Sunday, February 24, 2013

పత్నీవ్రత ధర్మాలు

సమాజంలోని దురాచారాలను  తన వ్యంగ్య రచనలతో ఖండించిన కందుకూరి వీరేశలింగం పంతులు గారి 'సత్యరాజా పూర్వదేశ యాత్రలు' నవలలో వివరించిన పత్నీవ్రత ధర్మాలు...ఈ నవలలో సత్యరాజు కొన్ని పరిస్థితుల్లో స్త్రీ స్వామ్య వ్యవస్తలో నడిచే ఆడమళయాళానికి చేరుకుంటాడు. అక్కడ అతడిని నిర్బంధించి, అక్కడి ఆచార  వ్యవహారాలు అన్నీ నేర్పిస్తారు .

రోజూ పురుషుడు పొద్దుటే నిద్ర లేచి, నదిలో మునిగి కలశంలో నది నీళ్ళు తెచ్చి, పత్ని కాళ్ళు కడిగి , ఆ పాద తీర్ధం సేవించాలట...

ప్రతి దినంబును బురుషుండు పత్ని కంటె 
ముందుగా లేచి నదిలోన మునిగి జలము 
కలశమున దెచ్చి నిజపత్ని కాళ్ళు కడిగి 
తానూ శ్రీ పాద తీర్థంబు త్రాగావలయు ||

కుష్టు రోగిణి అయినా, గుడ్డిదయినా, వికలాంగురాలయినా , ముసలిదయినా, ఆ పత్ని ఎంగిలి తిన్న పురుషుడు మాత్రమె పుణ్యలోకాలకు వెల్తాడట.

భార్యలు భర్తలను దండిస్తూ అదుపు ఆజ్ఞలలో పెట్టుకొవాలట . లేకపోతే  భర్తలు గాడిదలై చేడిపోతారట .

పురుషుండు గార్ధభమున్ 
స్థిరముగా దండనము లేక చెడిపోదురిలన్ 
గరుణ దలంపక నెలకొక 
పరియయినా గొట్టవలయాన్ని బత్ని పురుషునిన్ || 

వినడానికి మనకు ఇవన్నీ చాలా హాస్యంగా అనిపించినా , ఇవన్నీ  ఆ నాడు స్త్రీకి విధించారని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆడ - మగ ఇద్దరిలో మగవాళ్ళు ఇప్పటికీ మన సమాజంలో కాస్త ఎక్కువ సమానమే!


దైవం ఉండేది ఎక్కడ?

దైవం ఉండేది ఎక్కడ?

అయ్యో, అది కూడా తెలీదా? గుడిలో ఉంటారండీ. అందుకే ,గుడిని చాలా శుబ్రంగా ఉంచుతారు. రోజూ తుడుస్తారు, కడుగుతారు, గ్రహణాలు వస్తే సంప్రోక్షణ చేస్తారు. ఎటువంటి అమంగళ కరమయిన పనులు జరుగకుండా, నిరంతరం ఆలయ పవిత్రతను కాపాడే ప్రయత్నం చేస్తుంటారు. 

సరే, అంతేనా, కేవలం గుడిలోనే దైవం ఉంటారా?

ఈ సందర్భంగా ఎప్పుడో చదివిన చిన్న కధ జ్ఞాపకం వస్తోంది. నిండు సభలో, ద్రౌపదీ వస్త్రాపహరణం జరుగుతోంది. ' హే ద్వారకావాసా ! శరణు ' అంది ద్రౌపది. బదులు లేదు. 'హే మధురాపురి నివాసా! రక్షించు.' అని వేడుకుంది. బదులు లేదు. 'హే హృదయవాసా! అంతర్యామి. నీవు తప్ప వేరు దిక్కు లేదు ', అంటూ అర్ధించింది. వెంటనే కరుణించాడు ఆ దయాసముద్రుడు. అంటే...దేవుడు ఎక్కడో ఉండడు ,భగవంతుడి స్థానం మన మనస్సు.

