము, భూమి మీద నావ, స్త్రీ సాంగత్యము వలన బ్రహ్మ చర్యము సక్రమము గా నడవవు. నీ గొప్పతనానికి నీవే గర్వపడేసరికి నీ మహిమ నీరు గారి పోయింది" అని చెప్పాడు.

         అందుకు రాజు చింతించి తన తప్పు తెలుసుకుని తన అపరాధానికి నివారణ చెప్పమని ప్రార్ధించాడు. అందుకు నారదుడు "రాజా నువ్విలాగే దాన ధర్మాలు చేస్తు ఉండు. గర్వం ఆగ్రహం లాంటి చెడ్డ గుణాలు చెంత చేరకుండా యజ్ఞ యాగాదులు చేస్తు ధర్మ పరిపాలన చేస్తూ ఉండు. కొంత కాలానికి నీకు మునపటి మహిమ లభిస్తుంది" అని చెప్పి వెళ్ళిపోయాడు.

         "కనుక గర్వము, పౌరుషము, మనని మనమే పొగుడుకోటము లాంటివి ఉత్తమ లక్షణము కాదు" అని సాలభంజిక భోజరాజుకి సుదర్శనుని కథ చెప్పి మళ్ళీ సింహాసనాన్ని అధిష్టించకుండా అడ్డుకుంది. ఈ విధంగా భోజరాజు మళ్ళీ వెనుదిరిగి వెళ్ళి పోయాడు.

         అంచేత మనిషికి గర్వము, అహము లాంటి చెడ్డ గుణాలు పనికి రావన్నమాట.

సాలభంజిక కధలు - 5 

విక్రమార్కుడి రత్న సింహాసనం మీద మోజు తీరని భోజరాజు ఒక నాడు, శ్రీకృష్ణుడిని పూఇంచి, తిరిగి సింహాసనం ఎక్కే ప్రయత్నం చేసాడు. ఇంతలో అక్కడున్న బొమ్మ, " ఓ రాజా, మేము యెంత చెప్పినా, నీవు మరలా, మరలా సింహాసనం ఎక్కే ప్రయత్నం చేస్తున్నావంటే, అది కేవలం నీకు విక్రమార్కుడి గుణగణాలను గురించి తెలుసుకోవాలనే ఆసక్తి తప్ప, మరేమీ కాదు. విక్రమార్కుడి సాహస, దాతృత్వ లక్షణాలను గురించి చెప్తాను, విను, " అంటూ ఇలా చెప్పసాగింది. 

విక్రమార్క మహారాజు ఒక మారు దేశాటనం చేస్తూ, గంగా తీరం చేరుకొని, అక్కడ ధర్మపురం అనే నగరంలో, ఒక సత్పురుషుడి ఇంట్లో బస చేసాడు. ఉదయాన్నే లేచి, సూర్యదేవుడికి అర్ఘ్యం సమర్పించి, గంగా నదికి ప్రణమిల్లి, స్నానం ముగించుకుని, పుర వీధుల్లో సంచరించసాగాడు . ఇంతలో అక్కడికి ఒక ముసలిది , భయంతో పెడబొబ్బలు పెడుతూ, ఏడుస్తూ వచ్చి, " అయ్యలారా! నా మొగుడు నదిలో సంధ్య వారుస్తుండగా, ఒక మొసలి పట్టుకుంది. మీలో ఎవరయినా, నా భర్తకి ప్రాణ భిక్ష పెట్టండి," అని మొరపెట్టుకుంది.

అప్పుడు నివురుగప్పిన నిప్పు లాంటి విక్రమార్కుడు ముందుకు వచ్చి, " అమ్మ, నువ్వు బాధపడకు. నీ భర్తను నేను రక్షిస్తాను," అని, ఆమె వెంట వెళ్ళాడు. నదిలో దూకి, ఒక్క కత్తి వేటుతో మొసలిని చంపి, ఆమె భర్తను కాపాడాడు.

అప్పుడా బ్రాహ్మణుడు, " ఆహా! నీవు మహావీరుడవు. గజేంద్రుడిని కాపాడ వచ్చిన విష్ణుమూర్తి లాగా నీవు నన్ను కాపాడావు. నాకు ప్రాణ భిక్ష పెట్టిన నీకు మారుగా నేనొక సహాయం చేస్తాను. గోపాల మంత్రోపాసన ద్వారా, నాకు మరణ సమయంలో రత్నమయమయిన దివ్య విమానం ప్రాప్తిస్తుందని, ఆ గోపాలుడి వరం పొందాను. నా తపః ఫలమయిన ఆ దివ్య విమానం నీకు ఇచ్చి, నీ ఋణం తీర్చుకుంటాను." అన్నాడు.

అందుకు విక్రమార్కుడు, " ఆపదలో ఉన్న మిమ్మల్ని కాపాడాలన్న సంకల్పంతో ఈ సాహసం చేసాను కాని, మీ నుంచీ ప్రతిఫలం ఆశించలేదు. ఇది క్షత్రియ ధర్మం. మీ దానం గ్రహించే అర్హత నాకు లేదు, " అంటూ నిరాకరించాడు.

వెంటనే అతడు విక్రమార్కుడిని గుర్తించి, " ఓ రాజా! ఇంతటి ధైర్య సాహసాలు, నిరాడంబరత కల నీవు ఖచ్చితంగా విక్రమార్కుడివే . బ్రహ్మ క్షత్రియులకు ఇచ్చి పుచ్చుకోవడంలో తప్పులేదు. కనుక నీవు కాదనక, నా దానాన్ని గ్రహించు," అంటూ విమానాన్ని దానం ఇచ్చాడు. అప్పుడు విక్రమార్కుడు దాన గ్రహణం చేసి, విప్రుడికి మొక్కి, తిరిగి దేశాటనకు బయలుదేరాడు....అప్పుడు....


విక్రమార్కుడు అలా దేశాటనం చేస్తూ వింధ్యాటవి చేరుకున్నాడు. అక్కడ అతనికి శూన్యమయిన ఒక గుడి, దగ్గరలో ఒక రావి చెట్టు, ఆ చెట్టుకింద వికృతాకారుడయిన ఒక బ్రహ్మ రాక్షసుడు కనిపించారు. అతడిని సమీపించి, 'నువ్వెవరు ? ఈ నట్టడవిలో, భూతంలా ఎందుకు తిరుగుతున్నావు?' అని అడిగాడు. 

అందుకు ఆ రాక్షసుడు, ' నేనొక గొప్ప పండితుడిని. మాళవ రాజ పురోహితుడిని. ఒక విప్రుని అకారణంగా బాధించినందుకు, శాప గ్రస్తుడనై  ఇలా తిరుగుతున్నాను. నీ వంటి మహావీరుడే నన్ను ఉద్ధరించగలడు,' అన్నాడు.

