Wednesday, January 28, 2015

వాఘా ఇండో- పాక్ సరిహద్దు దళాల వేడుకలు

వాఘా ఇండో- పాక్ సరిహద్దు దళాల వేడుకలు 
-----------------------------------------------------
భావరాజు పద్మిని - 28/1/15  

ఒక ప్రక్క 'హిందుస్థాన్ జిందాబాద్... వందే మాతరం ...' అన్న నినాదాలు.
మరో ప్రక్క ' పాకిస్థాన్ జిందాబాద్..' అన్న నినాదాలు... ఇదేదో క్రికెట్ మ్యాచ్ అనుకుంటే మీరు పొరబడినట్టే. ఇది అమృత్సర్ వద్దనున్న భారత్  సరిహద్దులోని చివరి గ్రామమైన 'అటారి' వద్ద గోచరించే హృద్యమైన దృశ్యం.

ఇటువైపు మహాత్మాగాంధీ బొమ్మ ఉన్న  స్టేడియం లో మీకు గోచరిస్తున్న వారంతా భారతీయులు. అటువైపు మొహమ్మద్ జిన్నా  చిత్రం ఉన్న గేటుకు ఆవల మీకు కనిపించే వారంతా పాకిస్థానీయులు.

భారత్, పాక్ సరిహద్దు దళాలు కలిసి, సాయంత్రం వేళ 'వాఘా' వద్ద, జండా దింపే ప్రక్రియను ఒక వేడుకకా చెయ్యాలని అనుకున్నారు. సాయంత్రం వేళ, కాసేపు, ఇటు భారత్ గేటు, అటు పాకిస్థాన్ గేటు  తీస్తారు. ఆ సమయంలో మన స్త్రీ, పురుష దళాలు అటువైపు వెళ్తాయి. అలాగే, పాకిస్థాన్ కు చెందిన దళాలు ఇటువైపు వస్తాయి. ఒకరిని ఒకరు చూసి, మీసాలు మెలేసి, తొడ కొట్టి, బూట్లు ఎత్తుతారు. ఇది కేవలం ఒక చిన్న వినోదం కోసం మాత్రమేనండోయ్...



మేము వెళ్లేసరికి స్టేడియం మొత్తం నిండిపోయింది. అటు పాకిస్థాన్ వైపు జనం చాలా పల్చగా ఉన్నారు.  మధ్యలో గుంపుగా మూగిన కొందరు భారతీయులు, 'ఏ మేరా ఇండియా...' పాటకు, ఆ తర్వాత మరికొన్ని పాటలకు కేరింతలు కొడుతూ, నృత్యం చేసారు. కొందరు బుగ్గలపై భారత జండా టాటూ లు వేయించుకుని వచ్చారు. కొందరు జండాలు తెచ్చి, ఊపుతూ ఆనందించారు.

గేటు తెరిచే సమయానికి, ఈలలు, గోలలు, జై భారత్ అన్న నినాదాలతో... స్టేడియం మొత్తం మార్మ్రోగిపోయింది.  ఇల్లు, కుటుంబానికి దూరంగా ఎక్కడో ఉంటూ, మన కోసం అహర్నిశలూ పనిచేస్తున్న  సరిహద్దు దళాలకు ఇది ఆటవిడుపు. వారు అప్రమత్తంగా ఉంటూనే, అడిగిన వారితో, పిల్లలతో ఫోటోలు తీయించుకుంటూ ఆనందించారు. దేశభక్తి నరనరానా ప్రవహిస్తూ ఉండగా, అది ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన వేడుక. వీలుంటే, మీరు కూడా నయనానందకరమైన ఈ వేడుకలో ఒక్కమారైనా, తప్పక పాల్గొనండి.

Tuesday, January 27, 2015

గురువుల ‘అమృత పాతం ‘ – అమృత్సర్

గురువుల ‘అమృత పాతం ‘ – అమృత్సర్ 
---------------------------------------------
భావరాజు పద్మిని - 27/01/2015 

నా దృష్టిలో...’ మతం అంటే మనిషిలో సత్ పరివర్తన తీసుకురాగలిగింది...’ . నిజంగా ఆ మతంలోనే పుట్టి, అందులోని సిద్ధాంతాలను ఔపాసన పట్టినా, త్రికరణ శుద్ధిగా నమ్మి ఆచరించినా, అది ఆ మనిషిలోని క్రూరత్వాన్ని/దుష్టత్వాన్ని అణచి, సన్మార్గంలోకి నడిపించలేనప్పుడు, ఆ మతం వ్యర్ధం !

అలా మనిషిలో అంతర్గత మార్పును తీసుకువచ్చే, నేను ఇక్కడ చూసిన గొప్ప మతం సిక్కు మతం. సాధారణంగా వీరికి కొండల్ని పిండి చేసేంత బలం ఉంటుంది. అలాగే ఏనుగు కుంభస్థలాన్ని నేరుగా డీ కొనే ధైర్యం ఉంటుంది. సిక్కు పురుషులు యోధులు, స్త్రీలు కూడా ధీరలే ! అయితే, వారు ఎన్నడూ ఇతరులకు హాని తలపెట్టే ఆలోచనలు చెయ్యరు. వారి బలాన్ని బలహీనులమీద చూపి, మీసాలు మెలేసే నీచత్వానికి దిగజారరు. ఎందుకని ? ఉక్కు వంటి సిక్కు మనసుల్ని మలచి, వారి యుక్తులను సరైన దిశలో మలచిన ఘనత మాత్రం దశావతారాల వంటి వారి పది మంది గురువులదే !