దైవ మందిరాన్ని యెంత పవిత్రంగా ఉంచుతామో, మనస్సనే మందిరంలో దైవం కొలువుండాలంటే, అది అంతే పవిత్రంగా ఉంచాలి . కాని, మనం ఏమి చేస్తాం ? ఈర్ష, అసూయ, ద్వేషం, వైరం, కుళ్ళు, కుతంత్రం...ఇవన్నిటినీ మోసుకు తిరుగుతూ వ్యాపింప చేస్తాం. చెప్పండి, ఇటువంటి దుర్గంధపూరితమయిన వాతావరణంలో దైవం ఎలా ఉంటారు ? అసంభవం...అందుకే 'నాది...నాది ...' అని తపించే వాళ్లకి ఏదీ మిగలదు . 



నిజానికి ఏది నాది? అశాశ్వతమయిన ఈ జీవితంలోని ప్రతీ క్షణంలో ఏదీ నాది కాదు. ఈ నిముషంలో నాతొ ఉన్నవారు మరునిముషంలో ఉండరు. రాబోయే గంటలో నా జీవితం ఏ మలుపులు తిరుగుతుందో నాకు తెలీదు. కనిపించే అందరూ, వాళ్ళ మమతలు, పగలు, అసూయలు...అన్నీ అశాశ్వతమే. మరి మనం పుట్టింది ఎందుకు ?వీటన్నిటికీ అతీతమయిన, శాశ్వతమయిన దైవాన్ని తెలుసుకోవడానికి . అమృతమయమయిన దైవ ప్రేమను అనుభూతి చెందడానికి. కాని, 'నేను, నాది' అనే మాయ పొర మనకు, దైవానికి మధ్య అడ్డుతెర.ఆ తెర తొలగించి, ఒక్క సారి కనిపించే అందరిలో, అన్నిటిలో దైవం కొలువున్నారన్న నిజాన్ని దర్శించగలిగారా ...ఇక మీ జీవితం ధన్యం . ఎవరి మమతలూ మిమ్మల్ని కట్టి పడెయ్యవు . ఎవరి మోసం మిమ్మల్ని బాధించదు. అమృతం తాగిన వాడికి పటికబెల్లం చూపించి, ఇది తియ్యగా ఉంటుంది, తిను అంటే, ఎలా ఉంటుందో, ఇతరులకు మీ పట్ల ఉన్న భావనలు, ఆ దైవం అందించే దివ్యప్రేమ ముందు తృణ ప్రాయాలు .

నవ్వినా, ఏడ్చినా, కళ్ళు మూసినా, తెరచినా, చివరికి పిడుగు మీ తల మీద పడ్డా, కళ్ళ ముందు అనుక్షణం దైవం నవ్వుతూ అనునయిస్తుంటే, ఆనందంగా విషాన్నయినా త్రాగాగలం. ఈ స్థితి కోసం ప్రయత్నించండి. శివావరణ లో ఉన్న మీరు, 'శివుడు' కొలువున్న ప్రతీ ప్రాణినీ శివునిగానే భావించి ప్రేమించండి. ప్రతీ వ్యక్తినీ వారి లోపాలు, సుగుణాలతో సహా అంగీకరించి ప్రేమించండి...ఇదే నిజమయిన ప్రేమకు నిర్వచనం. ఇది ఆచరించడం కష్టమే, అయినా మనం వేసే ప్రతీ అడుగు దైవాన్ని సమీపించే ప్రయత్నంగానే ఉండాలి . ఆ పరమేశ్వరానుగ్రహం మీ పై పరిపూర్ణంగా ప్రసరించుగాక. శుభమస్తు.

'పరోపకారార్ధమిదం శరీరం'

భగవాన్ సత్యసాయి దివ్య వచన మధురి...సనాతన సారధి నుంచీ.

