కవితలు రాయండిలా !
కవితలు రాయడంలో నాకు తెలిసిన కొన్ని
మెళకువలు చెప్పమని ఒకరు అడిగారు. ఎలాగూ చెప్పాలని అనుకున్నప్పుడు నాకు తెలిసినంత
వరకు అందరికీ చెబితే, కొందరైనా, కనీసం ఒక్క అంశమైనా నేర్చుకుంటారు కదా, అన్న చిన్న ఆశ
కలిగింది. అందుకే ఈ పోస్ట్ ! అసలు కవిత్వం ఎలా మొదలవుతుంది?
ఏదైనా ఒక అంశం మన మనసుకు బాగా
హత్తుకున్నప్పుడది, స్పందిస్తుంది. అలా స్పందించిన మనసు ఆయా సందర్భాలను బట్టి, అనేక రకాలైన
భావోద్వేగాలకు గురౌతుంది. ఆ 'భావము' అనే ప్రవాహిని,
మనసంతా నిండిపోయి, అక్షరాలై
ప్రభావించాలని బలంగా అనుకున్నప్పుడు ప్రతి మనిషిలోంచి ఒక కవి పుడతాడు. అయితే, ఆ భావాలను
వ్యక్తపరిచే విధానం ఆ వ్యక్తి పెరిగిన విధానం మీద, వాతావరణ పరిస్థితుల మీద, చదివిన పుస్తకాల
స్థాయి మీద, విన్న కధల మీదా... వెరసి ఆ వ్యక్తి బాల్యంలో భావాలు సుసంపన్నమయ్యే
దశలో అతనికి తారసపడ్డ వివిధ స్థితిగతుల మీదా ఆధారపడి ఉంటుంది. మంచి పాఠకుడే మంచి
రచయత అవుతాడన్నది నిశ్చయం ! ప్రస్తుతం ఫేస్బుక్ వంటి మాధ్యమాల ద్వారా
అందరికీ రాసేందుకు ఒక 'వేదిక' దొరకడంతో కొత్త కలాలు ఎన్నో రెక్కలు తొడుక్కుంటున్నాయ. అయితే, 'అదిగదిగో గోడ, గోడ పక్కన దూడ' వంటి కవితలకు కూడా
ఓ ఇరవై లైక్ లు, ఓ పది కామెంట్లు ... నువ్వస్సలు తగ్గద్దు భయ్యా... రాయి, ఇంకారాయి, అని
ప్రోత్సహించేవారు రావడంతో తెలుగు భాష ఒకానొక దీన స్థితికి దిగజారిపోతోంది. ఎవరో
పెద్దాయన చెప్పిన మాటలు... "భాషాదోషం వాఙ్మయానికి ముప్పు. వాఙ్మయదోషం సంస్కృతికి ముప్పు.
సంస్కృతిదోషం సత్యస్థితికి ముప్పు." అలా జరిగినప్పుడు ఇక మానవజన్మ వలన ఉపయోగం
ఏముంటుంది? అందుకే ఏది చేసినా, రాసినా సరిగ్గా నేర్చుకుని రాస్తే
బాగుంటుంది కదా !
·
ముందుగా అసలు కవి ఏమి
చెప్పదలచుకున్నారో, ఆలోచన స్పష్టంగా ఉండాలి. స్పష్టమైన ఆలోచన, స్పష్టమైన భావాలకు,
స్పష్టమైన భావం స్పష్టమైన భాషకు, వ్యక్తీకరణకు దోహద పడుతుంది. ఏదో ఒకటి రాయాలి
కదా, అని రాసి పారెయ్యడం, గొప్ప కాదు. మనం అనుకున్నది మన భావంలో వస్తోందా, అది
చదివేవారి మనసుకి హత్తుకునేలా ఉందా లేదా అని సమీక్షించుకోవాలి.