పాత అమృత్సర్ నగరం ఎనిమిది దిక్కుల లోనూ, 8 ప్రాకారాలు ఉన్న కోట గోడచే ఆవరించబడిన ప్రాకారంలో ఉండేది. లాహోర్ నుంచి, మన దేశంలోకి చొరబడిన మొఘల్ రాజులకు, బ్రిటిష్ వారికి, అందరికీ మొదట గోచరించేది, కంచుకోట వంటి ఈ అమృత్సర్ నగరం. ముందా కోటను వశపరచుకోవాలి , ఎలా ? ఎంతటి సైనిక బలగం ఉన్నా, దుర్భేద్యమైన ఆ కోట వైపు, ధీరులైన సిక్కుల వైపు చూడాలంటేనే వారికి భయం ! అందుకే మొదట సిక్కు గురువులను తమ మతం  లోకి మార్చాలని అనుకున్నారు. గురువు దారి తప్పితే, మిగిలిన వారిని సునాయాసంగా మార్చవచ్చని, వారిని హింసించారు. సిక్కు గురువులలో కొంతమందిని మొఘలులు, బ్రిటిష్ వారు ఎత్తుకుపోయి, ఖండ ఖండాలుగా నరికి చంపమని శిక్ష వేసినప్పుడు... వాళ్ళు మౌనంగా తమ చేతులూ, కాళ్ళు అప్పగించి, గురు గ్రంధం లోని శ్లోకాలు చదువుతూ, ఆ చంపేవారి మనసుల్లోని క్రూరత్వాన్ని మార్చమని, దైవాన్ని ప్రార్ధిస్తూ, కన్ను మూశారు ! అంతే తప్ప, మతం, ధర్మం మార్చుకోమని చెప్పారు. గురు దీప్ సింగ్ గాధ అయితే, అత్యంత ఆశ్చర్యకరం ! ఈయన స్వర్ణ దేవాలయాన్ని ముట్టడించిన వారిపై దాడికి దిగగా, వారు ఆయన శిరస్సు ఖండించారు. ఆయన ఏ మాత్రం చలించకుండా, తెగిన తన తలను చేతబట్టుకుని, మిగిలిన శత్రుసంహారం చేసి, చివరికి తన నెలవు చేరుకొని, తెగిన తన తలను వదిలేసారట ! గురువులు సర్వసమర్ధులని, దేహానికి మాత్రమే పరిమితం కారని వారి గాధ నిరూపిస్తుంది.

   అంగబలం, అర్ధబలం మనిషిని ఎంతటి నీచానికైనా దిగజారేలా చేస్తుంది. 1748 లో లాహోర్ కు గవర్నర్ గా వచ్చిన ‘మీర్ మన్ను‘ హయాంలో జరిగిన దురాగాతాలైతే, చరిత్ర చెక్కిట చెరగని రక్తపు మరకలే అనవచ్చు ! ఈ నాటికీ భారత జాతి చరిత్రలోనే ఇటువంటి దురాగతాల్ని మనం చూసి ఉండము అంటే, అతిశయోక్తి కాదేమో !
కోట బయటే ఉంటూ, తమకు అప్పగించిన ఒక్కొక్క సిక్కు తలకు, 10 రూపాయల బహుమానం ప్రకటించారు. ‘డివైడ్ అండ్ రూల్’ లాగా వారిలో వారికే భేదాలు కల్పించి, సిక్కు మగవారిని సంహరించారు. అతనికి భయపడి, చాలామంది కోట వదిలి, అడవులకు వెళ్ళిపోయారు. మతం మార్చుకోని, ప్రతి ఒక్కరినీ నిర్దయగా సంహరించారు. మిగిలిన ఆడవారిని, పిల్లల్ని కారాగారానికి తరలించారు. అమ్మల కళ్ళ ఎదుటే, వారి బిడ్డల్ని సంహరించి, ఆ మాంస ఖండాలను తల్లుల మెడలో వేసారు. స్త్రీల చేత రోజుకు 450 కిలోల తిండిగింజల్ని నూరిస్తూ, వాళ్లకు రోజుకు కేవలం ఒక చిన్న రొట్టె, ఒక గ్లాస్ నీరు మాత్రమే ఇచ్చేవారు. పని చేసే శక్తి లేని స్త్రీల గుండెపై ఒక పెద్ద బండరాయిని పెట్టి, చంపారు. కొందరిని యధేచ్చగా బలాత్కరించారు. అయినా ఆ స్త్రీలు ఏం చేసారో తెలుసా ! గురు నామాన్ని, గురు గ్రంథ సాహిబ్ లోని శ్లోకాల్ని పాడుకుంటూ హింసను మౌనంగా భరించారు. ఎందుకంటే... వారికి వారి గురువులపై అచంచల విశ్వాసం ! కొంత కాలానికి క్రూరుడైన మీర్ మన్ను మరణించగా, సిక్కులంతా ఏకమై దాడి చేసి, మిగిలిన తమ స్త్రీలకు, పిల్లలకు విముక్తి కల్పించారు.



ఇంతకూ వారి జీవితం ద్వారా వారు బోధించినది ఏమిటి ? తమ దేశం కోసం , జాతి కోసం, ధర్మం కోసం, సాటివారి శ్రేయస్సు కోసం, ప్రాణాలనైనా తృణప్రాయంగా భావించి అర్పించమని, ఆచరణాత్మకంగా చూపారు. అందుకే, ప్రస్తుతం భారతావని సైన్యంలో అధిక శాతం సిక్కులే ! అంతటి త్యాగధనులు వారు.