అంతా విన్న విక్రమార్కుడు, దయతో, ' నీకేమి కావాలో కోరుకో. అవసరమయితే, నా ప్రాణమయినా ఇచ్చి, నిన్ను కాపాడతాను ' అన్నాడు.

'గంగలో నువ్వు కాపాడిన విప్రుడు ఇచ్చిన దివ్య విమానం నాకు ఇస్తే, నాకు ముక్తి కలుగుతుంది' అన్నాడు రాక్షసుడు.

దానికి విక్రమార్కుడు ఆనందంగా ఆమోదించి, తనకు బ్రాహ్మణుడు దానం చేసిన విమానాన్ని, బ్రహ్మరాక్షసుడికి ఇవ్వగా, అతడు బ్రహ్మను మించిన బ్రహ్మ పధాన్ని చేరుకున్నాడు.

' ఓ భోజ రాజా! విన్నావుగా...ఇంతటి సాహసం, దయాగుణం కల ఈ విక్రమార్కుడి సింహాసనం ఎక్కేందుకు నీకు అర్హత ఉందని అనుకుంటున్నావా?' అని ప్రశ్నించింది సాలభంజిక.

చేసేది లేక, నిరాశగా వెనుదిరిగాడు భోజ రాజు. 

సాలభంజిక కధలు - 6 

భోజ రాజు సింహాసనం మీద మమకారాన్ని చంపుకోలేక, మళ్ళి ఒక శుభ దినాన సింహాసనం ఎక్కే ప్రయత్నం చేసాడు.

అక్కడ కాపలా ఉన్న బొమ్మ కోపించి, ' రాజా! నీకు మర్యాద తెలియదా ? విక్రమార్కుడి ధైర్యసాహసాలు ఎక్కడా? నీవెక్కడ?' అని ప్రశ్నించింది.

గతుక్కుమన్న భోజుడు, ఆ గుణగణాల గురించి వివరించమని అర్ధించాడు.ఆ బంగారు బొమ్మ చెప్పడం మొదలుపెట్టింది.

విక్రమార్కుని రాజ్యంలో వేదవేది అయిన శుశ్రుతుడు అనే ధర్మజ్ఞుడు ఒకడు ఉండేవాడు. అతడు రాజాజ్ఞ మేరకు అనేక తీర్ధ యాత్రలు చేసి, వెనుదిరిగి వెళ్తూ , మార్గ మధ్యంలో ఒక అటవీ ప్రాంతంలో ఉన్న నగరానికి చేరుకున్నాడు. చక్కని ప్రాకారాలతో విరాజిల్లే ఆ నగరంలో, ఆశ్చర్యంగా, పురుషులనే వారే లేరు. దానిని పాలించేది కూడా ఒక సుందర కన్య మాత్రమే! ఆ పట్టణంలో ఒక దేవాలయం పక్కన ఒక ఉక్కు నూనె బావి, చక్కగా అలంకరించబడిన బంగారు వివాహ వేదిక అమర్చబడి ఉన్నాయి. అంతేకాక, దగ్గరలో ఉన్న ఫలకం మీద ఇలా రాసి ఉంది...

" ఏ నరుడయితే ఈ మరిగే నూనె బావిలో దూకే ధైర్యం చేస్తాడో, అతనికి ఈ రాజ్యము, అందాల భరిణె అయిన ఈ రాజకుమారి లభిస్తాయి..."

అది చదివిన శుశ్రుతుడు ఆశ్చర్యపోయి, ' ఈ మరుగు నూనె బావిలో పడినవాడు , బ్రతికి బయటకు ఎలా వస్తాడు ? తిరిగి బ్రతికి బయటపడితే కదా, అతడికి ఆ భాగ్యం దక్కేది. అటువంటి మానవుడు ఉంటాడా ?' అని ఆలోచిస్తూ, తన ప్రయాణం కొనసాగించి, ఉజ్జయిని చేరుకున్నాడు. తాను చూచిన ఆ చోద్యం గురించి విక్రమార్కుడికి వివరించాడు. అన్నీ విన్న విక్రమార్కుడు చాలా కుతూహలాసక్తుడై, అతడిని వెంట బెట్టుకుని, ఆ పట్టణానికి చేరుకున్నాడు. 

శుశ్రుతుని వెంటబెట్టుకుని విక్రమార్కుడు కారడవుల వెంట ప్రయాణించి, అతడు చెప్పిన పట్టణానికి చేరుకున్నాడు. అక్కడి కళ్యాణ మంటప వైభవాన్ని చూసి ముగ్ధుడై, ఆ రాకుమార్తె ఇంకా యెంత అందమయినదో, అనుకున్నాడు. పక్కనున్న శాసనాన్ని చూసి మరింత ఉత్సాహభరితుడయ్యాడు. 

ఇక ఆలస్యం చెయ్యకుండా, ప్రక్కనే ఉన్న కొలనులో స్నానం చేసి వచ్చి, లక్ష్మి నారాయణులకు మ్రొక్కి, సలసల కాగుతున్న నూనె బావిలోకి దూకాడు. వెంటనే, సంధ్యారాగ కాంతులను ప్రసరిస్తూ, కందర్ప సంజీవని రాజ పుత్రిక అక్కడ ప్రత్యక్షం అయ్యి, తన మహిమతో, విక్రమార్కుడిని తిరిగి బ్రతికించింది. 

" ఓ సాహస వీరుడా! ఇకపై నేను నీ దాసిని. నన్ను, నా రాజ్యాన్ని గ్రహించి, నన్ను కరుణించు. నువ్వు ఇకపై ఏది చెప్పినా తప్పక పాటిస్తాను." అంది.

ఆ మాటలు విన్న విక్రమార్కుడు ," సుందరీ! నువ్వంటున్నది నిజమయితే, దైవసమానుడయిన ఈ శుశ్రుతుడిని వివాహం చేసుకో, " అన్నాడు.

వెంటనే ఆమె సిగ్గుతో తల వంచుకుని, ఆమె శుశ్రుతుని వరించింది. విక్రమార్కుడు తనకు లభించిన రాజ్యాన్ని, రాకుమారిని శుశ్రుతుడికి అప్పగించి, సంతోషంగా ఉజ్జయినికి తిరిగి వచ్చాడు.

కనుక ఓ భోజ రాజా! యెంత ప్రయత్నించినా, నీవు ఈ సింహాసనం ఎక్కే అర్హత సంపాదించలేవు. తిరిగి వెళ్ళిపో!, అన్న బొమ్మ మాటలకు సిగ్గుతో భోజుడు తిరుగు ముఖం పట్టాడు.