·
నిజమే, కవిత్వానికి ఏ లయ, ఛందస్సు
లేదు. కాని మనం వాడే వాక్యాల్లోని, చివరి పదాలు ఒక ప్రాసలో కలిసినప్పుడు ఆ కవితకు
ఒక అందం వస్తుంది. ఉదాహరణకు –
o “గాఢపు
మబ్బులు గగనము కమ్మెను
మరలక తప్పని సూర్యుడు దాగెను
ఆర్తిగ సెగలతొ అవని వేచెను
గాలుల సవ్వడి సేదను దీర్చెను
ఎప్పుడెప్పుడని ఎదసడి అడిగెను
తొలకరి తపనలు తీర్చే తరుణం !”
o ఇందులో కమ్మెను, దాగెను, వేచెను, తీర్చెను, అడిగెను... వంటి
పదాలు చివర్లో వాడడం వలన కవితకు ఒక అందం వస్తుంది. కవిత వేరు, వచన వాక్యం వేరు. కవితల్లోని
వాక్యాలను ఒక దాని ప్రక్కన మరొకటి పెట్టుకు చూస్తే, అది పారాగ్రాఫ్ చదివినట్లు
ఉంటే కనుక, ఆ కవిత పండనట్లే.
·
కవితల్లో ఒక వాక్యం చాంతాడంత
పొడుగ్గా, మరో వాక్యం మొలతాడంత పొట్టిగా ఉంటే బాగోదు. వాక్యాలన్నీ దాదాపుగా ఒకే
నిడివిలో ఉండేలా చూసుకుంటే, కవిత శిల్పంలో ఒక అందం వస్తుంది. రేపటి రోజున ‘మనం ఏం రాసామా ‘ అని వెనుదిరిగి
చూసుకున్నప్పుడు, అప్పటికీ ఇప్పటికీ మనతో మనమే పోల్చుకున్నప్పుడు, ఒక పరిణితి
కనపడాలి. ఆ దిశగా సాధన చెయ్యాలి. బాగా
రాయట్లేదు అని మనకి అనిపించినప్పుడు, పెద్ద పెద్ద కవులు ఎలా రాసారా అని చదివి,
తెలుసుకోవాలి, నేర్చుకునే ప్రయత్నం చెయ్యాలి.
·
"నేను రాసే ప్రతి అక్షరానికి నేను బాధ్యత వహిస్తాను. ఇక్కడ ఇది
ఎందుకు రాసావు? అని ఎవరైనా అడిగితే, సమాధానం చెప్పేందుకు నేను
సిద్ధంగా ఉన్నానో లేదో అని, నేను రాసిన వాటికి, నేనే విమర్శకుడిగా, ఒకటికి
పదిసార్లు చదువుకుని చూస్తాను." - అన్నారొక ప్రముఖ రచయత. ఒక కవితను రాసాకా, అక్కడ
ఆ పదం బదులు ఇంకో పదం పెట్టవచ్చా, అలా పెడితే నడక, భావం ఇంకా బాగుంటుందా అని మళ్ళీ
మళ్ళీ ఆలోచించుకోవాలి. అలాగే నేను సిరివెన్నెల గారిని కలిసినప్పుడు ‘మీ రచనలకు
ఎప్పుడైనా విమర్శలు ఎదుర్కున్నారా?” అని అడిగాను. దానికి వారిచ్చిన సమాధానం –
‘లేదమ్మా, నాకు నేనే పెద్ద విమర్శకుడిని, ఒకటికి పదిసార్లు సమీక్షించుకుంటాను.
అందుకే ఇంత వరకు, ఏ విమర్శా ఎదుర్కోలేదు,” అన్నారు. – అంతటి వారే ఇలా ఉంటే, మనమెంత
చెప్పండి? ఆచరిద్దాం !
·
సమాజంలో ఉన్న రుగ్మతలను కవి
ఖచ్చితంగా ఎత్తి చూపాల్సిందే ! అయితే, ప్రతి భావానికి ఒక కట్ ఆఫ్ లైన్/బోర్డర్
లైన్ ఉంటుంది. మనం కవులం, కళాకారులం కాకపోయినా ముందు మంచి పౌరులవ్వడం, ఎవరినీ
నొప్పించక పోవడం ముఖ్యం కదా ! కవి కోపంలో కాని, ఆందోళనలో కాని, ఆవేదనలో కాని, లేదా
ఎటువంటి భావోద్వేగాలకు గురైనా ఆ ‘బోర్డర్ లైన్’ దాటకుండా జాగ్రత్త వహించాలి. దీని
ద్వారా ఎవరైనా బలంగా నొచ్చుకుంటారా అని ఆలోచించాలి. లేకపోతే, పడగ్గదిని పబ్లిక్ కి
తెచ్చే విచ్చలవిడి శృంగార కవితలు, క్షుద్ర కవితలు, శ్మశాన కవితలు, పైశాచిక ప్రేమ
కవితలు తయారౌతాయి. దురదృష్టం ఏమిటంటే, ఇటువంటివి ప్రముఖ పత్రికలూ అచ్చు
వేస్తున్నాయి. ఇటువంటి కవితలు రాయడం కంటే రాయకపోవడమే మంచిది. కవి తను రాసిన ప్రతి అక్షరాన్ని
చెలియలి కట్ట దాటకుండా చూసుకోవాలి. అప్పుడే ఆ భావావేశం ఉత్తుంగతరంగం అవుతుంది.