‘అమృత్సర్’ పేరుకు తగ్గట్టు... మన మనసుల్లో అమృత సరమై ప్రవహిస్తుంది. అక్కడ రాజైనా, పేదైనా ఒక్కటే ! అందరూ ఒక్క వరుసలో వెళ్లి, దర్శించుకోవాల్సిందే ! అక్కడికి వెళ్ళినవారు తప్పక భోజనం చేసి తీరాలన్న నియమం ఉంది. అదికూడా, ఏ రకమైన వివక్ష లేకుండా, ఎంతటి ఘనుడైనా, భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు, రెండు చేతులూ చాచి, ‘దేహీ’ అన్నట్లుగా పట్టి, రొట్టెను స్వీకరించి, తినాల్సిందే ! అంతేకాదు, ఇక్కడ మరో విశేషం ఉంది. ఈ పాలరాతి ఆలయం అత్యంత శుభ్రంగా ఉంటుంది. ఎలాగో తెలుసా ? కుప్పలుతెప్పలుగా ఆలయ శుభ్రతకు సిబ్బందిని పెట్టుకున్నందుకు కాదు ! గురు భక్తుల సేవతో ! ఆ ఆలయంలో ఈరోజున సేవకు పేర్లు నమోదు చేసుకున్నవారికి అవకాశం వచ్చేందుకు దాదాపు పదేళ్ళు పడుతుందట ! అంటే, వారిలో సేవానిరతి యెంత అధికంగా ఉందో, మీరు ఊహించుకోవచ్చు. భక్తులు పాలరాతి మెట్లపై జారిపోకుండా, రబ్బరు తివాసీలు పరిచారు. ఒక ప్రక్క మనం నడుస్తుంటే, మరో ప్రక్క, తివాసీల పైనుండి, గుడ్డతో, చీపుర్లతో, మన పాద ధూళిని శుభ్రం చేస్తుంటారు కొందరు ! ఆలయం చుట్టూ ఉన్న, పవిత్రమైన ఆ దుఃఖ నివారిణి సరస్సులో దిగి, ఆ జలాన్ని తమ శిరస్సుపై జల్లుకుని, స్నానాలు చేసి, త్రాగి వచ్చే భక్తుల పాదముద్రల్ని, తడి గుడ్డలతో శుభ్రం చేస్తూ ఉంటారు కొందరు. పెద్ద పెద్ద కోట్లు తొడుక్కున్న ధనవంతులు, అక్కడి భక్తులకు ఆలయం వెలుపల నాలుగు దిశల్లో ఉన్న నిర్మాణాలలో, నీటిని అందించి, ఆ ఎంగిలి బొచ్చెలు కడుగుతూ కనిపిస్తారు. సాంఘికంగా గొప్ప గుర్తింపు ఉన్నవారు సైతం, అక్కడ ఉల్లిపాయలు తరిగి, ఆ కన్నీటిని ఆనందభాష్పాలుగా భావిస్తారు. భక్తులకు అందించే ‘లంగరు’ అనబడే భోజనం కోసం అవసరమైన ప్లేట్ ల సరఫరా, వంట సామాన్లు తేవడం, వండడం, బస్తాలకు బస్తాల ఉల్లి, బంగాళాదుంపలు, అల్లం , ఇతర కూరలు తరగడం, వెల్లుల్లి ఒలవడం, వడ్డించడం, తిన్న పళ్ళాలు తోమడం, తిరిగి కడిగిన పళ్ళాలు అందించడం వరకు... అంతా భక్తులే ఒక సేవగా భావించి చేస్తారు. వారికి, అక్కడకు తమ గురువు ఏ రూపంలోనైనా వచ్చి, తమ ముందే తిరుగుతారని ఒక గురి. అందుకే చేసే ప్రతి సేవా... గురుసేవగా భావించి, అత్యంత ప్రేమభావనతో చేస్తారు. ఆ సాత్విక వాతావరణంలోకి అడుగిడిన ఏ హృదయమైనా, వారి సేవాభావం చూసి, ద్రవించి, మున్యాశ్రమంలోకి వచ్చి తన క్రూరత్వాన్ని మరచిన సింహంలాగా ,పరిణామం చెందుతుంది.
ఒక్క స్వర్ణ దేవాలయంలోనే ఈ సేవలన్నీ జరుగుతాయని, మీరు అనుకుంటే, పొరబడినట్టే ! పంజాబ్ లో ఉంటున్న ఏ ఒక్కరూ... ఆకలితో పడుకోరని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే... ఇక్కడున్న ప్రతి గురు ద్వారా లోనూ, విధిగా, పేదా- గొప్పా తారతమ్యం లేకుండా భోజనం పంచుతారు. అంతే కాదు, వీరిలో సేవాభావం యెంత అధికమంటే... వేసవిలో కుటీరాలు వేసి, ప్రతి అర కిలోమీటర్ పరిధిలో షర్బత్ పంచుతారు. వారం, వర్జ్యం, ముహూర్తం తో పని లేకుండా, వారికి అనువైన ఏ రోజైనా, నడి రోడ్డుపై డేరాలు ఏర్పరచి, అక్కడే వండించి, రొట్టెలు, కూర, పూరీలు, పప్పు, హల్వా... వంటివి విరివిగా పంచుతారు. కారుల్లో తిరిగే దొరబాబులు సైతం పక్కకి వాహనాలు నిలిపి, ఇది గురుప్రసాదంగా భావించి, అత్యంత ఆదర భావంతో స్వీకరించి తింటారు. అలా తినగలగడం అదృష్టంగా భావిస్తారు.