'పరోపకారార్ధమిదం శరీరం'

మంచీ చెడ్డలు ఒకే చోట పుడుతుంటాయి. ఒకే కొలనులో తామర పువ్వూ పెరుగుతుంది, రక్తాన్ని పీల్చే జలగ కూడా పెరుగుతుంది. కొందరు మంచిని స్వీకరించి చెడును విడిస్తే, మరికొందరు, చెడును తీసుకుని మంచిని విడిచిపెడతారు. 

మంచివారు మంచి గంధపు చెట్టువంటివారు. తన కొమ్మను నారికే గోద్దలికి కూడా పరిమళాన్ని అందిస్తుంది గంధపు చెట్టు. అగరువత్తి తనను కాల్చినా, సుగందాన్నే వెదజల్లుతూ ఉంటుంది. చెట్టు తన కొమ్మలు నరికినవానికి కూడా చాయను అందిస్తుంది. నది తన నాధుడయిన సముద్రుడిని చేరడానికి రాళ్ళు, రప్పలు, ముళ్ళ కంపలు దాటుకుంటూ, యెంత శ్రమకయినా వార్చి, దారిలో జీవుల దాహం తీరుస్తూ, పంటలు పండిస్తూ, సాగిపోతూనే ఉంటుంది. గోవులు తమ రక్తాన్ని పాలుగా మార్చి, బిడ్డలా నోళ్ళు కట్టి, మనకు క్షీరం అనే అమృతాన్ని ఇస్తున్నాయి. 

మన దేహం ఈ గంధపు వత్తి మాదిరి కాలుతూ కాలుతూ, ప్రపంచానికి మంచిని అందించాలి. ఈ చెట్లు, నదులు, గోవులు అన్నిటి కంటే మనిషి ఎక్కువ ఉపకారి కావాలి. లేక మనిషి పేరు పెట్టుకున్న మనం పశు సమానులం అవుతాము. 


Monday, February 4, 2013

సమస్యాపూరణం


సమస్యాపూరణం

  సాహిత్యంలో సమస్యాపూరణం సరస వినోదమయిన, హృదయ రంజకమయిన ప్రక్రియ. ఇవ్వబడిన పదములను, వేరే పదములతో కలిపి అర్ధవంతముగా చెప్పడమే సమస్యాపూరణం.

ఈ సమస్యాపూరణాలు భోజ రాజు కాలం నుంచీ ఉన్నాయి. భోజ రు గొప్ప ప్రభువే కాకుండా గొప్ప కవి, కవిపోషకుడు, కళాపోషకుడు, విద్వాంసుడు. అతడు ఇచ్చే సమస్యలను కాళిదాసు సరసంగా పూరించేవాడు. ఒక సారి భోజ రాజు 'టంటంట టంటంట టటం టటం టం '  
అనే సమస్యను ఇచ్చి పూరించామన్నాడట. దానిని కాళిదాసు ఈ విధంగా పూరించాడు.

"రాజ్యాభిషేకే మదవిహ్వాలయాః 
హస్తచ్చ్యుతో హేమఘటోయువత్యాః 
సోపాన మార్గేషు కరోతి శబ్దం 
టంటంట టంటంట టటం టటం టం."

భావము : రాజుగారు స్నానం చేసే సమయంలో చూచిన ఒక పరిచారిక మొహపరవశంతో తన చేతిలో ఉన్న బంగారు కలశం జారవిడిచినప్పుడు,మెట్ల మీది నుండీ 'టంటంట టంటంట టటం టటం టం' అని శబ్దం చేసుకుంటూ అది జారి క్రిందపడిందిట .


సాహితీజైత్రయాత్ర గావించిన శ్రీనాధుడికి ఒక రాజాస్తానములో ఆయనను అవమానించే ఉద్దేశముతో బండిర (ఱ) తో క్రింది సమస్యను ఇచ్చారు. మన కవులు సామాన్యులా...వాళ్ళ వేలితో వాళ్ళ కన్నే  పొడిచి వచ్చే  మేధా సంపన్నులు .  'అందఱునందఱు మఱియు నందఱు యంద ఱందరే' అన్న సమస్యను శ్రీనాధుడు ఎలా పూరించాడో చూడండి.