సాలభంజిక కధలు -7 

ధారా నగరాధిపతి మరొక సుముహూర్తాన ఉమామహేశ్వరుల ఆరాధన చేసి, పరివారం వెంట రాగా, సింహాసనం యెక్క వచ్చాడు. అక్కడున్న సాలభంజిక, 'నిలు, నిలువు ' మని వారించి, ' నువ్విలా మాటిమాటికీ ఇక్కడికి రావడమే తప్పు. విక్రమార్కుడికి సరిసమానమయిన ఉపకార బుద్ధి లేక, నీవు ఈ సింహాసనం ఎక్కడం తగదు సుమా!' అని వారించింది.

ఆ మాటలకు సిగ్గు, ఆశ్చర్యము కలిగిన భోజ రాజు, ' మీ మహారాజు ఎంతటి పరోపకార శీలియో చెప్పు, ' అని అడిగాడు.
సాలభంజిక ఇలా చెప్పా సాగింది.

" మా విక్రమార్కుడు పాలించే రోజుల్లో, రాజధానిలో, ' విలోచనుడు ' అనే విప్రుడు ఉండేవాడు.అతడి భార్య విలోచన. వారికి చిరకాలము సంతానం కలుగాకపోవడంతో, విశ్వేశ్వరారాధన చెయ్యసాగారు. కొన్నాళ్ళకు ఈశ్వరుడు స్వప్నంలో సాక్షాత్కరించి, శనిత్రయోదశి పూజలు చేస్తే, సంతానం కలుగుతుందని చెప్పాడు. శివాజ్ఞానానుసారంగా భక్తితో పూజలు చేసిన వారికి చక్కటి పుత్రుడు కలిగాడు. వారు అతనికి 'దేవదత్తుడు' అని నామకరణం చేసారు. ఆ కుమారుడు బుద్ధిమంతుడై, చక్కటి విద్యావంతుడయ్యాడు . యుక్తవయస్సు రాగానే , పెళ్లి చేసుకుని, గృహస్త ధర్మాలను  పాటించ సాగాడు. ప్రతి నిత్యం దగ్గరలో ఉన్న అడవికి వెళ్లి, పూజకు కావలసిన పత్రం, పుష్పం, ఫలం, తోయం తెచ్చుకుని, పంచయజ్ఞాలు చేస్తూ కాలం గడపసాగాడు.

ఒకనాడు విక్రమార్కుడు వినోదార్ధం అడవికి వేటకు వెళ్లి, ఒక పందిని వెంబడిస్తూ, దారి తప్పాడు. తిరిగి వెళ్ళే ఉపాయం తోచక అక్కడే తిరగసాగాడు. ఇంతలో....

అలా అడవిలో దారి తప్పిన విక్రమార్కుడికి, చెట్టెక్కి, పళ్ళు కోసుకుంటున్న దేవదత్తుడు కనిపించాడు. అమితానందంతో అతడిని పలుకరించి, దారి చూపమని కోరతాడు. కీకారణ్యం లోని మార్గాలన్నీ తెలిసిన దేవదత్తుడు రాజును తిరిగి సైన్యం వద్దకు చేర్చాడు. అందుకు బదులుగా రాజు అతడికి ఒక గ్రామాన్ని దానం చేసాడు.

ఇదిలా ఉండగా, విక్రమార్కుడి చిన్న రాణి, గర్భవతియై, ఒక శుభ ముహూర్తాన పండంటి మగ శిశువుకు జన్మనిస్తుంది. మీనరాశి లో జన్మించిన ఆ బాలుడికి చంద్రుడు అని నామకరణం చేసారు. తేనె వంటి బాలుడి ముద్దు మాటలు, ఆటపాటలు చూసి ఆనందిస్తూ,  ఆ బాలుడిని అల్లారుముద్దుగా పెంచసాగారు రాజదంపతులు. 

బాలుడి విద్యాభ్యాసం నిమిత్తం గురువులను నియమించి, బాలుడికి పరీక్షాధికారిగా దేవదత్తుడిని నియమించాడు విక్రమార్కుడు. ఇలా బాలుడు చక్కగా విద్యాభ్యాసం చేస్తుండగా, ఒక రోజు ఇంటికి వెళుతూ, తనతో పాటు రాకుమారుడిని చెప్పకుండా తీసుకువెళ్ళాడు దేవదత్తుడు. 

చంద్రుడి వంటిపై ఉన్న బంగారు ఆభరణాలను తీసి, వాటిని అమ్మమని ఒక భటుడికి పురమాయించాడు. ఆ భటుడు నగలు అమ్ముతుండగా, వేగుల ద్వారా ఆ సంగతి విక్రమార్కుడికి తెలిసింది. దేవదత్తుడిని పిలిపించి, నిండు సభలో నిలతీసాడు. తాను నగలపై వ్యామోహంతో చంద్రుడిని చంపి , నగలు దొంగిలించినట్లు వప్పుకుంటాడు దేవదత్తుడు. సభికులంతా, దిగ్బ్రమ చెంది, దేవదాత్తుడి తల నరికి వెయ్యాలని తీర్మానించారు. కాని, విక్రమార్కుడు, ఒకప్పుడు, అడవిలో దేవదత్తుడు చేసిన ఉపకారాన్ని గురుతుకు తెచ్చుకుని, తనను తాను నిగ్రహించుకుని, ' నువ్వు ఇదివరకు చేసిన ఉపకారానికి బదులుగా, ఈ ధనాన్ని స్వీకరించు, ' అంటూ, అతడికి మరింత దానం ఇచ్చి పంపేశాడు. ఇది చూసిన పరాలు రాదూషణ చేస్తుండగా, దేవదత్తుడు ఇంటికి వెళ్లి, తన వద్ద ఉన్న చంద్రుడిని వెంటబెట్టుకు వచ్చాడు. 'రాజా! ఎట్టి పరిస్థితుల్లోనూ, రాజు సంయమనం కోల్పోకూడదని, నిదర్శన పూర్వకంగా యువరాజుకు బోధించెందుకే ఇలా చేసాను. దయ ఉంచి నన్ను  క్షమించండి.' అని వేడుకున్నాడు. మహాదానంద భరితుడయిన రాజు, దేవదత్తుడికి, కంచిని మించే పట్టణాన్ని దానం చేసాడు.

కనుక ఓ భోజ రాజా, ఒక్క మారు ఆలోచించు, ఇటువంటి సంయమనం, పరోపకార బుద్ధి, నీలో ఉన్నాయా?' అంటూ ముగించింది బొమ్మ. సిగ్గుతో తలవంచుకుని, వెనుదిరిగాడు భోజుడు.

సాలభంజిక కధలు - 8 


శ్రీమహావిష్ణువును భక్తితో ధ్యానించి, తన వారందరూ వెంట రాగా, మళ్ళి, సింహాసనాన్ని ఎక్కలనే కోరికతో వచ్చాడు భోజ రాజు. అప్పుడు అక్కడ కాపలా ఉన్న సాలభంజిక, మహారాజు పట్టుదలను మెచ్చి, ఇలా అంది.