ఇప్పుడు చెప్పండి... పిడిగుద్దుతో ఇతరుల్ని పిండి చెయ్యగల శక్తి ఉన్నా... ఇతరులను తమ గురువుగా భావించి, పాదధూళి తుడిచెంత నిరాడంబరత వీరికి ఎలా వచ్చింది. తమ బలాన్ని సరైన దిశలో వాడి, సన్మార్గంలో నడిచే సాధు వర్తన వీరికి ఎలా వచ్చింది. తమ గురువుల బోధల్ని చదివి, అక్షరాలా పాటిస్తున్నారు. సర్దార్ లు వీరులు, దేశభక్తులు, త్యాగధనులు, సేవానిరతులు, అన్నింటినీ మించి, గొప్ప గురుభక్తులు ... ఎందరికో ఆదర్శవంతులు ! వీరు తిరిగే పుణ్య భూమిలో ఉంటున్నందుకు నేను గర్వపడుతున్నాను. వీరిలోని ఒక్కొక్క భక్త పరమాణువుకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.

మంచి ఎవరివద్ద ఉన్నా, చూసి నేర్చుకోమన్నారు. మరి, వీరి నుంచి మనం నేర్చుకోదగ్గ అంశాలను మరొక్కసారి గమనించి, నాతో పాటు మీరూ సగర్వంగా అనండి...” సర్దార్ దిల్దార్ హై, అసర్దార్ హై, ... సింగ్ ఈస్ కింగ్ “ అని.

(మొన్న అమృత్సర్ దర్శించినప్పుడు నా మనోభావాలకు అక్షరరూపం...)

Monday, January 5, 2015

మిధునం - మేధో మధనం

మిధునం - మేధో మధనం 
-------------------------------
 భావరాజు పద్మిని 

ఎప్పుడైనా 60 ల వయసు దాటిన మిధునాన్ని కలిసారా ? కలిస్తే వారి చర్చ ఇలా ఉంటుంది. వాళ్ళను కలవడానికి ఒక చుట్టాలామె వెళ్తుంది.

"ఏమే, ఎప్పుడొచ్చావ్ ?"
"3 రోజులు అయ్యిందండి..."
"మీ ఆయన, పిల్లలు అంతా బాగున్నారా ?"
"బాగున్నామండి, మీరు బాగున్నారా ?"
"ఆ, బాగున్నాం, ఇది నీ చిన్న కూతురా ? మీ పెద్దమ్మాయికి ఎన్నేళ్ళు ?"
"అవునండి, 13 డేళ్ళు ..."
"హా, నీ పెళ్లి ఎప్పుడయ్యిందే ? 98 లోనా ?"
"కాదండి, 2000 సం. లో "
"అవున్లే, నీ తాంబూలాలప్పుడు మేము వచ్చాం. కాని, మా చెల్లెలి మనవారాలి పెళ్లి కదూ, అందుకే నీ పెళ్ళికి రాలేకపోయాం."
వెంటనే... మేధో మధనం మొదలు...
"ఏవిటీ, రత్న పెళ్లి అయ్యింది 98 లో ఈ పిల్ల పెళ్ళికి, మన కృష్ణుడు పుట్టాడు కదూ, అందుకే రాలేదు."
"ఏడిశావ్ , కృష్ణుడు 2001 లో కదూ  పుట్టాడు... ఏడాది ముందే అంటావేంటి ?"
"ఇదమ్మాయ్ ఈయన వరస, ఈ మధ్య ఎడ్డెం అంటే తెడ్డెం అంటారు. మనవడు పుట్టిన ఏడాది కూడా మర్చిపోయారు."
"చాల్లే సంబడం, ఈవిడకి మతిమరుపు పెరిగిందే అమ్మాయ్..."
పెదావిడ కాసేపు మౌనం, చూపులతో యుద్ధం...




"అన్నట్టు, మీ అమ్మగారి పుట్టింటి పేరు ఏవిటే..."
"ఆదూరి అండి..."
"ఓ ఆదూరి సుబ్బారాయుడు నీకు తెల్సుటే..."
నేను చెప్పే లోపే... పెద్దావిడ...
"ఏవిటి, సుబ్బారాయుడు ఇంటి పేరు ఆదూరి కాదు, జాస్తి..."
"ఏవిటే నువ్ మాట్టాడేది, నీ పీత బుర్రకు ఇంటి పేర్లు కూడా గుర్తా ?"
"ఏవిటి, నాది పీత బుర్ర అంటారా ? మీదే నత్త బుర్ర ?"
"అయితే నీది చీమ బుర్ర ..."
" అంతే లెండి, తిమిరి ఇసుమున తైలంబు అని... ఊరికే అన్నారా ?"
"నన్ను మూర్ఖుడు అంటావే ! పోన్లే, నువ్వే నాయకురాలు నాగమ్మవి. ఇదే పిల్లా వరస..."
ఈ సారి పెద్దాయన చూపుల యుద్ధం...

"అన్నట్టు, మీ అమ్మగారి స్వస్థలం ఎక్కడే ?"
"చేబ్రోలు అండి..."
"ఏదీ, మన గుంటూరు జిల్లా చేబ్రోలే !"
"కాదండి, పశ్చిమ గోదావరి జిల్లా ..."
" అలాగా, అక్కడ మట్టిగుంట సత్యవతి అనీ, మీకు తెల్సా !"
నేను భయంగా పెద్దావిడ వంక చూస్తూ... "లేదండి..." అంటుండగా... పెద్దాయన పెద్దావిడ వంక చూసారు.
" ఆ పెట్టండి పెట్టండి... అనకాపల్లి వాళ్ళని తీసుకెళ్ళి చేబ్రోలు లో పెట్టండి, ఒకళ్ళ ఇంటి పేరు ఇంకొకళ్ళకి తగిలించండి, ఏళ్ళు మర్చిపోయి... మీకు ఇష్టమొచ్చినప్పుడు పెళ్ళిళ్ళు, బారసాల లు చేసెయ్యండి... నాకెందుకు వచ్చిన గొడవ బాబూ !"
పకపకా నవ్వడం నా వంతు, పెద్దాయన వంతు అయ్యింది... ఎంతైనా, నిండు జీవితం పండించుకున్న దంపతుల గిల్లికజ్జాలు కూడా మధురమే కదా ! మీకూ ఇటువంటి సంఘటనలే ఎదురయ్యి ఉంటాయ్ కదా ! 