కొందఱు భైరవాశ్వములు, కొందఱు పార్థుని తేరి టెక్కముల్ 
కొందఱు ప్రాక్కిటీశ్వరులు, కొందఱు కాలుని యెక్కిరింతలున్
కొందఱు క్రిష్నజన్మమున కూసిన వారలు కావునన్ మఱే 
అందఱునందఱు మఱియు నందఱు యంద ఱందరే.

భావము: ఈ సభలో ఉన్నవారు కొందరు కుక్కలు (భైరవుడి అశ్వాలు), కొందరు కోతులు ( అర్జునుడి రధంపై జండాలు) , కొందరు పందులు ( ఆది వరాహాలు), మరికొందరు దున్నపోతులు ( యమ ధర్మరాజు వాహనాలు), మరికొందరు కృష్ణుడు జన్మించినప్పుడు కూసిన వారు...అంటే గాడిదలు ...ఈ సభలో ఉన్నవారంతా అటువంటి వారే!

బ్రతుకు విలువ

జీవితం చాలా చిత్రమయినది. నదీ జన్మ స్థానం నుంచీ ఎన్నో దశలు దాటి, ఎన్నో అవరోధాలు అధిగమించి, ఎన్నో మలుపులు తిరిగి, చివరకు సాగరాన్ని చేరి తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. ఇటువంటిదే మన జీవితం. కొన్ని ఆశ్చర్యకరమయిన మలుపుల సమాహారం. 'ఇది ఇలాగే ఎందుకు జరగాలి? ' అని ప్రశ్నిస్తే బహుశా అందుకు సమాధానం కేవలం ఆ పైవాడికే తెలుసేమో.

నాకు ఊహ తెలిసిన దగ్గరనుంచీ , దాదాపు ఆరొవ తరగతి నుంచీ ,షిర్డీ సాయిని ఆరాధించేదాన్ని. ఆయనను షిర్డీ వెళ్లి చూడాలని, ఆర్తిగా తపిస్తూ పాటలు పాడుకునేదాన్ని. ఆ వయసులో ఆర్తి, భక్తీ సాధ్యమా...అంటే జన్మసంస్కారం వల్ల సాధ్యపడిందనే చెప్పాలి. నా దినచర్య తెల్లవారుఝామున ఐదు గంటలకు చన్నీళ్ళ స్నానం చేసి, శివాలయానికి వెళ్లి ప్రారంభించేదాన్ని. గుడి, ట్యూషన్, పాఠశాల, సాయంత్రం హిందీ తరగతులు, కళలు ఇలా సాగేది.  అలా పదొవ తరగతి వరకూ సాగింది. ఇక ఇంటర్ ...అప్పట్లో మేము తెనాలి లో ఉండేవాళ్ళము. మా ఇంటి దగ్గరలో ఒక బాబా గుడి ఉండేది. ఇక రోజూ బాబా గుడికి వెళ్ళడంతో దిన చర్య మొదలు. గుడికి వెళ్లి మౌనంగా కాసేపు ఒక స్తంభాన్ని ఆనుకుని కూర్చునేదాన్ని. ఆయనే నా ధ్యాన మూర్తి. అలా నాకు ధ్యానం, సత్ప్రవర్తన, వొదిగి ఉండడం , అన్నీ మౌనంగా దక్షిణామూర్తి లా నేర్పించారు. 