" రాజా! ఇలా రోజూ వచ్చి వెళ్ళిపోవడం, నీ వంటి వాడికి తగదు. అలాగని నీకు గద్దెనెక్కే అర్హత కూడా లేదు. ఉజ్జయినీ పతికి కల అత్యుపకార, సాహస గుణాల గురించి చెప్తాను, విను..."

దానగుణం రాజులకు పేరు తెస్తుంది. దాన గుణం ఉన్న వాడే చతురుడు, శూరుడు అవుతాడు.  అట్టి ఉదారమయిన  దాతృత్వం కల విక్రమార్కుడు రాజ్యం చేసే సమయంలో, ఒక నాడు రాజు కొలువు తీరి ఉండగా, ఒక భట్టు వచ్చి, ఆ రాజు వైభవాన్ని గొప్పగా కీర్తించాడు. దానితో, సామంత రాజులకు అసూయ కలిగి, వారిలో ఒకడు, ' ఇతనితో సరిపోల్చగల రాజు మరెవ్వరూ లేరా ?' , అని అడిగాడు. దానికా, భట్టు నెమ్మదిగా నవ్వి, ' ఈ మహారాజు దైవ ప్రసాదం వల్ల పుట్టిన సిద్ధపురుషుడు. ఇతని దానాగుణానికి కర్ణుడే సరిపోలడు , ఇక మనమెంత?' అన్నాడు.

అది విన్న సామంత రాజు తనకు కలిగిన సిగ్గు, అహంకారం, మనసులోనే దాచుకుని, ఎలాగయినా విక్రామార్కుడిని మించిన కీర్తిని సంపాదించుకోవాలని సంకల్పించాడు. ఇలా ఉండగా, ఒక సిద్ధుడు ఆ రాజదర్శనం కోసం వచ్చాడు. అప్పుడు సామంతుడు అతడిని ఆదరించి, 'ఎలాగయినా, దానగుణం లో విక్రమార్కుడిని మించే ఉపాయం చెప్పండి...' , అని వేడుకున్నాడు.

అప్పుడా సిద్ధుడు, 'రాజా ! సాహస యజ్ఞం అనేది ఒకటి ఉంది. అది చేస్తే, నీ కోరిక నెరవేరుతుంది. అదెలాగంటే, యోగినీ చక్రం వేసి, తన శరీరాన్ని అర్పించాలి. అప్పుడు, ఆ అగ్ని ప్రభావం వల్ల బ్రతికి, వైభవాన్ని పొందగలవు. ఇదొక్కటే మార్గం ,' అని చెప్పాడు. రాజు అది విని, చాలా సంతోషించి, ఆ రాత్రికే తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
అప్పుడు....

సామంత రాజు సాహస యజ్ఞానికి కావలసిన సామాగ్రి సమకూర్చుకుని, మొదట సర్వ దేవతలనూ ప్రార్ధించాడు . కీలక మంత్రం భక్తితో జపించాడు . యజ్ఞకుండంలో ఆహుతులు అర్పించాడు . తెగించి, తన శరీరాన్ని ఆహుతి చెసాడు . నిత్య దానం వాళ్ళ వచ్చే కీర్తి, శాశ్వతంగా నిలబడుతుంది కదా ! అతడు చేసిన సాహసానికి మెచ్చి, దేవతలు అతడిని తిరిగి బ్రతికించి, దర్శనం ఇచ్చి, ఎటువంటి వరం కావాలన్నా, కొరుకొమన్నారు. 

ఆ రాజు వారికి ప్రణామం చేసి, " ప్రతి నిత్యం ధనధాన్యాలతో నా భాండాగారాలు ఏడూ నిండి ఉండేలా వరం ప్రసాదించండి , ' అని కోరాడు . దానికి వారు , ప్రతి రోజూ, నీవిలా నీ శరీరాన్ని హోమ గుండంలో అర్పిస్తే, నీ కోరిక తీరుతుంది, ' అని చెప్పరు. రాజు అందుకు ఇష్టపడి, తన ఇంట నిండిన ధన ధాన్యాలను క్షణం కూడా వృధా చెయ్యకుండా దానం చెసాడు . ఈ విధంగా భాండాగారం నిండుకోగానే ప్రాణాలు ఇవ్వడం, తిరిగి పునర్జీవితుడయ్యి దానాలు చెయ్యడం, చెయ్యసాగాడు . 

ఈ చోద్యం ఏవిటో చూడాలని, ఉజయినీపతి ఒక నాడు ముని వేషంలో, అక్కడకు వెళ్ళాడు . రాజు చేస్తున్న త్యాగాన్ని కళ్ళారా చోసాదు. మర్నాడు రాజు కంటే ముందుగానే యజ్ఞ స్థలానికి చేరుకొని, దేహాన్ని యజ్ఞకుండానికి ఆహుతి చెయ్యబొయాదు. దేవతలు అతడిని వారించి, విక్రమార్కుడి కోరిక ఏవిటని అదిగారు. అప్పుడు విక్రమార్కుడు తన సామంతుడు, రోజూ ఇలా దేహాన్ని ఆహుతి చెయ్యకుండానే, అతని భాండాగారం నిత్యం సిరిసంపదలతో నిండి ఉండేలా వరం ప్రసాదించమని కోరుకున్నాడు . ఈ విషయం తెలుసుకున్న సామంత రాజు, విక్రమార్కుడి ఔన్నత్యానికి పరవశించి, తన దురభిమానం విడిచి, అతడికి కృతఙ్ఞతలు చెప్పి, తన భవంతికి వెళ్ళిపోయాడు . 

'కనుక ఓ భోజ రాజా, నీవు ఆ సామంత రాజులా, తిరిగి వెళ్ళిపోవడం మంచిది, ' అని ముగించింది బొమ్మ. గృహోన్ముఖుడయ్యాడు భోజ రాజు. 


సాలభంజిక కధలు -9 


యెంత మరచిపోదామన్నా మరపురాని సింహాసన శోభ మనసుని వేధించగా, మళ్లీ భోజుడు ఇంకొక ప్రయత్నం చెయ్యబొయాడు . 

అప్పుడు అక్కడ ఉన్న బొమ్మ , రాజా! నీవేలాగూ ఈ సింహాసనం యెక్కలెవు. చూస్తుంటే, అతని కదామృతం వినగోరి నీవు మరలా మరలా ఇక్కడకు వస్తున్నట్లు ఉంది . నీకొక కదా చెబుతాను, విను, ' అంటూ ఇలా చెప్పసాగింది ...  