Monday, December 15, 2014

వెరైటీ తిళ్ళు

వెరైటీ తిళ్ళు 
-------------------
భావరాజు పద్మిని 

పొద్దుటే నిద్రకళ్ళు నులుముకుంటూ వంటింటి అధ్యాయానికి తెర తీస్తుండగా, కళ్ళ ముందు లీలగా కదిలింది...'భామా రుక్మిణి' సినిమాలో కమలహాసన్ లాంటి ఒక బామ్మ.

"ఏవిటే 'కుక్కు'తున్నావ్... అంది దబాయింపుగా..."

"బామ్మా, మనిషికి స్వప్న జాగృత్ సుషుప్తి అవస్థలు అని, 3 రకాల అవస్థలు ఉంటాయని నాకు తెలుసు. కాని, ఇవేవీ కాని 'స్కూలావస్థ ' లో మగ్గుతుంటే, ఇటులొచ్చి లేడీ నాగార్జున లాగా ప్రశ్నలు అడుగుట పాడియా ? చెప్పు ? "

" పాడి, కాదు పశువు కాదే అమ్మా ! పైలోకంలో కాసిన్ని మంచి పనులు చేసానా, యముడు మెచ్చి, అలా ఒక్కరోజు నీకు ఇష్టమైన చోట తిరిగి రా ! అని స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు. గూగుల్ సెర్చ్ లో బాగా కబుర్లు చెప్పేవాళ్ళు ఎవరా అని వెతికితే, 'కబుర్ల పోగు - భావరాజు పద్మిని' అని చెప్పింది. అందుకే ఇలా వచ్చా ! కాసేపు కబుర్లాడితే దీవించి వెళ్ళిపోతా అంతే ! "

" ఐతే ఓకే బామ్మా, టీ తాగుతావా..."

"వద్దు, ఆత్మలకి ఆకళ్ళు ఉండవు కాని, ఏవిటీ నలకల్లా కూరలు తరుగుతున్నావ్ ?"

"బామ్మా ! ఎన్నని చెప్పను నేటి అమ్మల కష్టాలు ? సొత్ , నార్త్ ఇండియా దాటి, చైనీస్, ఇటాలియన్, పొరుగింటి పుల్లకూరలు భారత్ కు వలస వచ్చేసాయ్. రకాలు పెరిగిన కొద్దీ, పిల్లల కోరికలు పెరిగాయి. ఇదిగో, రాత్రి ఇవాల్టి మెనూ లో 'హక్కా నూడుల్స్' కావాలని చెప్పి, పడుకున్నారు పిల్లలు. చైనా చింకి కళ్ళకి కనపడాలనేమో, కూరలు ఇలా నలకల్లా తరుక్కు చస్తారు. వాళ్ళని చూసి, మేమూ వాతలు పెట్టుకుంటున్నాం."

"ఎలాగెలాగ... హక్కు నూడలస్సా... అంటే ఏమిటి ? అసలు అచ్చ తెలుగు పిల్లవి, ఆ వంట ఎలా చేస్తావ్..."

"ఏముంది బామ్మా, మార్కెట్ లో పొడవాటి తాళ్ళ లాంటి ఈ ప్యాకెట్ దొరుకుతుందా, దీన్ని తెచ్చి, సగం ఉడకబెట్టి, సన్నగా తరిగిన ఈ కూరలు వేయించి, అందులో మాలాంటి అజ్ఞానుల కోసం చైనా వాడు కనిపెట్టిన 'చింగుల ఫార్ములా ' వెయ్యాలి ?"

"ఏవిటో నీ గోల, దీనికంటే, నరకంలో కేకలే బాగున్నాయ్... పాపాత్ములని కుండలో ఉడకబెట్టినట్టు, ఈ సగం ఉడకడం ఏవిటే అమ్మా, చిరుగుల ఫార్ము అంటే, కోళ్ళ ఫారం లాంటిదా ?"

"కాదు బామ్మా, అదొక పోట్లంలో పొడి. అది వేస్తే, ఆ రుచి వస్తుందన్నమాట . సగం ఉడికిన నూడుల్స్ అంటే, మళ్ళీ నూనెలో వేస్తే, అంటుకు పోకుండా, అలా ఉడకబెట్టాలి... ఒక్క ఐటెం వింటేనే  అలా కుదేలైపోతే ఎలా బామ్మా ? ఇంకా వేపుడు బియ్యం, వేడి కుక్క, పిజ్జా లు, బర్గర్ లు, పాస్తా లు, మంచురియా, మోమో లు, కేకు లు ... ఇలా నేటి అమ్మలు ఎన్ని చెయ్యాలో తెల్సా... "

"ఏవిటే ఇవన్నీ... కుక్కలూ, పిచ్చలూ నా ? ఈ తిళ్ళు అన్నీ వచ్చాకే రోగాలు ఎక్కువ అయ్యయేమో. ఎవడూ తేలిగ్గా చావడే . హాస్పిటల్లో మగ్గీ, మగ్గీ... వీళ్ళకి నరకంలో శిక్షలు అంటే కూడా ఎద్దేవా అయిపొయింది. మొన్నొకడు, నూనెలో వేగుతూ... హ హ కితకితలు... హైదరాబాద్ ఎండల కంటేనా ... అన్నాడు. ఇంకోడు కొండ మీద నుంచి దొర్లిస్తుంటే... హ హ... రోలరు కోష్టరు రైడ్ కంటేనా, అది తిరగేసి, మరగేస్తుంది అన్నాడు..."