అలా ఆరోవ తరగతి నుంచీ బాబా దర్శనం కోసం తపిస్తూ ఉంటే , చివరకు నేను ఇంటర్ కు వచ్చాకా షిర్డీ వెళ్ళే అవకాశం దొరికింది. మా కుటుంబ సభ్యులం ఒక పద్నాలుగు మందిమి కలిసి హైదరాబాద్ నుంచీ ఒక వాన్లో బయలుదేరాము. నిజామాబాద్ సమీపంలో టిఫిన్ చెయ్యడానికి ఆగాము. 1993 వ సంవత్సరం. అప్పట్లో ఆ ప్రాంతం అంతా అడవులతో నిండి ఉండేది. కొండలు, లోయలూ...డ్రైవర్ ఫ్రంట్ గ్లాస్ తుడుచుకోవడానికి వాన్ ఆపాడు. ఉన్నట్టుండి, వాన్ కదిలి పక్కనున్న లోయలోకి పయనించడం మొదలుపెట్టింది. డోర్ దగ్గరున్న నేను దొర్లి కొంత దూరంలో పడిపోయాను. మిగిలిన కుటుంబ సభ్యులు భయపడి అరవసాగారు. మా బామ్మ 'సాయీ' అంటూ అరిచింది. హటాత్తుగా వాన్ ఒక చిన్న చెట్టుకు ఆలంబనగా ఆగిపోయింది. అంతా , ఆ ఆశ్చర్యకర సంఘటనకు ఏంటో ఉద్వేగానికి గురయ్యారు. నెమ్మదిగా వాన్ దిగి, మా ప్రాణాలు కాపాడినందుకు సాయికి కృతఙ్ఞతలు చెప్పుకున్నాం. దగ్గరలో ఉన్న సాయి ఆలయానికి వెళ్లి పూజాదికాలు ముగించుకుని బయలుదేరాము. ఆ షిర్డీ యాత్ర ఇప్పటికీ మర్చిపోలేను. సాఠె వాడలో బస, దగ్గరలో గుడి, లెండి వనం, ప్రశాంతత ,ఇప్పుడంతా మారిపోయింది .అయినా ఆ దివ్య మూర్తి తేజం అలాగే ప్రపంచంలోని ప్రశాంతత కలబోసినట్లు....మనోవైకల్యాలు శమింప చేసేటట్లు...

అది నా జీవితంలో మొదటి సారి ప్రాణాపాయం తప్పించుకోవడం...చావు మొహం చూసి వస్తే కాని, బ్రతుకు విలువ తెలియదేమో ! క్షణికమయిన ఈ బ్రతుకులో కక్ష్యలు, పగలు, ఎత్తుగడలు, ద్వేషభావనలు విడిచి, మన మనసు మందిరాలను  సాయి నివాసానికి అనుగుణంగా మలచుకోమన్న దివ్య సందేశం కాబోలు ! ఇంకొక ప్రమాదం , గురించి మరి కొన్ని గంటల్లో రాస్తాను....

 

అలా బాబా దర్శనం, అనుగ్రహంతో ఇంటర్ పూర్తీ చేసాను. ఇంటర్ లో డాక్టర్ అవుదామన్న సంకల్పంతో బై.పి.సి తీసుకున్నాను. మొదటి సారి ఎనిమిది వెలలోరాంక్ . లాంగ్ టర్మ్ ఇప్పించి, ఒక ఏడాది వేస్ట్ చెయ్యడం తనకు ఇష్టంలేదన్నారు నాన్న. అందుకే, డిగ్రీ చేరి, విడిగా ట్యూషన్ లకు వెళ్ళమన్నారు. ఆడపిల్లలమని ఏదీ బలవంతపెట్టలేదు. ఇంటర్ లో నాకు ఇష్టమయిన గ్రూప్ తీసుకోనిచ్చారు. అయితే, ఒక పక్క డిగ్రీ, ఒక పక్క సంగీతం, ఒక పక్క ట్యూషన్ లు. వీటి మధ్య డిగ్రీ కాలేజీ ఫస్ట్ వచ్చాను కాని, ఎంసెట్ మీద దృష్టి కేంద్రీకరించలేక పోయాను. డిగ్రీ తో పాటుగా కంప్యూటర్ లో పీజీ డిప్లొమా చేసాను. 1996 మోడల్ డొక్కు కంప్యూటర్ లు, బేసిక్, కోబాల్ వంటి ప్రోగ్రామ్స్ తలచుకుంటే , ఇప్పుడు నవ్వు వస్తుంది. అలా డిగ్రీ పూర్తీ చేసాకా , ఎం.ఎస్.సి ఎంట్రన్సు పరీక్షలు రాసాను . ఇందుకు ఎటువంటి కోచింగ్ తీసుకోలేదు. బోటనీ ఎంట్రన్స్ లో 58 వ రంక్ వచ్చినా యూనివర్సిటీ లో సీట్ రాలేదు. కెమిస్ట్రీ మొదటి విడత కౌన్సిలింగ్ లో సీట్ రాలేదు. అమ్మా, నాన్నా నా భవిష్యత్తు గురించి బెంగపడ్డారు. విజయవాడలో ఒరాకిల్ కోర్స్ చేర్పించండి, చదువుకున్నాకా ఉద్యోగం వాళ్ళే ఇస్తారట, అని చెప్పి, అక్కడ హాస్టల్ లో చేరి చదువుకునే దాన్ని. 'బాబా, నా తెలివితక్కువ తనం వల్ల  అమ్మానాన్న బాధ పడకూడదు. ఆడపిల్లలయినా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, స్వతంత్రంగా బ్రతికేలా ఉండాలన్నవాళ్ళ సత్సంకల్పం దెబ్బతినకూడదు. నాకొక దారి చూపించు , ' అని ప్రార్దిన్చేదాన్ని.