విక్రమార్కుడు దేశాటనం చేస్తూ యోగి వేషలో అడవిలో ప్రయాణిస్తుండగా, అతడికి నట్టడవిలో, 'అంబా, ' అన్న అరుపు వినవచ్చింది . క్రూరమృగాలు సంచరించే అడవిలోకి, ఆవు ఎలా వచ్చిందా, అని ఆశ్చర్యపోతూ అతడు ఆ దిక్కుగా వెళ్ళాడు  . అక్కడి రేగడి మడుగులో, నాలుగు కాళ్ళు కూరుకుపోయి పైకిరాలేక అవస్థ పడుతున్న గోమాత కనిపించింది . కరుణార్ద్ర హ్రుదయుడయిన విక్రమార్కుడు ఆవు పరిస్థితి చూసి చలించిపోయాడు. అయినా, దానిని రక్షించడం తనవంటి వీరుడికి యెంత పని, అనుకుంటూ నెమ్మదిగా మడుగులోకి దిగాడు. కాళ్ళు నెలకి అదిమి పట్టి, ఆవు తోకను పట్టుకు లాగబోయాడు. ఆవు కొంచమయినా కదలలేదు. ఎంతగా ప్రయత్నించినా, ఆవును బయటకు లాగడం విక్రమార్కుడికి సాధ్యపడలేదు. చూస్తుండగానే, నలుదిశలా చీకట్లు అలముకున్నాయి. గుడ్లగూబలు గుహలలో నుంచి బయటకు వచ్చాయి. ఆకాశమంతా మబ్బులతో నిండి, గాలివానతో పాటు పిడుగులు పడసాగాయి. నీరు ఏరులయ్యి పారసాగింది. ఇంతటి భయంకర స్థితిలో ఏ మనిషయినా, భయపడి పారిపోతాడు. కాని, విక్రమార్కుడు బెదరక, తన బొంతను ఆవు మీద కప్పి, రాత్రంతా వర్షంలో గడిపాడు. 

తెల్లవారింది. విక్రమార్కుడు మరలా ఆవును బయటకు లాగేందుకు తన ప్రయత్నం కొనసాగించాడు. ఆవు కదలలేదు. ఇంతలో ఎదురుగా, నిప్పులు చెరిగే కళ్ళతో, ఒక పెద్దపులి, గోరుచుట్టు మీది రోకలిపోటు లాగా ఎదురయ్యింది. సమయం చూసి వారి మీద పడాలని చుట్టూ తిరుగుతూ, పెద్దగా గాండ్రించింది.

సమయం చూసి పులి వారి మీదకి దుమికింది, దాని దారికి అడ్డుపడ్డాడు విక్రమార్కుడు. ప్రాణాలకు తెగించి, పులితో పోరాడి, కత్తితో దాని తల నరికేసాడు విక్రమార్కుడు. క్షణకాలంలో  పులి అక్కడి నుంచీ అదృశ్యం అయ్యింది. అంతలో ఆవు కూడా, మామూలుగా మడుగు నుంచీ బయటకు వచ్చి, 'రాజా! నేను కామదేనువును. నీ ధైర్యానికి జోహార్లు. నీకేమి కావాలో కోరుకో! ' అంది. 

విక్రమార్కుడు కామధేనువుకు నమస్కరించి, ' మాతా! నీవు అన్ని లోకాలకూ తల్లి వంటిదానవు. అట్టి నీకు ఈ దుస్థితి ఎలా కలిగింది?' అని ప్రశ్నించాడు. అప్పుడు సురభి, ' రాజా! ఒక నాడు ఇంద్ర సభలో బృహస్పతితో నారదుడు ఎందరో మహారాజులు ఉన్నారు కాని, విక్రమార్కుడంతటి ధీరుడు, కృపాళువు , లేడు, ' అని చెప్పాడు. అందులోని నిజాన్ని తెలుసుకునేందుకు, నిన్ను పరీక్షించమని దేవేంద్రుడు నాకు ఆజ్ఞను ఇచ్చాడు. ఇదంతా దైవమాయే. ఈ పరీక్షలో నీవు విజయం సాధించావు. నీకు ఏమి కావాలో చెప్పు, ' అంది. 

అందుకు విక్రమార్కుడు, 'దేవీ, నీ దర్శనం పొందడం వల్ల నాకు స్వర్గ ప్రాప్తి కలిగింది. నాకు సకల సంపదలూ ఉన్నాయి. వేరేమే కోరికలు లేవు, ' అన్నాడు.

అతని గొప్పతనానికి మెచ్చుకుని, రాజా, ఇంద్రుని ఆజ్ఞ మేరకు నేను నీకు వశం అయ్యాను. నన్ను నీతో తీసుకుపో, అంది సురభి. అలా వారిరువురూ వెళుతుండగా, దీనావస్థలో ఉన్న ఒక వృద్ధుడు ఎదురయ్యాడు. అందుకు కారణం అడుగగా, అతడు 'రాజా, పెద్ద కుటుంబం పోషించలేక, విరక్తితో చావడానికి వేలుతున్నాను, ' అన్నాడు. విక్రమార్కుడి హృదయం కరిగిపోయింది. అతడిని వోదార్చి, తన వెంటనున్న సురభిని అతడికి దానం చేసాడు. 

'ఇంద్రాది దేవతలంతా, వేనోళ్ళ పొగిడే వితరణ గుణం విక్రమార్కుడిది. కనుక అతని సింహాసనాన్ని నీవు కోరుకోవడం తగదు. వెళ్ళిపో, ' అంది బొమ్మ.

విక్రమార్కుడి గొప్పతనానికి మనసులోనే ఆశ్చర్యపోతూ, వెనుదిరిగాడు భోజుడు.

సాలభంజిక కధలు - 10 

ఆ భాద్రాసనం మీద మోజు తీరక మళ్ళి ఒక రౌ మెరుపు తీగల వంటి కాన్తామనులు వెంట రాగా, మండపం చేరుకున్నాడు మహారాజు . 
అప్పుడు అతడిని అడ్డుపెట్టి ఆ బొమ్మ ఇలా అంది.
" ఓ రాజా! ఆశ వదలక నీవు యెంత కాలం ఇలా నీ సమయాన్ని వ్యర్ధం చేసుకుంటావు ? విక్రమార్కుడంతటి ఉదారత, సాహసం లేక ఈ సింహాసనం ఎక్కడం ఎవరి తరం ? ఆ మాహారాజు గొప్పతనం ఏమిటో నువ్వు విని విని తీరాలి." అని ఇంకా ఇలా చెప్పింది . 

విక్రమార్కుడు ఒక మండు  వేసవిలో దేశాటనం చేస్తున్నాడు. అలా ప్రయాణిస్తూ, విదర్భ రాయంలో కుండిన పురాన్ని చేరుకున్నాడు. అక్కడి ఉప వనంలో చక్కని దుర్గాలయం ఉంది. ప్రక్కనే ఉన్న కొలను లో స్నానం చేసి , కలువ పూలు తెచ్చి, దుర్గను పూఇంచి, తరువాత అక్కడే కాసేపు విశ్రమించాడు. ఇంతలో అక్కడికి ఒక పండితుడు వచ్చాడు. అతడు విద్యావంతుడు కనుక, మారువేషంలో ఉన్న రాజును పసిగట్టి, ' నీలో రవి తేజం ఉత్తి పడుతోంది. నీ రూపం చక్రవర్తి లక్షణాలను తలపిస్తోంది. నీవెవరు ? ఎందుకిలా ఒంటరిగా తిరుగుతున్నావు?,' అని అడిగాడు.