"అవును బామ్మా, ఇప్పుడు మనుషులకి బోలెడు తిళ్ళు, బోలెడు కష్టాలు ! చిన్న వయసుల్లో షుగర్ లు, రోగాలు, హార్ట్ ఎటాక్ లు... బయటి తిళ్ళు... కాని, ఎన్ని తిన్నా నేను జన్మలో మర్చిపోలేని తిండి ఒకటుంది చెప్పనా ?"

"ప్రొసీడ్...."

"వెన్నెల్లో పీటేసుకుని, చుట్టూ మనవళ్ళని, కొడుకుల్ని, కోడళ్ళని, మనవరాళ్ళని కూర్చోపెట్టుకుని,  చద్దన్నంలో బెల్లపావకాయ కలిపి, ఓ గిన్నెడు నెయ్యి పోసి, దబ్బపండంత ముద్ద కలిపి, మా చేతిలో పెట్టేది మా బామ్మ. రెండు ముద్దలు తింటే, కడుపు నిండిపోయేది. ఆ రుచి, ఇప్పుడు ఎన్ని రకాలు తిన్నా రాదనుకో..."

"అవునే పిల్లా, నిజమే !"

"మరి బామ్మా, నీకు బోలెడు కబుర్లు చెప్పాగా, నాకు నరకంలో శిక్షలలో స్పెషల్ డిస్కౌంట్ ఇప్పిస్తావా ?"

"హమ్మా, ఎక్కడన్నా బామ్మ కాని, బాసు యముడి దగ్గర కాదేవ్... ఇంకాసేపు ఉంటే, వరాలు కూడా అడుగుతావేమో ! నేను డింగ్... నువ్వు చింగ్..."

" బామ్మా , దీవించడం మర్చిపోయావ్.... ఆగాగు..."

Wednesday, December 10, 2014

పేర్ల గిన్నెలు

పేర్ల గిన్నెలు 
----------------
భావరాజు పద్మిని - 10/12/14 


అప్పట్లో నేను 6వ తరగతి చదువుతున్నా. నాన్నగారి ఉద్యోగరీత్యా మేము గుంటూరు జిల్లా భట్టిప్రోలు కు బదిలీ అయ్యి వెళ్లి, అక్కడి టి.ఏం.రావు  పాఠశాల లో చేరాము. అక్కా, నేను ఆటల్లో, పాటల్లో, నాట్యంలో, చదువులో మేటి. మమ్మల్ని 'ఆలూరి సిస్టర్స్ ' అనేవారు. స్కూల్ మధ్యమధ్య రకరకాల పోటీలు పెట్టి, బహుమతులు ఇచ్చేది. అప్పుడు మాచేత ప్రార్ధనా గీతాలు, నాటకాలు, స్వాగత నృత్యాలు చేయించేవారు. తర్వాత బహుమతుల కార్యక్రమం మొదలవగానే... ఒకటి తరువాత ఒకటిగా ప్రైజులు చాలా వరకు నాకూ, అక్కకే వచ్చేవి.
వాటిలో కొన్ని పుస్తకాలు ఉండేవి. కాని, ఆ ప్రైజుల్లో చాలా వరకూ ఊర్లో ఉన్న వారు స్పాన్సర్ చేసేవారు. అవి ఏమిటంటే...

పెద్ద స్టీల్ గ్లాసు, మగ్గు, గుండు చెంబు, పళ్ళెం, గిన్నెలు వంటివి. అప్పట్లో ప్లాస్టిక్ వస్తువుల వాడకం లేదు. అన్నీ స్టీల్ వే ! ఊర్లో జరిగే చిన్న చిన్న వేడుకలకు సైతం పేరంటాళ్ళు స్టీల్ వస్తువులే న్యూస్ పేపర్ లో చుట్టి ,ఇచ్చేవారు. అలా 6,7,8, తరగతులు పూర్తి అయ్యేసరికి, మా దగ్గర ఒక చిన్న స్టీల్ కొట్టు పెట్టుకునేన్ని సామాన్లు పోగయ్యాయి. అమ్మ కొన్ని వాడేది, కొన్ని నీ కాపురానికి అని అటకమీద దాచేది(వాటిలో చాలా తుప్పు పట్టేసాయి)... కొన్ని ఇచ్చేసేది...