అలా ఇరవై రోజులు గడిచిందో లేదో, రెండవ విడత కౌన్సిల్లింగ్ కు పిలుపు వచ్చింది. వస్తుందో, లేదో అన్న సంశయంతో బయలుదేరాను. మొదట విజయవాడ సిద్ధార్ధ కాలేజీ లో ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ వచ్చింది. అయితే, అప్పట్లో ఆ శాఖకు ఎక్కువ ప్రాముఖ్యత లేకపోవడంతో , ఏదో అసంతృప్తి. ఇంతలో సిద్ధార్ధ వాళ్ళు ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ ను ఆర్గానిక్ కెమిస్ట్రీ గా మారుస్తున్నట్టు ప్రకటించారు. నాకు ఆశ్చర్యం. ఇంతలో మరో అద్భుతం ...బాపట్ల కాలేజీ లో అమ్మాయిల హాస్టల్ సౌకర్యం లేదని ఒక అమ్మాయి విజయవాడకు మారతానని ప్రకటించింది. ఆ సీట్ కోసం ఎవరయినా సుముఖంగా ఉన్నారా అని మైక్ లో అడిగారు. సొంత ఊరు, తెలిసిన మనుషులు...ఎంతో ఆనందంతో స్వీకరించాను. తన బిడ్డ కోసం బాబా ఒక సీట్ ఆట్టేపెట్టినట్టు అనిపించింది. అలా నా చదువు పూర్తి  కాగానే పెళ్లి సంబంధం కుదిరింది. సతీష్ ఎంతో మంచివారు . వారితో నా జీవితం మెత్తటి పూలపై నడకలా సాగిపోయింది. తిరిగి చూసుకునే లోగానే, నా చేతులో ఇద్దరు చిట్టి పాపాయిలు. 