అందుకు విక్రమార్కుడు, 'పండితోత్తమా! నీ ఊహ సరి అయినదే, నేను క్షత్రియుడను. అవంతీపుర వాసిని. విక్రమార్కుడనువాడను. వింతలూ విడ్డూరాలు తెలుసుకునేందుకు ఇలా దేశాటనం చేస్తుంటాను,' అన్నాడు. 

అది విన్న పండితుడు ఆశ్చర్యపోయి, ' పిసరంత భాగ్యం కలిగితే, నా వంటి సామాన్యుడే సుఖాలను కోరుకుంటాడు. నీకెందుకయ్యా ఈ కష్టాలు ? నన్ను చూడు, పెద్ద కుటుంబాన్ని పోషించలేక, ఏదయినా రస సిద్ధిని పొందాలని కంచికి పోయాను. నిద్రాహారాలు మాని, పన్నెండేళ్ళు కామాక్షి అమ్మ కటాక్షం కోసం తపస్సు చేసాను. అయినా, దేవి ప్రసన్నం కాలేదు. అందుకే, విసుగెత్తి, భిక్షాటనం చేస్తూ జీవిస్తున్నాను. నీ వంటి మహారాజుకు ఈ కష్టాలు తగవు, నా మాట విని నీవు ఇంటికి తిరిగి పోయి, సుఖంగా రాజ్యం చెయ్యి, 'అన్నాడు.

పండితుడి మాటలు వింటున్న విక్రమార్కుడిని, అతడి తపస్సు విఫలమయ్యింది అన్న విషయం ఎక్కువగా ఆకర్షించింది. వెంటనే అతనితో, ' స్వామి, మీకు మారుగా నేను తపస్సు చేసి, రస సిద్ధిని సాధిస్తాను. నన్ను కంచి తీసుకుని వెళ్ళండి, ' అని అర్ధించాడు.

అలా అతని వెంట కాంచీపురం వెళ్లి, కామాక్షి దర్శనం చేసి, దేవతారాధన మొదలుపెట్టాడు. మూడు రోజులు తదేక దీక్షతో తపస్సు చేసాకా, దేవి కలలో కనిపించి, ' విక్రమార్కా! నీవు యెంత తపస్సు చేసినా, వ్యర్ధమే! నీవు కోరే రస సిద్ధి లభించాలంటే, ముప్పై రెండు శుభ లక్షణాలు ఉన్న చక్రవర్తిని తల కొట్టి బాలి ఇవ్వాలి. ఇది అసాధ్యం కనుక నీ ప్రయత్నం మానుకో!' అంది.

మర్నాడు విక్రమార్కుడు దేవికి మోకరిల్లి, 'తల్లి, నీవు చెప్పిన శుభ లక్షణాలు కల చక్రవర్తిని అయిన నేను, నన్ను నేనుగా నీకు బాలి ఇస్తున్నాను. దయతో, ఆ పండితుడికి రస సిద్ధిని కలిగించు, ' అని ప్రార్ధించి , తల నరుక్కోబోయాడు. వెంటనే, దేవి ప్రత్యక్షమయ్యి, విక్రమార్కుడి వితరణ గుణాన్ని పొగిడి, పండితుని కోరిక తీర్చి మాయం అయ్యింది. 

ఆ పండితుడు విక్రమార్కుడి వింత ప్రవర్తనకు, పరోపకార బుద్ధికి ఆశ్చర్య పోయి, అతడిని దీవించి, వెళ్ళిపోయాడు. విక్రమార్కుడు కూడా ఆనందంగా, తన రాజ్యానికి చేరుకున్నాడు. 

ఓ రాజా! అట్టి ప్రసిద్ధ గుణములు కల విక్రమార్కుడితో పోలడం నీ తరం కాదు, నలుగురిలో నగుబాటు చెందక, తిరిగి పో, ' అంది బొమ్మ. వంచిన తల ఎత్తకుండా, వెనుదిరిగాడు భోజుడు. 

సాలభంజిక కధలు - 11 


ఇలా కొన్నాళ్ళు జరిగాకా, మనసుండ బట్టలేక, మల్లి సింహాసనం ఎక్కే కోరికతో వచ్చాడు భోజుడు. ముప్పై ఒకటవ సోపానం వద్ద ఉన్న బంగారు బొమ్మ అతడిని అడ్డగించింది. 

" రాజా! అష్టభోగాల్లో ఇంద్రుడిని మించినవాడు, ధైర్యసాహసాల్లో సాటి లేని వాడు విక్రమార్కుడు. నీవు మరలా మరలా సింహాసనం యెక్క కోరడం అందని మ్రాని పళ్లకు ఆశించడమే! నీకొక కదా చెపుతాను విను, ' అంటూ ఇలా చెప్పసాగింది.

అవంతీ నాధుడు ఆరునెలలు రాజ్య పాలన, ఆరు నెలలు దేశాటనం చేస్తాడు కదా! ఒకసారి దేశాంతరం వెళ్లి పద్మాలయం అనే పట్టణం చేరుకున్నాడు . అక్కడ తెల్లని గృహ పంక్తుల మధ్య రత్నం లాగా ప్రకాశించే  దేవాలయాన్ని చూసాడు. సాయంత్రం అవగానే, సంధ్య వార్చి, దైవ ప్రార్ధన చేస్తూ గుడిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇంతలో అక్కడికి నలుగురు వ్యక్తులు వచ్చారు. వారిలా మాట్లాడుకోసాగారు .

" మనం భూలోకం అంటా చుట్టి వచ్చాము. కాని, హిమాలయ పర్వత ప్రాంతం లోని సర్పవనం మాత్రం చూడలేక పోయాము. అక్కడ కఠోరమయిన తపస్సు చేసే యోగీంద్రుడయిన త్రికాలనాధుని దర్శనం మాత్రం చేసుకోలేక పోయాము, ఆ దారిలోని ప్రమాదాలకు, భయంకర సర్పాలకూ భయపడ్డాము. ప్రాణాల మీద తీపి యెంత గొప్పదో కదా, దేనికయినా రాసి ఉండాలి..." అనుకున్నారు.


విక్రమార్కుడు సాహసి కదా! ఎలాగయినా ఆ యోగి దర్శనం చేసుకోవాలని తీర్మానించుకుని, తెల్లవారగానే ఉత్తర దిక్కుగా బయలుదేరాడు.