ఇక్కడితో కధ అయిపోతే సరదా ఏముంది ? ఇదివరలో తమ గిన్నెలు ఇరుగూ పొరుగూ పుల్ల కూర రుచి కోసం మార్చుకున్నప్పుడు, మారిపోకుండా, వాటి మీద పేర్లు రాసుకునే అలవాటు.   తాము ఇచ్చిన గిన్నె బహుమతి అందుకున్న వారు వేరే వారికి ఇవ్వకూడదన్న ఉద్దేశంతో, స్టీల్ కొట్లో వస్తువు కొనగానే...' చి.ల.సౌ. దమయంతి వివాహ సందర్భంగా లక్ష్మీకాంతమ్మ, కాసులయ్య అందించిన కానుక ' అని రాసేవారు. అయితే, అప్పటికప్పుడు కానుకలు సిద్ధంగా లేనివారు, ఆ స్టీలు గిన్నె షాప్ కు తీసుకెళ్ళి, ఆ పేర్లు కొట్టించి, ఇంకో పేర్లు రాయించేవాళ్ళు. ఎవరైనా చనిపోతే, వారి జ్ఞాపకార్ధం కూడా స్టీల్ గిన్నెలు ఇచ్చేవారు.
మొత్తానికి, స్కూల్ దాకా వచ్చేసరికి ఆ గిన్నెలకు పేర్లు గొప్ప, గిన్నె కురచ లాగా ఉండేవి. అంతగా చదువుకోని ఆ ఊరి జనానికి స్టీల్ కొట్టు వాడే గతి. కొన్ని సార్లు ఒత్తులు, పొల్లులు ఎగిరిపోయేవి. అది చదవబోతే ఇలా ఉండేది.
'కీ.శే. అనంతరామయ్య పుష్పవతి అయిన సందర్భంగా  అందిస్తున్న కానుక..."
" కృష్ణమూర్తి గారి శ్రీమంతం సందర్భంగా వారి జ్ఞాపకార్ధం అందిస్తున్న కానుక..."
"దాని అమ్మ (దానమ్మ ) జ్ఞాపకార్ధం వారి కుమారుడు వెంకటరత్నం , కోడలు వెంకాయమ్మ అందిస్తున్న బహుమతి..."

ఇలా తీసివేతలు, కొట్టివేతల తో ఉన్న గిన్నెలు ఇప్పటికీ ఎక్కడైనా కనిపిస్తే, నా పెదాలపై చిరునవ్వు పూసేస్తుంది. ఏమైనా కష్టించి గెల్చుకున్న బహుమతి, కల్మషం లేని బాల్యం ఇవన్నీ జీవితపు పుటల్లో మధుర జ్ఞాపకాలు... కదూ !

మహాత్ములను తెలుసుకోవడం ఎలా ?

మహాత్ములను తెలుసుకోవడం ఎలా ?  

ప్రస్తుతం గారడీలతో పలువురు అనేక విధాలుగా మోసగిస్తున్న తరుణంలో, మాహాత్ములకు, గారడీ వాళ్లకు ఉన్న అంతరాన్ని గుర్తించేందుకు పెద్దలు చెప్పిన కొన్ని శ్లోకాలు, వాటి అర్ధాలు, మీకు ఇక్కడ ఇస్తున్నాను.

మహత్వ కార్యం క్రియతే మహద్భిః
హరేర్మహత్వ ప్రతిపాదనార్ధం |
ద్రష్టుశ్చ బుద్దేః పరివర్తనార్ధం
తద్భో మహాత్వస్య పరా పరీక్షా !

మహాత్ములు భగవంతుడి శక్తిని చూపించేందుకూ, చూసేవారిలో మంచి పరివర్తన కలిగించేందుకూ , మహిమలు చేస్తూ ఉంటారు. ఒక పని మాయా, మహత్తా అని నిరూపించేందుకు ఇదే చివరి పరీక్ష !

కో వేంద్ర జాలస్య మహాత్మనశ్చ
యధేష్ట సృష్టి ప్రణవస్య భేదః
ఏకశ్చమత్కార గతార్ధశక్తిః
మనఃపరీవర్తన చుంచురస్య |

గారడీ వాడు, మహాత్ముడు, ఇద్దరూ తలచుకున్నవి సృష్టి చేసేవారే. ఇద్దరిలో తేడా ఏమిటి ? ఒకరి శక్తి చూపరుల్లో ఉల్లాసం కలిగిస్తే, రెండవవారి శక్తి చూపరుల హృదయాలలో పరివర్తన కలిగిస్తుంది.



అంటే, వారు చేసే కార్యం వల్ల భగవంతుడి మహత్తు వెల్లడి కావాలి, ఆ కార్యం చూస్తున్న నీలో ఒక మంచి మానసిక పరివర్తన రావాలి. ఒక్కొక్కసారి అటువంటి కార్యం వల్ల నీలో తాత్కాలిక ప్రశాంతత రావచ్చు. లోకసామాన్యమైన వస్తువుల వల్ల తాత్కాలిక శాంతి కలిగితే, లోకాతీతమైన వస్తువు, అంటే భగవంతుడి వల్ల శాశ్వత శాంతి కలుగుతుంది. అందుకే మీ హృదయాన్ని మీరే చదవాలి ? ఎలా ?

హృదయంలో వ్యక్తమయ్యే అవ్యాజమైన ప్రశాంతతే అసలైన పరివర్తన. హృదయమంటే ఏమిటి ? గురువును ఎలా తెలుసుకోవడం ?

హృదయం నామ కిమితి
స్వతో వేత్స్యసి చింతనాత్ |
ప్రత్యభిజ్ఞాయతే శాంత్యా
హృదయే సద్గురుస్సఖే ||

మిత్రుడా ! హృదయమంటే ఏమిటో ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. ఆ హృదయంలో శాంతి కలగడం ద్వారా నీవు నీ గురువును గుర్తు పట్టవచ్చు. ఎవరి సన్నిధిలో నీ హృదయం ప్రశాంతంగా ఉంటుందో వారే నీ గురువు.

చూసేవారిలో, అటువంటి శాంతిని తీసుకు రాలేనిది మహత్తు కాదు, గారడీ మాత్రమే !

(శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి - 'సూక్తి మాల- నీతి మంజరి' అనే పుస్తకం నుంచి, సేకరణ.)