అప్పట్లో మేము బెంగుళూరు లో ఉండేవాళ్ళం. చిన్న దాని అక్షరాభ్యాసం శృంగేరిలో చేయాలని బయలుదేరాం. చిక్మంగులురు నుంచీ శృంగేరి వెళ్ళే దారిలో కాఫీ తోటలు, కొండలు, కోనలు. ఎందుకో ఆ వేళ ఉదయం నుంచీ మనసు కీడు శంకిస్తోంది. వొడిలో బాబా పారాయణ పుస్తకం పెట్టుకుని మౌనంగా కూర్చున్నాను. ఇక శృంగేరి 2 కిలోమీటర్లు ఉందనగా డ్రైవర్ కు 'వచ్చేసాం కదా ' అన్న ధైర్యం వచ్చేసింది. కొండ దారులు, వాన చెమ్మ , వాన నీరు రోడ్డుపైకి రాకుండా రోడ్డుపక్క తవ్విన కాలువలు. హఠాత్తుగా మా సుమోకి అడ్డంగా రెండు ఆవులు వచ్చాయి. వాటిని తప్పించుకునేందుకు డ్రైవర్ బండిని తిప్పగానే, బాలన్స్ తప్పి, కాలువ పైనుంచి యెగిరి, ఒక చెట్టుకు కొట్టుకుని, అటు వెళ్ళే బండి, ఇటు తిరిగి, ఆ కాలువలో పక్కగా పడిపోయింది. అదృష్టం...ఆ కాలవలో బురద తప్ప నీళ్ళు లేవు. వాన్ లో మేము నలుగురం, డ్రైవర్, ఒక తెల్సినాయన. బాంబు పడ్డట్టు పెద్ద శబ్దం రావడంతో స్థానికులు పరిగెత్తుకు వచ్చారు. మేము పచ్చడయిపోయి ఉంటామని, వారు భావించారు. ముందుగా మా వారి క్షేమం, తరువాత పిల్లల క్షేమం, తరువాత నా పరిస్థితి సమీక్షిన్చుకున్నాను. సాయం చేసేందుకు బండి వద్దకు వచ్చి, ఒక్కొక్కరినే దించిన వాళ్ళు ఆశ్చర్య పోయారు. ఎందుకంటే ...మా ఎవ్వరికీ చిన్న దెబ్బ కూడా తగలలేదు. షాక్ నుంచీ కోలుకునే దాకా అనునయించారు. ఆ శారదా దేవి కాపాడింది అంటూ దీవించారు. మంచితనం, మానవత్వం...ఆ రోజే చూసాను. ఆ సుమోకి సుమారు 80,000 రిపేర్ అయ్యిందట....అంటే యెంత బలమయిన దేబ్బో ఊహించండి.

ఆ స్వామి కంటికి రెప్పలా నన్ను, నా కుటుంబాన్ని కాపాడుతూ రెండుసార్లు పునర్జీవితం  ప్రసాదించారు .ఆయన పెట్టిన ప్రాణభిక్ష వల్లే , మీ ముందు ఈ రోజు నేను మాట్లాడేందుకు ఆస్కారం ఇచ్చింది. తన బిడ్డను తనే రక్షించుకుని, తన సేవకు నియోగించుకున్న ఆ స్వామి ఋణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను.

|| సమర్ధ సద్గురు సాయినాధాయ నమః ||

తెలుగువాడు

శాతవాహనుల వంశాన పుట్టినవాడు 
కాకతీయుల పోతుగడ్డ మెట్టినవాడు 
పల్లెలోనే కాదు ఢిల్లీ లోసైతమ్ము 
పెద్ద గద్దెలనేలి పేరుకెక్కినవాడు 
ఎవడయ్య ఎవడువాడు, ఇం 
కేవడయ్య తెలుగువాడు .

పంచెకట్టుటలో ప్రపంచాన మొనగాడు 
కండువా లేనిదే గడపదాటనివాడు 
పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ 
గొంగోరకొసమై గుటకలేసేవాడు 
ఎవడయ్య ఎవడువాడు, ఇం 
కేవడయ్య తెలుగువాడు .


తెలుగు బాసను జుంటితేనెయని తెగపొగిడి 
పొరిగింటి పులుసుపై మరులు పెంచినవాడు 
దేశభాషలలోన తెలుగు లెస్సనిచాటి 
మల్లెలకు బదులు లిల్లీలు వలచినవాడు 
ఎవడయ్య ఎవడువాడు, ఇం 
కేవడయ్య తెలుగువాడు .

మంచి మనసెదురైన మాలలిచ్చేవాడు 
భాయి భాయి అన్న చేయి కలిపేవాడు 
తిక్క రేగిందంటే డొక్క చీల్చేవాడు 
చిక్కులెరుగనివాడు చిత్తాన పసివాడు 
ఎవడయ్య ఎవడువాడు, ఇం 
కేవడయ్య తెలుగువాడు .