చెట్లూ చేమలూ దాటుకుంటూ , భయంకరమయిన అడవుల గుండా ప్రయాణించి, సర్పవనం చేరుకున్నాడు. ఆ వనంలో రకరకాల నాగులు ఉన్నాయి. నల్ల నాగులు, ఉర్లు పెంజరాలు, కొండిగాడు, అరియకొక్కు, జెర్రి పోతులు , రెండు తలల పాములు వంటివి చాలా ఉన్నాయి. అవన్నీ మీదికి యెగిరి పడుతున్నా, లెక్క చేయక విక్రమార్కుడు ముందుకు సాగిపోయాడు. 
అలా వెళ్ళగా, వెళ్ళగా, కొన్నాళ్ళకి ఎదురుగా వంటినిండా భస్మం పూసుకుని, పులితోలు కప్పుకుని, చేతిలో అక్షమాల, మరో చేతిలో యోగ దండం పట్టుకుని, స్వస్తికాసనంలో నాసికాగ్రం మీద దృష్టి నిలిపి యోగ సాధన చేస్తున్న త్రికాలనాదుది దర్శనం లభించింది. విక్రమార్కుడు మొక్కిన వెంటనే ఆ సిద్ధుడు కళ్ళు తెరచి, దయాదృష్టితో రాజును చూసాడు. వెంటనే అతడిని చుట్టుకున్న పాములన్నీ వదిలిపోయాయి. 

విక్రమార్కుడి సాహసానికి, వినయ శీలతను చూసి ప్రసన్నుడయిన యోగి, విక్రమార్కుడికి ఒక బలపాన్ని, నాగ బెత్తాన్ని, బొంతను ఇచ్చి, వాటి గురించి ఇలా వివరించాడు.

'రాజా! ఈ బలపంతో కావలసినవి రాసి, కుడి చేత్తో నాగ బెత్తం పట్టుకుని, వాటిని ముట్టుకుంటే అవి నీ వద్దకు వస్తాయి. వద్దనుకున్నప్పుడు ఎడమ చేత్తో తుడిచేస్తే, అవి మాయమవుతాయి. ఇక ఈ బొంతని ఎప్పుడు దులిపినా కావలసినంత డబ్బు వస్తుంది, ఇవి తీసుకు వెళ్ళు, ' అన్నాడు.

విక్రమార్కుడికి తిరుగు ప్రయాణంలో దీన స్థితిలో చితి మంటలు పేర్చుకుని ,చావడానికి సిద్ధం అవుతున్న ఒక రాకుమారుడు కనిపించాడు. అతడు ' మా తండ్రి చనిపోతే, దాయాదులు మా రాజ్యం కాజేసి, నన్ను ఇలా తరిమేశారు. అవమాన భారంతో ఇలా బంటును వెంటబెట్టుకు వచ్చి, ఈ మంటల్లో దూకి చావాలని నిర్ణయించుకున్నాను, ' అన్నాడు.

విక్రమార్కుడు అతడిని ఎలాగయినా రక్షించాలని అనుకుని, 'వీర పుత్రా! క్షత్రియుడు ఎన్ని కష్టాలు ఎదురయినా ధైర్యంగా ఎదుర్కుని గెలవాలి కాని, పిరికితనంతో చావకూడదు. నీ రాజ్యం తిరిగి వచ్చే ఉపాయం చెబుతాను, విను,' అంటూ తన వద్ద ఉన్న వస్తువులను అతడికి ఎలా వాడాలో చెప్పి ఇచ్చాడు. తరువాత ఆ రాకుమారుడు ఆ వస్తువుల సాయంతో రాజ్యం తిరిగి సంపాదించుకున్నాడు. 

విక్రమార్కుడు, 'మంటల్లో పడి చావబోతున్న రాకుమారుడిని రక్షించాను. ఈ యాత్ర వలన మంచి మిత్రుడు లభించాడు. ఇంతకంటే కావలసింది ఏముంది?' , అనుకుంటూ తృప్తిగా తన రాజ్యం చేరుకున్నాడు.

కనుక ఓ రాజా! అటువంటి మహారాజుకు నీవు ఏ విధంగానూ సాటి రావు. ఇంటికి తిరిగి పో,' అంది. సిగ్గుతో వెనుదిరిగాడు భోజుడు. 


సాలభంజిక కధలు -12 

ఆఖరికి ముప్పై రెండవ బొమ్మ అయినా కరుణించక పోతుందా అన్న ఆశతో, భోజుడు పరమేశ్వర ప్రార్ధన చేసి, మణి పీఠం  ఎక్కేందుకు వచ్చాడు. అప్పుడు ఆ బొమ్మ ఇలా అంది . 

" రాజా ! విక్రమార్కుడిని మించిన ధర్మపాలన చెయ్యగల వాడు లేడు . రామ శకం, యుధిష్టర  శకం లాగా, విక్రమార్క శకం చరిత్రలో నిలిపాడు ఉజ్జయినీ పతి . ఇంతకాలం పట్టుదలతో వస్తున్నా మీకు అతని కధలు వినిపించాము. నీవు మాకు శాప విమోచనం కలిగించేందుకు విష్ణు అంశతో పుట్టిన కారణ జన్ముడవు . "

"  ఓ భోజరాజా ! మేము పూర్వ జన్మలో ఫార్వతీదేవిని సేవించే చెలి కత్తెలము. ఒకనాడు ఉద్యానవనంలో పూజకోసమై పూలు కోస్తున్నాము. అప్పుడు అదే సమయంలో మనోహరమైన అందచందాలతో మన్మధుని మించిన సోయగముతో ఈశ్వరుడు అక్కడికి వచ్చాడు. ఆ దివ్య సుందర మూర్తిని చూసిన మేము చేస్టలుడిగి ప్రతిమల్లా ఉండిపోయాము. అతడి అందచందాలకి పరవశించి వలపు కోర్కెలతో మనోవికారమునకు లోనయ్యాము. మనసులు వశం తప్పి మైమరచి చూపులను మరల్చలేక మత్తు మందు జల్లినట్టు చూడసాగాము. ఆ వింత పార్వతి గ్రహించి కారణం తెలుసుకుని మామీద కోపంతో ' మీరు భూలోకంలో ప్రతిమలుగా పడి ఉండండి అని మమ్మల్ని శపించింది '.

         అప్పుడు మా తప్పు తెలుసుకుని ఆమె కాళ్ళమీదపడి ' తల్లీ మమ్మల్ని క్షమించి మాకు శాపవిముక్తిని కలిగించు ' అని వేడుకన్నాము. అప్పుడు దయకలిగిన దేవి ' మీరు బంగారు బొమ్మలుగా ఉండగానే ,మీ వద్దకు ఒకానొక మహానుభావుడు పుణ్య పురుషుడు వచ్చి మీకు శాప విముక్తి కలిగిస్తాడు ' అని చెప్పి అదృశ్యమైంది. ఈ విధంగా శాపవిముక్తిని కలిగించింది. అప్పుడు మేము వెంటనే భూలోకానికి రాలేక విశ్వకర్మనిర్మితమైన ఈ సింహాసనాన్ని ఆక్రమించి ఇలా భూమిమీదకి వచ్చాము.