Sunday, November 16, 2014

అమ్మ మనసు

అమ్మ మనసు (చిత్రం : పొన్నాడ మూర్తి గారు )
-------------------------------------
భావరాజు పద్మిని - 16/11/14
--------------------------------------
"నీకు బుద్ధుందా ? అన్నీ అల్లరి పనులే ! నీతో వేగలేక చస్తున్నానే !"
"ఏవిటో శ్రీమతిగారు చాలా కారంగా ఉన్నారు..."
"ఉండకేం చెయ్యమంటారు... చూడండి... ఏమీ తెలీనట్టు అమాయకంగా ఎలా మొహం పెట్టుకు చూస్తోందో. బాత్రూం నుంచి మగ్గు తో నీళ్ళు తెచ్చి హాల్ నిండా పోసేసింది. ఇప్పుడు ఇదంతా తుడవాలి..."
"ఏం తల్లీ, ఎందుకలా చేసావ్..."
చక్కగా నవ్వుతూ నాన్నని బుట్టలో పడేసి ఎత్తుకోమంటూ చేతులు చాస్తుంది పాప. ఇంకేముంది... ఇద్దరూ హత్తుకుని, నవ్వుకుంటారు...ఒకే పార్టీ !
"ఆ, ఆ , దాన్ని అలాగే నెత్తినెక్కించుకోండి.... ఇంకా అల్లరి చేస్తుంది... రాలుగాయి..."
____________________________________________________________________

"ఇలాంటి వెధవ్వేషాలు ఇంకో సారి వేసావంటే చావగొడతా ! రోజురోజుకీ నీ అల్లరి ఎక్కువౌతోంది..."
"మళ్ళీ ఏమయ్యింది..."
"ఆ మొహం చూడండి... పౌడర్ డబ్బా అంతా ఓంపేసి, భూతంలా మొహం నిండా పౌడర్ పట్టించుకు కూర్చుంది. చీకట్లో దబదబా నడుస్తూ, కిందున్న పౌడర్ వల్ల జారిపడబోయి, మంచం కోడు పట్టుకు చూద్దును కదా, దెయ్యంలా మంచం మూల నక్కి కూర్చుంది... హడిలి చచ్చాను..."
గట్టిగా నవ్వేసి, "అంతే కదా ! పోనీ ఆ పౌడర్ నేను తుడుస్తాలే ! కోప్పడకు... నువ్వు రా తల్లీ..."
చటుక్కున చంక ఎక్కేసి, అమ్మను వెక్కిరింతగా చూస్తుంది పాప...




కోపంగా పాపను తిట్టేస్తోంది అమ్మ...." అసలు... నిన్ను కాదే ! మీ నాన్నని అనాలి. అతి గారం చేసి, నిన్ను చెడగోడుతున్నారు..."
"ఓహో, ఈ సారి సమిష్టి యుద్ధమా ! ఇంతకీ నా అందమైన పెళ్ళానికి కోపం ఎందుకొచ్చిందో !"
"మీ మార్కెటింగ్ తెలివితేటలు నా దగ్గర కాదు ! ఇదేం చేసిందో తెల్సా ? పాలవాడు వచ్చాడని, తలుపు తీసి, పాల గిన్నె తేవడానికి వెళ్తే, ఈ లోపల బైటికి పారిపోయి, పక్కింటి డాబా సన్ షేడ్ మీద ఎక్కి, అమ్మా, నేను ఎక్కడున్నానో చెప్పుకో... " అంది. అక్కడి నుంచి పడితే... హమ్మో, నా గుండె జారిపోయింది. అయినా తమాయించుకుని, భలే వెళ్ళావ్, ఎలా వెళ్ళావో, అలాగే రా..." అని పిలిచాను, రాగానే బడితె పూజ చేసేసా. అదిగో, ఆ మూల కూర్చుని ఏడుస్తోంది. క్షణం చూపు తిప్పుకుంటే చాలు, సబ్బు ముక్కలా జారిపోతూ ఉంటుంది. దీన్ని పెంచడం నా వల్ల కాదు...
నాన్న, పాప మళ్ళీ షరా మామూలే !

___________________________________________________________________

"రెండు రోజుల నుంచి తినవు, తాగవు, నిద్రపోవు... కాస్త రెస్ట్ తీసుకో."
"ఎలాగండీ. చిన్నది అలా జ్వరం తో పడుకుని ఉంటే, నాకు ఏం తోస్తుంది చెప్పండి "
"అది అల్లరి చేసిందని తిడతావ్ కదా !దాన్ని విసుక్కుని, కసురుకుని, కొడతావ్ కదా ! ఇప్పుడు అది అల్లరి చెయ్యకుండా ఒక చోటే పడుందిగా , ఇంకేంటి నీ సమస్య ?"
"అదలా పడుకుని ఉండడమే సమస్య ! ఏ తల్లికి అయినా బిడ్డ సందడిగా తిరుగుతూ, ముద్దు మాటలు చెబుతుంటే సంబరం కాని, అది ఇలా నీరసంగా పడుకుని ఉంటే... నా ఒంట్లోని శక్తి అంతా ఎవరో పిండేసినట్టు ఉందండీ ! నేనూ చిన్నప్పుడు అల్లరి చేసిన దాన్నే కదా ! పిల్లల అల్లరి అమ్మకు ఇష్టమే ! కాని, కోప్పడి కాస్త నియంత్రించక పొతే... దానికి మంచేదో, చెడేదో ఎలా తెలుస్తుంది..."
"అయితే... దాని అల్లరి నీకూ ఇష్టమేనా !"
"అవునండి... నేనూ పక్కకెళ్ళి నవ్వుకుంటా ! చూడండి, ఎలా ఒళ్ళు తెలీకుండా పడుకుందో... మాయదారి జ్వరం నాకైనా వచ్చింది కాదు ! ఏం మాట్లాడరే ! అలా నా వంక ఎందుకు చూస్తున్నారు ?"
............................................................ ఎందుకంటే....
"అమ్మ మనసు అంటే ఏవిటో... నాకు ఇవాళే తెలిసింది...."