·
వైవిధ్యమైన కవితలు రాయడం, సమకాలీన అంశాలను
స్పృశించడం, రచనల్లో చాలా ముఖ్యం. అమ్మ, ప్రేమ, ప్రేమ వైఫల్యం వంటివి చాలామంది
సాధారణంగా కవితా వస్తువులుగా తీసుకుంటూ ఉంటారు. అవే తీసుకున్నా, కొత్తగా, మనదైన
కోణంలో ఏమైనా చెప్పగలిగామా అని చూసుకోవాలి, విభిన్న అంశాలపై రాయాలి. వీలయితే పామర
భాష నుంచి పండిత భాష వరకు విభిన్న పోకడలను, ప్రాంతీయ యాసలను వాడే ప్రయత్నం
చెయ్యాలి.
·
అన్నిటికంటే ముఖ్యంగా కవికి కావలసింది నిశిత
పరిశీలనా దృష్టి. ముఖ్యంగా యువతరం కవితల్లో చాలా భాషా దోషాలు కనిపిస్తున్నాయి.
తాను ఏవైనా పదాలు తప్పుగా రాసానా, అని గమనించుకుని, ఒక పుస్తకంలో వాటిని రాసుకుని,
మళ్ళీ రాసినప్పుడు అదే పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలి. అలా క్రమం తప్పకుండా
చేస్తే, రోజురోజుకూ భాషా జ్ఞానం మెరుగవుతుంది.
·
పెద్దలు, అనుభవజ్ఞులు ఇచ్చే సూచనలను
స్వీకరించండి. వీలయితే దిద్దుకోండి. అంతే కాని, వారేదో అసూయతో చెప్పారన్న అపోహలో ,మూస
పద్ధతిలో రాసుకుంటూ పోవడం మంచిది కాదు. కటువైన విషయమైనా మెత్తటి చెప్పుతో
కొట్టినట్లు చెప్పండి. అతిగా రాసే వారికి, అతిగా తిట్టేవారికి అంతా దూరంగా
జరుగుతారని మరువకండి.
ఇంకా నేను ఏవైనా మరచి ఉంటే, పెద్దలు
విన్నవించగలరు. నేను ఎప్పటికీ నిత్య విద్యార్దినినే. పలక పట్టుకు వెళ్తున్న
పసిపాపలా అక్షరాలు చెరిపేసి, మళ్ళీ దిద్దుకోడానికి సిద్ధమే. నాకు తెలిసిన ఈ
విషయాలు భావి కవులకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. కృతజ్ఞతాభివందనలతో
భావరాజు పద్మిని
23/2/17
ఎంతో విలువైన సూచనలకు అభివాదాలు,
ReplyDeleteసదా ఆచరణ లో పెట్టడానికి సాయ శక్తులా ప్రయత్నిస్తాను
వర్ధమాన రచయితలకు ఉపయోగపడే చాలా విలువైన సమాచారం అందించారు
ReplyDeleteకృతజ్ఞతలు
చాలాబాగా చెప్పారండీ ...ఇప్పుడు రాసేవారందరూ ముప్పాతిక భాగం రాసేది మాటలే అంత్యప్రాసలు లేవుాపదాలకు అర్ధాలడిగితే చెప్ఫలేరు ...అన్ని రూల్స్తో భావ వ్యక్తీకరణ చేసేవారివి అసలు లెక్కలోకే తీసుకోవట్లేదు...
ReplyDeleteచాలాబాగా చెప్పారండీ ...ఇప్పుడు రాసేవారందరూ ముప్పాతిక భాగం రాసేది మాటలే అంత్యప్రాసలు లేవుాపదాలకు అర్ధాలడిగితే చెప్ఫలేరు ...అన్ని రూల్స్తో భావ వ్యక్తీకరణ చేసేవారివి అసలు లెక్కలోకే తీసుకోవట్లేదు...
ReplyDeleteబాగ చేప్పారండి
ReplyDeleteఅద్భుతం
ReplyDelete