         ఐతే మా విక్రమార్కుడి ధైర్య శాహసాల్ని గుణగణాల్ని ఎంతటి మహత్తరమైనవో నీకు చెప్పాలని నిన్ను వారించి సింహాసనం అధిష్టించకుండా కథలు చెప్పి అడ్డుకున్నాము. ఇంతకీ నీవు మాత్రం తక్కువ వాడివికాదు. సరస్వతీదేవి ప్రోద్భలంవల్ల బ్రహ్మశరుని రాజుగా పుట్టించాడు. అతడే నీవు. నరనారాయణులకు అభేదం గనుక నీవే విష్ణువు. నీ దర్శనభాగ్యము వలన మాకు శాపవిమోచనం కలిగింది. మేము ధన్యులమయాము, నీకేం వరం కావాలో కోరుకో మేము నెరవేరుస్తాము"
 అని చెప్పాయి. 

         అందుకు సంతసించిన భోజరాజు "నాకు సకల సంపదలు ఉన్నాయి మీ దర్శన భాగ్యమే నాకు చాలు"అన్నాడు. 

         అందుకు అతని ఆదర్శానికి మెచ్చుకుని "మాకు ప్రాణదానం చేసిన దాతవు, నీకు ఏవిధంగా ప్రత్యుపకారం చేయగలము? నీవు సకలకళా కోవిదుడవు, సజ్జన రక్షకుడవు, దాన వినోదివి. సాక్షాత్తు నీవే విష్ణుమూర్తివి. నీ దర్శన భాగ్యంవల్ల సరస్వతి అనుగ్రహం కలుగుతుంది. నీ కీర్తి ప్రతిస్టలు ఆచంద్ర తారార్కమై నిలుస్తాయి. ఈ కధలన్నీ విన్న వారికి ఔదార్యం , సాహసం, గాంభీర్యం వంటి సద్గున్నాలు అలవడుతాయి ," అని దీవించి అదృశ్యమైపోయాయి. 

తనకు ఆ సింహాసనం ఎక్కే అర్హత లేదని భావించిన భోజ రాజు, ఈశ్వరుడిని ఆ సింహాసనం మీద ప్రతిష్టించి, ఆ దేవుడిని పూజిస్తూ ధర్మంగా రాజ్యం చేయ్యసాగాడు . 

[ సాలభంజిక కధలు సమాప్తం...]

32 comments:

  1. అద్భుతం! ఇంత గొప్ప కథలను అచ్చ తెలుగు వ్యవహారంలో అందించినందుకు ధన్యవాదాలు!

    ReplyDelete
  2. Simply Superb. Can some one call me on this number ? I want to talk about the copy rights of these stories!
    7799104990

    ReplyDelete
  3. అంతా బావుందండీ. అయితే చిన్న కరెక్షన్. సాలభంజికల కథలే బేతాళ కథలని మీరు రాశారు. బేతాళకథలు వేరు. అవి మాంత్రికుడి కోసం విక్రమార్కుడు పనిచేస్తున్నప్పుడు శవంలోని బేతాళుడు చెప్పిన కథలు. అవి ఇరవై అయిదు ఉంటాయి. వాటిని బేతాళ పంచవింశతిక అంటారు. ఏదేమైనా తెలుగు మీద మీ అభిమానం అభినందించదగినది. మరి మిగిలిన కథలు కూడా పోస్ట్ చేయండి.

    ReplyDelete
    Replies
    1. I agree that what did you said. Saalabanjika kadhalu are different from bhethala kadhalu, thanks

      Delete
  4. అద్భుత ప్రయత్నం

    ReplyDelete
  5. అద్భుత ప్రయత్నం . ఈ కథలను డౌన్లోడ్ చేసుకునే మార్గముంటే బాకున్నండి

    ReplyDelete
    Replies
    1. Download cheyochu print kottandi pdf loki convert avuthundi anthe

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
  6. అద్భుతం.. ఈ కథలను డౌన్ లోడ్ చేసుకునే ఆప్షన్ ఉందా అండి

    ReplyDelete
  7. thanq,ilanti kadhalu andhinchinandhuku

    ReplyDelete
  8. ఈ కథలు చాలా బాగున్నాయి.ఇలాగే "భేతాళ పంచవింశతిక"లు కూడా అందించగలరు.

    ReplyDelete
  9. పన్నెండు కథలు మాత్రమే ఉన్నాయి.దయచేసి మిగతా ఇరవై కథలు ఎప్పుడు బ్లాగ్ లో పెట్టండి.చాలా బావున్నది.

    ReplyDelete
  10. క్షమించమని మనవి. త్వరలో మిగిలిన ఇరవై కథలుబ్లాగ్ లో పెడితే అందరం చాలా సంతోషంగా ఉన్నది

    ReplyDelete
  11. సాలభంజికల కథలను సరలమైన తెలుగులో అందించినందుకు కృతజ్ఞతలు...... శ్రమ తీసుకుని మిగిలిన కథలను కూడా ప్రచురించగలరు.

    ReplyDelete
  12. సాలభంజికల కథలను సరలమైన తెలుగులో అందించినందుకు కృతజ్ఞతలు...... శ్రమ తీసుకుని మిగిలిన కథలను కూడా ప్రచురించగలరు.

    ReplyDelete
  13. namaskaram sir, mee lanti varu mana sahithyani brathkistunnaru. chala santhoshanga vundi. Migatha 20 kathalu kuda cheppagalaru. alage ee kathala a pusthakamulu vunnayo cheppagalaru.

    ReplyDelete
  14. this kind of stories should be published more and more
    such a epic story
    thanks for these kind of stories
    these stories should be supported by us
    these kind of stories should be published in schools too
    finally thanks for this stories

    ReplyDelete
  15. చాలా బాగుంది.అభినందనలు.తెలుగునాట ఇటువంటి రచనలు గురించి తెలుసుకొన వెలసిన వారికి ఇది ఒక మంచి వేదిక. ఇలాంటి రచనలు కధలు గురించి ఇట్లాగే తెలుపు తూ ఉండండి. ధన్యవాదములు.

    ReplyDelete
  16. Can you please send me this in Telugu pdf....please.

    ReplyDelete
  17. This comment has been removed by the author.

    ReplyDelete
  18. ఇలాంటి ఇతిహాసాలను పాఠ్యపుస్థకాలలో జేర్చి మన భావితరాలకు అందించాలి మన ప్రభుత్వం.

    ReplyDelete
  19. మీ ప్రయత్నానానికి నమస్కారం సర్

    ReplyDelete
  20. మీ ప్రయత్నం అమోఘం
    మరిన్ని కథలు వెలుగులోకి తీస్తారు అని ఆశిస్తున్నాను

    ReplyDelete